-
కేఏఎస్ అధికారి భార్య ఆత్మహత్య
యశవంతపుర: కేఏఎస్ అధికారి భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో జరిగింది. సంజయనగర పోలీసుస్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న కేఏఎస్ అధికారి శివకుమార్ భార్య చైత్రా హైకోర్టు వకీలు. శుక్రవారం రాత్రి ఇంటిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియటంలేదు. మృతురాలి సోదరుడు ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా సంజయనగర పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మృతిపై అనుమానాలుచైత్ర భర్త శివకుమార్ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థలో సబ్ డివిజనల్ అధికారిగా ఉన్నారు. చైత్రతో ఆయనకు 2016లో వివాహమైంది, వారికి ఐదేళ్ల కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి ఆయన డ్యూటీ నుంచి ఇంటికి రాగా, భార్య అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే స్థానిక సంజయనగర పోలీసులకు కాల్ చేశారు. చైత్ర హైకోర్టు లాయరుగా పనిచేస్తూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. ఆమె షటిల్ బ్యాడ్మింటన్ వంటి ఆటల్లోనూ ప్రావీణ్యురాలు. ఆమె మృతిని నమ్మలేకపోతున్నట్లు బంధుమిత్రులు తెలిపారు. ఎంతో చలాకీగా ఉండేదని, ఆత్మహత్య చేసుకుందంటే నమ్మశక్యంగా లేదని అనుమానాలను వ్యక్తం చేశారు. పోలీసులు కేసు విచారణ చేపట్టారు. -
పురస్కారాలతో చిన్నారుల్లో ఆసక్తి వృద్ధి
బళ్లారి అర్బన్: ప్రతిభా పురస్కారాలతో చిన్నారుల్లో నేర్చుకునే ఆసక్తి పెరుగుతుందని స్థానిక రెయాన్ పాఠశాల చైర్మన్ కే.ఎం అబ్దుల్ అజీజ్ తెలిపారు. రూపనగుడి రోడ్డులోని రెయాన్ పాఠశాలలో రాజ్యసభ సభ్యుడు నాసీర్ హుస్సేన్ అకాడమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ద్వితీయ వార్షికోత్సవంలో ప్రతిభా పురస్కరాలు, స్కాలర్షిప్లను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. ఈ స్కాలర్షిప్ పొందడానికి 1 నుంచి 10వ తరగతి వరకు సుమారు 150 మంది విద్యార్థుల మేధాసక్తిని పరీక్షించి అందులో 10 మందికి ప్రథమ బహుమతి, అలాగే రెండో బహుమతిగా మరో 10 మందిని మొత్తం 20 మంది విద్యార్థులను రూ.1 లక్ష మొత్తం రివార్డుని ప్రదానం చేస్తామన్నారు. ఈ మొత్తం ఎంపీ నాసీర్ హుస్సేన్ పేరున అందిస్తామన్నారు. ఈ నగదుతో విద్యార్థులు తమ భవిష్యత్తుకు అనుకూలం అయ్యేలా వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 24 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవేశాలను పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో వక్ఫ్బోర్డు మాజీ అధ్యక్షులు హుమాయూన్ఖాన్, బస్మా అధ్యక్షుడు మరిస్వామి రెడ్డి, ప్రముఖులు బంబందాదా, యూనుస్సాబ్, కణేకల్ జిలాన్, కణేకల్ అబ్దుల్, ఆదిల్షా, ఫిరోజ్తో పాటు పాఠశాల పాలక మండలి సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
క్లీన్చిట్ కోసం సీబీఐకి ఇవ్వాలా: మంత్రి
శివాజీనగర: లైంగిక దాడులు, అశ్లీల వీడియోల కేసుల్లో చిక్కుకుని విదేశాల్లో తల దాచుకున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్కు ప్రత్యేక తనిఖీ దళం (సిట్) ఒక బృందాన్ని నియమించింది. విదేశాల్లో ఎక్కడ ఉన్నాడో కనిపెట్టి అరెస్ట్ చేసి బెంగళూరుకు తీసుకొచ్చేందుకు సిట్ కార్యాచరణ చేపట్టింది. ప్రజ్వల్ అరెస్టు కోసం ఇదివరకే బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయ్యింది. ఒక ఎస్పీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్ఐలతో కూడిన సిట్ బృందం ఐరోపా ఖండానికి వెళ్లనుంది. అక్కడ హంగేరి, జర్మనీ దేశాల్లో ప్రజ్వల్ కోసం గాలించనుంది. భారత, జర్మనీ వద్ద న్యాయ సహకార ఒప్పందం గురించి తెలుసుకుని ఆ మేరకు ప్రజ్వల్ను తీసుకురావడంపై కసరత్తు చేస్తున్నారు. సీబీఐ, ఇంటర్పోల్ అధికారులతో ఒకసారి చర్చలు జరిపారు. ప్రజ్వల్ ఎంపీ కాబట్టి కొన్ని ప్రత్యేక హక్కులు కలిగిన పాస్పోర్ట్ ఉంది, దాంతో ఆయన కొన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఫలితంగా ఆచూకీని కనిపెట్టడం కష్టంగా ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. ఒకటి రెండు రోజుల్లో ప్రజ్వల్ కోసం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే అవకాశాలున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ, సీబీఐతో సిట్ అధికారులు సంప్రదించారు. దేవరాజేగౌడ తీవ్ర విచారణ లైంగిక దాడి, కులం పేరుతో దూషణకు పాల్పడ్డారనే కేసులో హిరియూరు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేసిన న్యాయవాది, బీజేపీ నాయకుడు డీ.దేవరాజేగౌడను హోళెనరసిపుర గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేసి తీవ్ర విచారణ చేపట్టారు. కోర్టులో హాజరు పరిచి అధిక విచారణ కోసం కస్టడీకి తీసుకునే అవకాశముంది. కారులో శుక్రవారం రాత్రి వెళుతున్న దేవరాజేగౌడను చిత్రదుర్గ జిల్లాలో హిరియూరు వద్ద అరెస్టు చేశారు. దేవరాజేగౌడ అరెస్ట్పై డీకేశి... దేవరాజేగౌడను లైంగికదాడి కేసులో అరెస్ట్ చేయడంపై స్పందించేందుకు డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ నిరాకరించారు. నగరంలో విలేకరులతో మాట్లాడుతూ బిజీగా ఉండడం పత్రికలను చదవలేదు. అందువల్ల ఈ విషయమై మాట్లాడలేను అన్నారు. తాను పెన్డ్రైవ్ విడుదల చేయడం వెనుక డీకే హస్తముందని దేవరాజేగౌడ ఇటీవల ప్రకటించారు. డీకే తో మాట్లాడినవి అని కొన్ని ఆడియోలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దేవరాజేగౌడ ఒక వివాహితతో అసభ్యంగా మాట్లాడిన వీడియో, ఆడియో బహిరంగమయ్యాయి. సిట్పై అనుమానాలు: సీటీ ఎంపీ ప్రజ్వల్ పెన్డ్రైవ్ కేసుపై రిటైర్డు జడ్జి చేత న్యాయ విచారణ జరపాలని మాజీ మంత్రి సీటీ రవి డిమాండ్ చేశారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, సిట్ తనిఖీ పలు అనుమానాలకు కారణమైంది. అందుచేత