పొట్టేలు పేరుతో కుక్క మాంసం అమ్మకం
సాక్షి, మైలవంరం(కృష్ణా): అడవి జంతువులు, పొట్టేలు మాంసం పేరుతో కుక్కల మాంసం విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణాజిల్లా జి.కొండూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన కట్టా ఆదినారాయణ, సేగు లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు గ్రామంలో తిరిగే కుక్కలను చంపి వాటి మాంసాన్ని పలు హోటళ్లు, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు పలువురు గుర్తించారు.
పక్కాగా వీరిని పట్టుకోవడం కోసం నిఘా పెట్టిన గ్రామస్థులు నిన్న మధ్యాహ్నం గ్రామ శివారులో ఓ కుక్కను చంపి దాని చర్మం తీస్తుండటం గుర్తించి వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇలాగే కుక్కలను హతమార్చి ఆ మాంసాన్ని అటవీ జంతువుల మాంసంగా నమ్మించి మైలవరం రెస్టారెంట్లలో రూ. 400 కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులకు తెలిపారు.