దీనిపై సుప్రీంకోర్టు గాని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిచే తనిఖీ జరపాలన్నారు. దేవరాజేగౌడను అరెస్ట్ చేయడాన్ని చూస్తే సిట్ తనిఖీపై అనుమానాలు వచ్చాయన్నారు. డీకే శివకుమార్పై దేవరాజేగౌడ మరిన్ని వీడియో ఆడియోలను విడుదల చేయవచ్చని ఇలా అరెస్టు చేశారేమోనని ఆరోపించారు. ఎంపీ ప్రజ్వల్ అరెస్టు కోసం త్వరలో పయనం త్వరలో రెడ్ కార్నర్ జారీ! పెన్డ్రైవ్ కేసులో రోజురోజుకూ కొత్త మలుపులు లైంగిక దాడుల కేసులో క్లీన్ చిట్ ఇచ్చేందుకే ఎంపీ ప్రజ్వల్ కేసును సీబీఐకి అప్పగించాలా అని మంత్రి ఎంబీ పాటిల్ ప్రశ్నించారు. శనివారం బెంగళూరులో మాట్లాడిన ఆయన పెన్డ్రైవ్ కేసును జేడీఎస్– బీజేపీవారు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేయడంపై మండిపడ్డారు. సీబీఐకి ఇస్తే కేసును వాషింగ్ మిషన్లో వేసేస్తుందని హేళన చేశారు. ఇప్పుడు చట్ట ప్రకారం తనిఖీ జరుగుతోంది. అన్ని వాస్తవాలు బయటపడుతాయి. ఎంత పెద్దవారైనా చట్టానికి తలొగ్గాలి. చట్టానికి విలువ ఇస్తూ వచ్చి అరెస్ట్ కావాలి అని అన్నారు. కాగా, కేంద్రం నుండి వచ్చే సొమ్మును రైతులకు పంపిణీ చేశామన్నారు. కేంద్రం నుంచి రూ. 18 వేల కోట్లు కోరితే ఇచ్చింది మాత్రం రూ. 3,500 కోట్లేనని, అడిగిన సొమ్ము ఇవ్వాలని, లేదంటే న్యాయస్థానంలో పోరాటం చేస్తామని చెప్పారు. -
విలువలు గల నేత రశ్రీనివాస్ ప్రసాద్
మైసూరు: దివంగత ఎంపీ శ్రీనివాస ప్రసాద్ విలువలు గల నేత అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. శనివారం మైసూరు నగరంలోని మానంద రోడ్డులో ఉన్న శ్రీనివాస్ ప్రసాద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో ఆయన పాల్గొని దివంగత నేత చిత్రపటానికి నివాళి అర్పించి మాట్లాడారు. తాను, శ్రీనివాస ప్రసాద్ ఒకే వయసు వారమని, అయితే నాకంటే ఆయన రాజకీయాల్లో సీనియర్ అని చెప్పారు. శ్రీనివాస ప్రసాద్ స్వాభిమాన నాయకుడని, ఇద్దరం మంచి మిత్రులమని చెప్పారు. మాజీ సీఎం యడియూరప్ప కూడా కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస ప్రసాద్కు నివాళులర్పించారు. కెరెగోడులో మళ్లీ ఉద్రిక్తత ● పోలీసుల వేధింపులపై హిందూ సంఘాల ధర్నా మండ్య: గతంలో హనుమాన్ జెండాను పోలీసులు బలవంతంగా తొలగించడంతో ఘర్షణలు చెలరేగిన కెరెగోడులో మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపైన రౌడీ షీట్ తెరుస్తామని నోటీసు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ, అలాగే హనుమాన్ భక్తులపైన దాడులకు పాల్పడుతున్న సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని కోరుతూ వీహెచ్పీ, భజరంగదళ్ తదితర హిందూ సంఘాల కార్యకర్తలు శనివారం మండ్య తాలూకాలోని కెరెగోడు గ్రామంలో ధర్నా చేశారు. గ్రామంలోని బస్టాండు సర్కిల్ పెద్దసంఖ్యలో కార్యకర్తలు ఊరేగింపుగా జై శ్రీరామ్ ఆంటు నినాదాలు చేస్తూ పోలీస్స్టేషన్కి వెళ్లారు. పోలీసుల నోటీసులకు హిందూ సంఘాల తరఫున హైకోర్టు న్యాయవాది ఎల్ఎన్ హెగడె సమాధానమిచ్చారు. హిందూ కార్యకర్తలపై దాడులకు అడ్డుకట్ట వేయాలని, కేసులను ఎత్తి వేయాలని ధర్నా చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. ఎస్పీ ఆఫీసులో పోలీసుల ధర్నా చిక్కబళ్లాపురం: పట్టణంలో ఎస్పీ కార్యాలయం ఆవరణంలో ఇద్దరు కానిస్టేబుళ్లు అశోక్, నరసింహమూర్తి అనే వారు తమ కుటుంబాలతో ధర్నా చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పోలీసుశాఖలో ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. అశోక్ భార్య మాట్లాడుతు ఇద్దరు బాగేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో పని చేసే సమయంలో ఓ కేసులో 15 మంది పోలీసులని సస్పెండ్ చేశారు, ఇటీవల వీరిద్దరినీ వదిలి మిగతావారిపై సస్పెన్షన్ను ఎత్తివేశారని తెలిపింది. తన భర్త, మరొకరిపై కూడా తొలగించి న్యాయం చేయాలని కోరింది. అదనపు ఎస్పీ వారి నుంచి వివరాలను తీసుకుని న్యాయం చేస్తామనడంతో ధర్నాను విరమించారు. ఎస్పీ నాగేశ్ మాట్లాడుతూ ఏమైనా సమస్య ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఇలా ధర్నా చేయడం సరి కాదని అన్నారు. -
జడివానలతో అంతటా అలజడి
యశవంతపుర: రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులుగా వానలు కురుస్తున్నాయి. మరోవారం పాటు వానలు పడే అవకాశం ఉందని వాతావారణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో మైసూరు, హాసన, చామరాజనగర జిల్లా రైతులు ముంగారు కంటే ముందుగానే వ్యవసాయ పనులు ప్రారంభించి భూమిలో విత్తనం వేయటాన్ని ప్రారంభించారు. అలసంద, జొన్న, నూగులు, కందిలాంటి పంటలపై మొగ్గు చూపుతున్నారు. కానీ ఆకస్మిక వర్షాలతో కొన్నిచోట్ల పంట నష్టం జరుగుతోంది. చామరాజనగర సమీపంలో బైడమూడ్లులో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. బెంగళూరులో కొన్ని లేఔట్లలో గాలివానలకు చెట్లు పడిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం సాయంత్రం, రాత్రి అనేక చోట్ల వానలు పడ్డాయి. దక్షిణ ఒళనాడులో మంచి వానలు కురిసాయి. ఇక దక్షిణ కన్నడ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నమోదైన వర్షపాతం: కరావళి 32 మి.మీ. ఉత్తరకర్ణాటక–33, దక్షిణ కన్నడలో–34 మిల్లీమీటర్లు, గుబ్బి–59. మండ్య–57.2, కెఆర్ నగర–52.4, చిక్కబళ్లాపుర–34.9, చిత్రదుర్గ–34.1, హాసన–20.4, కొడగు–17, బెళగావి జిల్లా యడ్రామి–17.2, కలబురగి–13.2, కేఆర్పేట, అరకలగూడు–20.4, భాగమండళ–17, మాగడి–15.4, హొసకోటె–16.4, అజ్జంపుర–14, పావగడ–10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఊపందుకున్న వ్యవసాయ పనులు -
నిశ్చితార్థం రద్దయిందని ఘోరం
యశవంతపుర: నిశ్చితార్థం రద్దయిందనే ఉన్మత్త ఆవేశంలో 16 ఏళ్ల బాలికను తల నరికి హత్య చేసి పరారైన కిరాతకుడు ప్రకాశ్ను కొడగు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని సోమవారపేట పరిధిలో సుర్జబ్బి ప్రభుత్వ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న మీనా అనే బాలికతో అతనికి గతంలో ఇరుకుటుంబాల వారు నిశ్చితార్థం చేశారు. ఏడాది నుంచి ప్రేమ హత్యకు గురైన మీనా ఊరు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని హమ్మియాళకు చెందిన ప్రకాశ్ చిన్నచిన్న పనులు చేసుకొనేవాడు. ఏడాది నుంచి మీనా వెంటపడ్డాడు. రోజూ మీనాను ప్రకాశ్ బైకులో ఎక్కించుకొని స్కూల్ వద్ద వదిలేవాడు. ఫలితాలు వచ్చిన రోజునే నిశ్చితార్థంలో ఇద్దరినీ పెద్దలు కూర్చోబెట్టి ఉంగరాలు మార్పించారు. అయితే కొంతసేపటికి అధికారులు వచ్చి మైనర్ బాలికకు ఎలా పెళ్లి చేస్తారని ప్రశ్నించటంతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు బాలిక తల్లిదండ్రులు సుబ్రమణ్య, జానకి తెలిపారు. ఆ తరువాత మీనాను మాటల్లో పెట్టిన ప్రకాశ్ ఆమె తల నరికి తీసుకెళ్లాడు. ఆమె తల్లిదండ్రులపైనా దాడి చేసి పరారయ్యాడు. ప్రకాశ్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని శుక్రవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది నిజం కాదని తేలింది. ఒక గ్రామంలో దాగి ఉన్న నిందితున్ని అరెస్టు చేసి విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ కె.రామరాజన్ తెలిపారు. ఘటనాస్థలికి తీసుకెళ్లి హత్య గురించి విచారించారు. బాలిక తల నరికిన కిరాతకుడు అరెస్టు చేసి విచారణ -
వేర్వేరు ఘటనల్లో రూ.8 లక్షల వంచన
హుబ్లీ: వేర్వేరు ఘటనల్లో ఖాతాదారుల బ్యాంక్ ఖాతాల నుంచి రూ.8 లక్షల నగదును కేటుగాళ్లు బదలాయించుకుని వంచించారు. వివరాలు.. ఖాతాదారుడి దృష్టికి తేకుండానే వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.6.39 లక్షలను కేటుగాళ్లు బదలాయించుకొని వంచించిన ఘటన చోటు చేసుకుంది. ధార్వాడలోని మిచిగన్ లేఅవుట్కు చెందిన మహంతేష్ కుందరిగి బాధితుడు. మొబైల్ నెంబర్ బ్లాక్ అయిన నేపథ్యంలో సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ కంపెనీని విచారించగా నెట్వర్క్ సమస్య ఉండవచ్చునని వేరొక సిమ్ కార్డు ఇచ్చారు. వేరే సిమ్ కార్డు వేసుకున్న తర్వాత మొబైల్ యాక్టివేట్ కావడమే కాకుండా కాల్ సౌకర్యం ప్రారంభం అయింది. అయితే ఎస్ఎంఎస్ సౌలభ్యం 24 గంటల తర్వాత లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఆ మేరకు ఈ 24 గంటల గడువులో వంచకులు బాధితుడి వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.6,39,521 బదలాయించుకొని వంచించారని బాధితుడు నగర సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో ఘటనలో పోగొట్టుకున్న మొబైల్ను గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా వాడుకొని రూ.1.68 లక్షలు బదలాయించుకొని వంచించిన ఘటన నగరంలో వెలుగు చూసింది. స్థానిక రాజనగర శ్రీహర్ష సత్తిగేరి అనే బాధితుడు ఇంటి నుంచి మార్కెట్కు వెళ్లే మార్గమధ్యంలో మొబైల్ పోగొట్టుకున్నాడు. ఆ మొబైల్ను చేజిక్కించుకున్న గుర్తు తెలియని వ్యక్తులు అందులో ఉన్న ఫోన్పేను అక్రమంగా వాడుకొని వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు మొత్తం రూ.1,68,901 బదలాయించుకొని వంచించినట్లు శ్రీహర్ష నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మళ్లీ మోదీనే ప్రధాని: యడ్డి
మైసూరు: సూర్యచంద్రులు ఉండేది ఎంత నిజమో, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం కూడా అంతే నిజమని బీజేపీ మాజీ సీఎం బీ.ఎస్. యడియూరప్ప అన్నారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 400 కి పైగా స్థానాల్లో విజయం సాధించి మళ్లీ పదవిని చేపడతారన్నారు. కన్నడనాట సుమారు 24 నుంచి 25 వరకు స్థానాల్లో బీజేపీ గెలుపు తథ్యమన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన కరవు నెలకొంది, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేయాలని ఆయన కోరారు. పేదలకు మోదీ చేసిందేమీ లేదు: సీఎం మైసూరు: నన్ను సమాధి చేయడానికి ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించడం చూస్తే ఓటమి భయంతో ఓట్లను పొందడానికి ఇలా మాట్లాడుతున్నారని సీఎం సిద్దరామయ్య అన్నారు. మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మోదీ 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారు, కానీ పేదల కోసం చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు ఆయనకు ఓడిపోతానని భయం పట్టుకుందని, దాంతో ప్రతిపక్షాల పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కరువు ఉంది, రైతుల రుణాలను రద్దు చేయాలని యడియూరప్ప చెప్పడం సరికాదని అన్నారు. గతంలో ఆయనే నోట్లను ముద్రించడం లేదు, ఎలా రుణాలను మాఫీ చేయాలని ప్రశ్నించారన్నారు. కానీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా రైతుల రుణాలను మాఫీ చేసి తీరుతామని అన్నారు. బైక్ను ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి యశవంతపుర: లారీ–బైకును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన బెంగళూరు వైట్ఫీల్డ్ పరిధిలో వర్తూరు కోడి సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. గుంజూరుకు చెందిన చంద్రశేఖర్రెడ్డి (42), రవీంద్ర (55)లు మృతి చెందారు. వీరు జొమాటోలో పని చేస్తున్నారు. విధులు ముగించుకొని రాత్రి బైకుపై వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొంది. దీనితో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యడు. వైట్ఫీల్డ్ ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలిని పరిశీలించారు. -
సైబర్ నేర జంట అరెస్టు
● రూ.15 లక్షలు సీజ్ హోసూరు: క్రిప్టోకరెన్సీ ద్వారా రెండింతల లాభం పొందవచ్చునని సైబర్ దొంగలు ఓ మహిళ వద్ద రూ. 20 లక్షలు కాజేశారు, ఈ కేసులో ఓ దొంగ జంటని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసి రూ. 15 లక్షలు స్వాధీనపరుచుకొన్నారు. వివరాలు.. కిష్ణగిరి సమీపంలోని పెద్దదాళపల్లి గ్రామానికి చెందిన పార్థిభన్ భార్య శరణ్య, కొన్నిరోజుల క్రితం టెలిగ్రాం ద్వారా ఓ వ్యక్తి కాల్చేసి దుబాయ్కు చెందిన కార్తీక్గా పరిచయం చేసుకొని తన వద్ద క్రిప్టో కరెన్సీ ఉందని చెప్పాడు. దీన్ని కొనుగోలు చేయడం ద్వారా రెండింతల లాభం పొందవచ్చునని సూచించాడు. నమ్మిన శరణ్య రెండు బ్యాంకు ఖాతాలకు తలా రూ. 10 లక్షలు పంపింది. తరువాత ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది, మోసపోయినట్లు తెలుసుకుని ఆమె క్రిష్ణగిరి క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఎస్పీ తంగరాజ్ నేతృత్వంలో సదరు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించారు. రాణి, ఆమె స్నేహితుడు కార్తీక్లను అదుపులోకి తీసుకొని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 15 లక్షలు స్వాధీనపరుచుకొన్నారు. విద్యుదాఘాతంతో యువకుడి మృతియశవంతపుర: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. ఈఘటన కొడగు జిల్లా మడికేరి తాలూకా మూర్నాడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఆరిఫ్(34) కొంతమంది యువకులతో కలిసి క్రికెట్ మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. అభిమానులకు తెలియటానికి అక్కడక్కడ బ్యానర్లు కట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కరెంట్ స్తంభానికి బ్యానర్ కడుతుండగా ఆరీఫ్ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిని దుర్భాషలాడిన ఆకతాయిలుయశవంతపుర: యువతిని ఆకతాయిలు దుర్భాషలాడిన ఘటన బెంగళూరులో జరిగింది. బీటీఎం లేఔట్ రోడ్డులో ఓ యువతి స్కూటీని ఆపి ఆమె అక్కడే నిలబడి ఉంది. ఇంతలో స్కూటీలో వచ్చిన ఇద్దరు యువకులు.. ఇక్కడ రోడ్షో చేస్తున్నావా అంటూ ఆ యువతిని తిట్టారు. తనను ఎందుకు తిడుతున్నవాంటూ ఆమె ఎదురు ప్రశ్నించింది. రెచ్చిపోయిన ఆకతాయిలు అమెను మళ్లీ దుర్భాషలాడి అనుచితంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. -
ఏనుగు దాడిలో ఒకరు మృతి
హోసూరు వార్తలు..కెలమంగలం: డెంకణీకోట సమీపంలో ఏనుగు దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలేర్పడి ఆస్పత్రిలో చికిత్స ఫలితంలేక మృతి చెందాడు. వివరాల మేరకు డెంకణీకోట తాలూకా అందేవనపల్లి సమీపంలోని ఆలళ్లి గ్రామానికి చెందిన బైరప్ప కొడుకు రాజేంద్రన్ (48). శుక్రవారం ఉదయం మనియంబాడి రోఢ్డుపై వాకింగ్ వెళ్తుండగా ఒంటి ఏనుగు దాడి చేసి గాయపరిచింది. గమనించిన స్థానికులు అతన్ని చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఫలితంలేక మృతి చెందాడు. డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేశారు. అటవీ గ్రామాల్లో భయం రెండు రోజులుగా డెంకణీకోట సమీపంలోని అటవీ ప్రాంత గ్రామాల్లో ఒంటి ఏనుగు కోపంగా తిరుగుతూ దాడి చేస్తోందని ప్రజలు తెలిపారు. జారకాలట్టి వద్ద పలువురు గ్రామస్తులపై దాడికి యత్నించడంతో బాధితులు పరుగులు తీశారు. అటవీ శాఖాధికారులు తక్షణం ఏనుగును బంధించాలని డిమాండ్ చేశారు. -
అవమానంపై చర్యలకు డిమాండ్
రాయచూరు రూరల్: దేశంలో హిందూ, ముస్లింలు సోదరులుగా ఉన్నామని, మైనార్టీలను విభజించు, పాలించు అనే సూత్రం ప్రకారం మైనార్టీలను అవమానించిన ప్రైవేట్ ఛానల్పై, న్యూస్ చదివిన రీడర్పై చర్యలు చేపట్టాలని మైనార్టీ నేతలు డిమాండ్ చేశారు. శనివారం డీఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనను ఉద్దేశించి సంచాలకుడు రజాక్ ఉస్తాద్ మాట్లాడారు. న్యూస్ రీడర్ అజిత్ హనుమక్కనవర్ దేశ జనాభా పెరుగుదల అంశంపై చర్చాగోష్టిలో హిందూ జనాభాపై విశ్లేషణలో జాతీయ పతాకం చూపించారన్నారు. మైనార్టీల జనాభా పెరుగుతున్న అంశంపై విశ్లేషణలో పాకిస్తాన్ జాతీయ పతాకం చూపించి అవమాన పరిచారన్నారు. అలాంటి సంస్థ, న్యూస్రీడర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో జావిద్ ఉల్ హక్, శంశుద్దీన్, మొయినుద్దీన్, ఉస్మాన్, హైఫరోజ్, ఒబేదాలున్నారు. -
టెన్త్లో సత్తా చాటిన తెలుగు పాఠశాలలు
బొమ్మనహళ్లి : కన్నడ రాష్ట్రంలో తెలుగు విద్యార్థులు అద్వితీయమైన ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో శివాజీ నగర్లో ఉన్న తెలుగు ఉన్నత పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించింది. ఈ పాఠశాలనుంచి మొత్తం 18 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 10 మంది ప్రథమ శ్రేణిలో, 5 మంది ద్వీతీయ శ్రేణిలో, ముగ్గురు విద్యార్థులు తృతీయ శ్రేణిలో పాస్ అయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. నరేంద్ర బాల అనే విద్యార్థి 84 శాతం మార్కులు, శారద 75.2 శాతం, హరిప్రణిత్ కుమార్రాజు 70.08 శాతం మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా శాంతి నగర నియోజకవర్గంలోని వివేకనగర వార్డు పరిధిలో ఉన్న వివేకనగర తెలుగు పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు సేవా భారత్ ట్రస్టు అధ్యక్షుడు బండి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. మొత్తం 14 మందికిగాను 6 మంది ప్రథమ శ్రేణి, నలుగురు ద్వీతీయ శ్రేణి, నలుగురు తృతీయ శ్రేణిలో పాస్ అయినట్లు తెలిపారు. ప్రవీణ్ 500, భరత్ 475, అంజలి 430 మార్కులు సాధించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
దొడ్డబళ్లాపురం: గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపిన ఘటన మాగడి తాలూకా హొసళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో అత్యంత పురాతన సోమేశ్వర ఆలయం ఉంది. ఇది పురాతత్వ శాఖ పరిధిలో ఉంది. గుప్త నిధుల కోసం వచ్చిన దుండగులు ఆలయం ముందు ఉన్న నంది విగ్రహాన్ని పక్కకు జరిపి దాని కింద తవ్వకాలు జరిపారు. శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూడటంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాలకు పరిరక్షణ లేకుండా పోయిందని వాపోయారు. కుదూరు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల సంఖ్య పెంపుయశవంతపుర: బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొత్తగా మరికొన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బీ దయానంద తెలిపారు. రాజాజీనగర పారిశ్రామికవాడలోని కల్యాణ మంటపంలో ఏర్పాటు చేసిన జనసంపర్క సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం 48 ట్రాఫిక్ స్టేషన్లు ఉన్నాయన్నారు. కొత్తగా జ్ఞానభారతి, చిక్కబణావార, శేషాద్రిపుర, జ్యోతినగర, సంజయనగర కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను ప్రారంభిస్తామన్నారు. ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు తుమకూరు: తుమకూరు జిల్లా శిరా తాలూకా రంగాపుర గ్రామంలో వెలసిన శ్రీ బొమ్మలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంతో పాటు 48వ రోజు ప్రత్యేక పూజలు, హారతి మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ట్రస్టు ఉపాధ్యక్షుడు శివు చంగావర పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గీతా శివరాజ్కుమార్ గెలుపు ఖాయంశివమొగ్గ: శివమొగ్గ లోక్సభ కాంగ్రస్ అభ్యర్థి గీతా శివరాజ్కమార్ భారీ విజయం సాధించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ ప్రసన్న కమార్ జోస్యం చెప్పారు. శనివారం ఆయన శివమొగ్గలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ పథకాలే ఆమె విజయానికి కారణమవుతాయన్నారు. నోటీసు తిరస్కరణ యశవంతపుర: బీజేపీ అధికార ఎక్స్ఖాతాలో ఆక్షేపించేలా పోస్ట్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బెంగళూరు హైగ్రౌండ్ పోలీసులు జారీ చేసిన నోటీసులను తీసుకోవడానికి బీజేపీ ఐటీసెల్ విభాగం జాతీయ సంచాలకురాలు అమిత్ మాళవీయ, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు విజయేంద్రలు నిరాకరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాకు కూడా నేరుగా వెళ్లి నోటీసు జారీ చేయనున్నట్లు తెలిసింది. బెంగళూరు హైగ్రౌండ్ పోలీసులు జారీ చేసిన ఏడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని సూచించారు. అమిత్ మాళవీయ ఉంటున్న పశ్చిమబెంగాల్ కృష్ణనగరకు నేరుగా వెళ్లి నోటీసును జారీ చేయాలని నిర్ణయించారు. మతం, కులం ప్రస్తావన వచ్చే విధంగా ట్వీట్ చేయటం వివాదంగా మారటంతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. 12 నుంచి వాసవి జయంతి తుమకూరు: ఆరవైశ్య మండలి కన్యకా పరమేశ్వరి దేవాలయం సమితి, వాసవి యువ జన సంఘంతో పాటు ఇతర సంస్థల సహకారంతో ఈనెల 12న ఆదివారం నుంచి 19 వరకు 8 రోజుల పాటు వాసవి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు జీకే లోకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని చిక్కపేటెలో ఉన్న వాసవి అమృత్ మహల్ సమావేశం హాల్లో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి వివిధ ధార్మిక కార్యక్రమాలతో ప్రారంభమవుతుందన్నారు. పంటనష్టంపై సమీక్ష నిర్వహించండి యశవంతపుర: భద్రా నదిలో నీరులేని కారణంగా పంటలు ఎండిపోయాయని, జరిగిన నష్టంపై సమీక్ష చేసి రైతులను ఆదుకోవాలని రైతు ఒక్కూట నాయకుడు బీఎం సతీశ్ డిమాండ్ చేశారు. శనివారం అయన దావణగెరెలో విలేకర్లతో మాట్లాడారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారన్నారు. వర్షాభావంతో పంటలు ఎండిపోయాయన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎంతమేర నష్టం జరిగిందనే విషయంపై అంనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
వినూత్నంగా మొక్కు
క్రిష్ణగిరి: కురుబరపల్లి సమీపంలోని ఎం.సి.పల్లి గ్రామంలో వెలసిన గ్రామదేవత చాముండేశ్వరి ఆలయ జాతర శనివారం ఘనంగా జరిగింది. చాముండేశ్వరి, దొడ్డరాయస్వామి, వీరభద్రస్వామి, లక్కమ్మ, చిక్కమ్మ, కావేరియమ్మ తదితర గ్రామదేవతల విగ్రహాలను అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. మొక్కు ఉన్న కొందరు భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టించుకొన్నారు. పల్లకీ ఉత్సవాలు, వీరభద్ర స్వామి కరగ కనువిందుగా జరిగాయి. ఆస్పత్రికెళ్తే.. ఇంట్లో చోరీ హోసూరు: ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లిన ఘటన మత్తిగిరి వద్ద జరిగింది. వివరాల మేరకు హోసూరు పారిశ్రామికవాడ కొత్తగొండపల్లి గ్రామానికి చెందిన సరోజమ్మ (55) గత రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన భర్తను తీసుకొని బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆస్పత్రిలో చూపించుకుని శుక్రవారం రాత్రి ఇంటికొచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికెళ్లి చూడగా 5 పౌన్ల బంగారు నగలు, రూ. 20 వేలు నగదు దోపిడీకి గురైనట్లు తెలిసింది. దీంతో ఆమె మత్తిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యుత్ ఉద్యోగి దుర్మరణం హోసూరు: విద్యుత్ స్తంభంపైకెక్కి మరమ్మత్తులు చేస్తున్న ఉద్యోగి జారి పడి మరణించిన ఘటన బాగలూరు వద్ద పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు తిరువణ్ణామలై జిల్లా నంజానత్తం గ్రామానికి చెందిన గోవిందరాజ్ (33) బాగలూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం బాగలూరు సమీపంలోని సిద్దనపల్లి ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని కార్యాలయానికి ఫిర్యాదు అందింది. గోవిందరాజ్ వెళ్లి ఓ కరెంటు పోల్పై మరమ్మతు చేస్తుండగా కింద పడడంతో స్థానికులు చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం మృతి చెందాడు. బాగలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ మద్యం పట్టివేత హోసూరు: బెంగళూరు నుంచి బాగలూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం తరలిస్తున్న యువకున్ని అరెస్ట్ చేశారు. వివరాల మేరకు బాగలూరు పోలీసులు శుక్రవారం రాత్రి కగ్గనూరు చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. బైక్లో సోదాలు చేయగా 672 మద్యం బాటిళ్లు దొరికాయి. బైక్ను, సరుకును సీజ్ చేసి, దానిని తరలిస్తున్న హోసూరువాసి సంజు (24)ని అరెస్టు చేశారు. తక్కువ రేటుకు తీసుకువచ్చి బాగలూరు ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. -
దేశద్రోహం కేసు పేరుతో సైబర్ వంచన
మైసూరు: సైబర్ పొలీసులమని చెప్పి రూ. 15 లక్షల మేర వంచనకు పాల్పడిన ఘటన మైసూరులో వెలుగు చూసింది. మైసూరులోని జేపీ నగర్కు చెందిన అన్నోల్ అనే వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. తాము ముంబై నుంచి సైబర్ పోలీసులం మాట్లాడుతున్నామని చెప్పారు. మీరు దేశద్రోహానికి పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, మీ సెల్ నుంచి దేశద్రోహులకు ఫోన్లు వెళ్లినట్లు వివరాలు తమ వద్దద ఉన్నాయని, నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుందని బెదిరించారు. నేరాన్ని మాఫీ చేయాలంటే రూ. 15 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళనకు గురైన బాధితుడు రూ.15లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం ధైర్యం తెచ్చుకొని మైసూరులోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది. బీవై రాఘవేంద్ర విజయం తథ్యం శివమొగ్గ : శివమొగ్గ లోక్సభ బీజేపీ అభ్యర్థి బీ.వై. రాఘవేంద్ర దాదాపు 2.50 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.టి. మేఘరాజ్ తెలిపారు. శనివారం శివమొగ్గలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడుసార్లు ఎంపీగా పనిచేసి ప్రజలకు అందుబాటులో ఉన్నారన్నారు. దీంతో తాజా ఎన్నికల్లో సైతం ఓటర్లు ఆయనకే మద్దతు పలికారన్నారు. అన్ని స్థానాలు మావే : బీజేపీ యశవంతపుర: రాష్ట్రంలో బీజేపీ 28 స్థానాల్లోనూ గెలవటం ఖాయమని బీజేపీ లెక్కలు వేస్తోంది. ఇందుకు సంబంధించి పోలింగ్ ముగిసిన తరువాత బీజేపీ–జేడీఎస్ నాయకులు సమీక్ష నిర్వహించారు. పొత్తు పెట్టుకున్న మూడు జేడీఎస్ స్థానాలతో పాటు 25 బీజేపీ ఎంపీ స్థానాల్లో గెలుపు ఖాయమని రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానానికి నివేదిక పంపారు. శనివారం బీజేపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి బసవరాజబొమ్మై, సదానందగౌడ, విజయేంద్ర, ఆర్ అశోక్, సునీల్కుమార్, జగదీశ్శెట్టర్, సిటీ రవితో పాటు సీనియర్ నాయకులు పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించి అధిష్టానానికి సమాచారం పంపారు. గృహ ప్రవేశానికి వెళ్లిన 25 మందికి అస్వస్థతదొడ్డబళ్లాపురం: గృహప్రవేశానికి హాజరై భోజనాలు చేశాక 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రామనగర తాలూకా కన్నమంగలదొడ్డిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొత్తగా ఇంటిని నిర్మించాడు. శుక్రవారం గృహప్రవేశం ఉండటంతో బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చారు. భోజనాల అనంతరం ఎనిమిది మంది చిన్నారులతో సహా 25 మంది వాంతులు, విరేచాలకు గురయ్యారు. వెంటనే వారిని రామనగర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎండ కారణంగా వేడికి ఆహారం తిన్నాక ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. -
వీడియో వైరల్ చేసిన వారిని కనిపెట్టలేం
శివాజీనగర: ప్రజల్ వీడియో వైరల్ చేసిన వారిని కనిపెట్టడం కష్టం. ఈ వీడియో 2–3 నెలల క్రితమే విడుదలైందని మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. శనివారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. స్టేడియం వద్ద కూడా పెన్డ్రైవ్ లభించిందన్నారు. 25 వేల పెన్డ్రైవ్లు అంటే ఉద్దేశపూర్వకంగానే వీడియో విడుదలై ఉంటుందన్నారు. అయితే ముందు వీడియోలో ఉన్న వ్యక్తిపై కేసు తాము ఫోకస్ చేయాలని, ఆ తరువాత వీడియో వైరల్ చేసిన కేసు కూడా తెలుస్తుందన్నారు. వీడియో చోరీ చేసింది డ్రైవర్. దేవరాజేగౌడ వీడియో ఇచ్చినది బీజేపీ నాయకుడికి. ఇందులో కాంగ్రెస్ హస్తం ఎక్కడుంది? సిద్దరామయ్య, డీ.కే.శివకుమార్ హస్తం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ–జేడీఎస్వారు పెన్డ్రైవ్పై మాత్రం మాట్లాడుతారని, కుమారుడు ఇటువంటి తప్పుడు పనికి పూనుకున్నాడని ఎవ్వరూ మాట్లాడటం లేదన్నారు. ఆడియో విన్నానని, ఇందులో బీజేపీ హైకమాండ్కు అన్ని విషయాలు తెలుసునని తెలిపారు. అన్నీ తెలిసినా ఎందుకు టికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. మాజీ ప్రధాని చర్చించకుండా టికెట్ ఇచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయని ప్రియాంక్ ఖర్గే అన్నారు. ప్రియాంక్ ఖర్గే -
నేటి నుంచి శంకర జయంతి ఉత్సవాలు
కోలారు: నగరంలోని కోట ప్రాంతంలో ఉన్న శృంగేరి శారదా శంకరమఠంలో ఆదివారం నుంచి ఈనెల 17వ తేదీ వరకు శంకరాచార్యుల జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీమఠం ధర్మాధికారి జేఎన్ రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 7.30 గంటలకు వేద ఘోషతో కార్యక్రమాలు ప్రారంభం అవుతాయన్నారు. శంకరాచార్యుల వారి రథోత్సవాన్ని మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహిస్తారన్నారు. సాయంత్రం శంకర భక్త మండలితో శంకరస్తోత్ర పారాయణం ఉంటుందన్నారు. సాయంత్రం 7 గంటలకు శ్రీకాంతశర్మచే ఉపన్యాస కార్యక్రమం ఉంటుందన్నారు. 17వ తేదీ వరకు వివిధ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనం ఢీకొని జింక మృతి శ్రీనివాసపురం : వాహనం ఢీకొని జింక మృతి చెందిన ఘటన తాలూకాలోని చింతామణి రోడ్డులో కల్లూరు గ్రామం వద్ద చోటు చేసుకుంది. తిరుమల నుంచి చిక్కబళ్లాపురం వెళుతున్న కారు కల్లూరు గ్రామం వద్ద అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన జింకను ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన జింక అక్కడి కక్కడే మృతి చెందింది. అటవీశాఖ అధికారి అనిల్కుమార్ వచ్చి పరిశీలించారు. కారు డ్రైవర్ను విచారణ కోసం వెంట తీసుకెళ్లారు. పోస్టు మార్టం అనంతరం జింకను అటవీ ప్రాంతంలో ఖననం చేశారు. -
ఆదమరిస్తే అంతే సంగతులు
పావగడ: పట్టణంలోని తాలూకా కార్యాలయం వెనుక బస్టాండుకు వెళ్లే రోడ్డులో మలుపులో డ్రైనేజీ కాలువ ప్రమాదకరంగా మారింది. డ్రైనేజీ కాలువపై ఉన్న బండ తొలగిపోయి కొన్నేళ్లు కావస్తోంది. అయినా స్థానిక మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు. ఆ మలుపులో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించుకునే ప్రయత్నంలో అనేక మంది మహిళలు, వృద్ధులు, పాదచారులు డ్రైనేజీలో పడి గాయపడుతున్నారు. పెను ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి డ్రైనేజీపై సిమెంట్ కాంక్రీట్తో మూత వేయించాలని ప్రజలు కోరుతున్నారు. -
టైర్ పేలి క్రూజర్ బోల్తా
మర్మాంగాలకు కరెంటు షాక్ ఇచ్చి చిత్రహింసలురాయచూరు రూరల్: టైర్ పేలి క్రూజర్ బోల్తా పడటంతో ముగ్గురు మహిళలు దుర్మరణం పాలైన ఘటన శనివారం బెళగావి జిల్లా చిక్కోడిలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని సాంగ్లి రహదారిలో బెళగావి జిల్లా అథణి తాలూకా బళ్లిగేరికి చెందిన మహిళలు బళ్లిగేరి నుంచి మహారాష్టలో కూలీ పనుల కోసం క్రూజర్లో వెళుతుండగా మార్గమధ్యంలో వాహనం టైర్ పేలడంతో బోల్తా పడింది. ప్రమాదంలో మహాదేవి చౌగలె, గీతా దొడ్డమని, స్ఫూర్తి అనే ముగ్గురు మరణించారు. మృతుల వయస్సు, వివరాలు తెలియరాలేదు. గాయపడ్డ ఐదు మంది క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చిక్కోడి పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ముగ్గురు మహిళా కూలీల దుర్మరణం -
బెంగళూరులో భారీ వర్షం
బనశంకరి: బెంగళూరు నగరంలో వర్షం దెబ్బకు నగరవాసులు హడలిపోతున్నారు. శుక్రవారం రాత్రి మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గాలి వానతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాలలో వాన నీరు ఇళ్లల్లోకి చొరబడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురిఅయ్యారు. మునిగిన లోతట్టు ప్రాంతాలు : నగరంలోని మైసూరు, తుమకూరు రోడ్లలో భారీగా వర్షం నీరు ప్రవహించడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. నగరంలో 80కి పైగా చెట్లు కుప్పకూలాయి. నాగరబావి నృపతుంగనగర 4వ మెయిన్ రోడ్డులో వరుసగా 10కి పైగా చెట్లు కూలిపోయాయి. రోడ్ల పక్కన పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎన్జీఎఫ్ లేఔట్ 9వ క్రాస్లో విద్యుత్ స్తంభంపై భారీ వృక్షం కూలిపోయింది. అదృష్టవశాత్తూ పక్కనే ఉన్న షెడ్పై పడింది. అక్కడ నివాసం ఉంటున్న కార్మికుడు ప్రమాదంలో చిక్కుకోగా మిగిలిన వారందరూ బయటపడ్డారు. చామరాజపేటే బిన్నిమిల్ వద్ద ప్రైవేటు వసతి సముదాయంలో నీరు పక్కన ఉన్న రాయపుర ఇళ్లల్లోకి చొరబడటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కోపోద్రిక్తులైన నివాసులు వసతి సముదాయం వాసులపై మండిపడ్డారు. బెంగళూరు యూనివర్శిటీ, మైసూరురోడ్డు ఆర్ఆర్.నగర ఆర్చ్రోడ్డు జలమమయ కావడంతో వాహనదారులు వాహనాలు నడపలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్లు కొట్టుకుని పోయే పరిస్థితి ఏర్పడింది. పీణ్యా, దాసరహళ్లి, మల్లసంద్ర, చిక్కబిదరకల్లు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాహనాలు సంచారానికి తీవ్ర ఇబ్బంది తలెత్తింది. తీవ్రట్రాఫిక్తో 8వ మైల్ నవయుగ టోల్గేట్ నుంచి మాదవార వరకు ట్రాఫిక్ స్తంభించింది. ఇంకా రెండు రోజులు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇక రుతుపవనాలు సమయంలో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. సాయంత్రం సమయానికి వర్షం కురుస్తుంది. ఎండిపోయిన బోర్లలో సైతం నీరు వచ్చింది. కెంగేరిలో 89 మి.మీ, పీణ్యా ఇండస్ట్రీయల్ ఏరియా 62 మి.మీ, నాయండహళ్లి 61.5, హెమ్మెగెపుర 61 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. బెళగావి, ధార్వాడలోనూ కుండపోత శనివారం సాయంత్రం బెళగావి, ధార్వాడ తదితర ఉత్తర కర్ణాటకలో పలు నగరాలను భారీ వర్షం ముంచెత్తింది. బెళగావిలో గంటకుపైగా ఏకధాటిగా వర్షం కురిసింది. రోడ్లపై వాననీరు ప్రవహించింది. జోరు వానతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. మోకాలి లోతు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ధార్వాడ నగరంలోనూ వర్షం కురిసింది. ఓ చోట షెడ్డు కూలి బస్సుపై పడింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. నీట మునిగి లోతట్టు ప్రాంతాలు కూలిన చెట్లు స్తంభించిన ట్రాఫిక్ -
కూలీ కూతురు టెన్త్లో దిట్ట
కెలమంగలం: తమిళనాడులో పదవ తరగతి పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. డెంకణీకోట విద్యా జిల్లాకు చెందిన కూలి కార్మికుడి కూతురు 500 మార్కులకు 494 మార్కులు పొందింది. అరసూరుకు చెందిన కూలి కార్మికుడు వజ్రవేల్ ఇతని కూతురు ప్రియదర్శిణి డెంకణీకోటలోని ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతూ పరీక్షలు రాసింది. ఆమె అత్యధికంగా 494 మార్కులు పొంది డెంకణీకోట విద్యా జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. బాలికను పలువురు అభినందించారు. గంజాయి మొక్కల సాగు కెలమంగలం: డెంకణీకోట తాలూకా కెలమంగలం సమీపంలో నిర్వహిస్తున్న పశువుల మేత తయారీ పరిశ్రమలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు హోసూరు అబ్కారీ అధికారులు కనిపెట్టారు. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా 12 అడుగుల ఎత్తైన గంజాయి మొక్కలు గుర్తించా వీటిని పెరికివేసి సీజ్ చేసి, సాగుదారుని అరెస్టు చేశారు. పోస్టర్ వేసిన వ్యక్తి అరెస్టు శివాజీనగర: అశ్లీల వీడియోల కేసులో నిందితుడు ఎంపీ ప్రజ్వల్ని పట్టించినవారికి ఒక లక్ష రూపాయలు బహుమతి ఇవ్వనున్నట్లు నగరంలో పోస్టర్ అతికించిన జనతా పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితున్ని పట్టుకోవడంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయి. అందుచేత నిందితుడు ప్రజ్వల్ రేవణ్ణు పట్టించినవారికి లక్ష రూపాయలు బహుమతి ఇవ్వనున్నట్లు పోస్టర్ని అతికించాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అతన్ని అరెస్టు చేశారు. -
మాట్లాడాలని పిలిపించి స్నేహితుడి హత్య
దొడ్డబళ్లాపురం: బార్లో ఉన్న స్నేహితుడిని మాట్లాడాలని తీసికెళ్లి మరో మిత్రుడు తన సహచరులతో కలిసి దారుణంగా హత్య చేసిన సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా హుస్కూరు గ్రామం నివాసి శశికుమార్ కుమారుడు హేమంత్గౌడ (27) హత్యకు గురైన యువకుడు. రౌడీషీటర్ నరసింహమూర్తి తన సహచరులతో కలిసి హత్యకు పాల్పడ్డ నిందితుడు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో హేమంత్గౌడ తన స్నేహితులతో కలిసి బాశెట్టిహళ్లి వద్ద ఉన్న జేపీ బార్లో పార్టీ చేసుకుంటుండగా నిందితుడు నరసింహమూర్తి ఫోన్ చేసి మాట్లాడాలని బయటకు రమ్మని పిలిచాడు. హేమంత్ బార్లో నుండి బయటకు రాగానే నరసింహమూర్తితో వచ్చిన సుమారు 10 మంది సహచరులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడ్డ హేమంత్ను టెంపోలో వేసుకుని ఊరంతా తిప్పారు. చావుబతుకుల మధ్య పోరాడుతున్న హేమంత్ను చూసి పైశాచికానందం పొందారు. హేమంత్పై దాడి జరగగానే పక్కనే ఉన్న స్నేహితులు వెంటనే హేమంత్ తండ్రికి సమాచారం ఇచ్చారు. హేమంత్ తండ్రి, కుటుంబ సభ్యులు బార్ వద్ద వచ్చి చూడగా హేమంత్ జాడ లేదు. హేమంత్ ఊపిరి ఆగిపోయే వరకూ టెంపోలో ఊరంతా తిప్పిన నరసింహమూర్తి చివరకు శవాన్ని బెంగళూరు రోడ్డులో ఉన్న నవోదయ పాఠశాల వద్ద రోడ్డుపక్కన పడేసి వెళ్లిపోయారు. మృతుడు హేమంత్ రియల్ ఎస్టేట్, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. నిందితుడు నరసింహమూర్తి పేకాట క్లబ్బులు నడుపుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు. దీంతో అతడిపై పోలీసులు రౌడీషీట్ తెరిచారు. అయితే మృతుడు, హతుడు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య ఎందుకు శత్రుత్వం పెరిగిందనేది తెలీడంలేదు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అందరూ పరారీలో ఉన్నారు. హతుడిని టెంపోలో ఊరంతా తిప్పిన నిందితులు శవాన్ని రోడ్డుపక్కన విసిరేసి పరారీ -
No Headline
● కలబుర్గి జిల్లాలో అమానుషం యశవంతపుర: దుండగులు ఓ పాత కార్ల వ్యాపారి, అతడి ఇద్దరు స్నేహితులను అపహరించి మర్మాంగాలకు కరెంటు షాక్ ఇచ్చి చిత్రహింసలకు గురి చేశారు. భవిష్యత్లో తమకు కమీషన్ ఇవ్వాలని చెప్పి హెచ్చరించి వదిలేశారు. ఈ అమానుష ఘటన కలబురగి జిల్లా సేడంలో జరిగింది. సేడం తాలూకా దేవనూర గ్రామానికి చెందిన అర్జున్ బెంగళూరు నుంచి పాత కార్లను కొనుగోలు చేసి అమ్ముతుంటారు. ఈ నెల 5వ తేదీన పరిచయమైన రమేశ్ అనే వ్యక్తికి పాత కార్లను చూపించటానికి స్నేహితులైన ఎండి సమీరోద్దిన్, అబ్దుల్ రహమాన్ను వెంట తీసుకెళ్లాడు. అక్కడ రమేశ్ టెస్ట్ డ్రైవ్ చేశారు. కారుకు డబ్బులిచ్చేవారు కలబురగి హాగరగా వద్ద ఉన్నారని చెప్పాడు. అనంతరం ముగ్గురినీ కారులో ఎక్కించుకెళ్లాడు. ఒక ఇంటి వద్దకు వెళ్లగా 10 మందికి పైగా వ్యక్తులు కారులో ఉన్న ముగ్గురినీ బలవంతంగా లోపలకు తీసుకెళ్లారు. రమేశ్, ఇమ్రాన్ పటేల్, మహమ్మద్ మతిన్ అనే వ్యక్తులు ఈ ముగ్గురిపై దాడి చేశారు. ఆనంతరం వారి దుస్తులు ఊడదీశారు. మర్మాంగాలకు కరెంట్ వైర్లు తాకించి హింసించారు. ఈ దృశ్యాలను వీడియో తీశారు. పాత కార్లను విక్రయించగా వచ్చే కమీషన్లో తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. లేకపోతే హత్య చేస్తామని బెదిరించి వదిలేశారు. అనంతరం బాధితులు కలబురగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
నిరాడంబరంగా జయంతులు
హొసపేటె: లోక్సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లా యంత్రాంగం, జెడ్పీ ఆధ్వర్యంలో కన్నడ, సంస్కృతీ శాఖ కార్యాలయ ఆవరణలో జగజ్యోతి బసవేశ్వర జయంతి, శివశరణి హేమారెడ్డి మల్లమ్మ జయంతిని సరళంగా నిర్వహించారు. నగరంలోని బసవేశ్వర సర్కిల్లోని బసవేశ్వరుని విగ్రహానికి జిల్లాధికారి ఎంఎస్ దివాకర్, జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లాధికారి కార్యాలయ హాలులో బసవేశ్వరుడు, హేమారెడ్డి మల్లమ్మల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కన్నడ, సంస్కృతీ శాఖ సహాయ సంచాలకులు సిద్ధలింగేష్ రంగన్నవర్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రథ చక్రం కింద పడి వ్యక్తి మృతి హుబ్లీ: జిల్లాలోని అణ్ణిగేరి తాలూకా మజ్జిగుడ్డ గ్రామంలో బసవేశ్వర జాతర మహోత్సవం సందర్భంగా జరిగిన రథోత్సవం వేళ రథ చక్రం కింద పడి ఓ భక్తుడు మృతి చెందిన ఘటన జరిగింది. మరో ఇద్దరు అదృష్టవశాత్తు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నారు. వివరాలు..మహమ్మద్ సాబ్ హళ్లికేరి(56) మృతుడు. వేగంగా వస్తున్న రథం చక్రం కింద ఇరుక్కొని తీవ్రంగా గాయపడిన మహమ్మద్ సాబ్ను తక్షణమే ప్రైవేట్ వాహనంలో అణ్ణిగేరి ప్రాథమిక ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. కాగా అణ్ణిగేరి పోలీసు స్టేషన్ ఇన్చార్జి అధికారి సిద్దారూడ ఆలదకట్టి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వైభవంగా ఆదిబసవేశ్వర రథోత్సవం రాయచూరు రూరల్: తాలూకాలోని యరమరస్లో ఆది బసవేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం వందలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. యరమరస్లో వెలసిన ఆది బసవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు నెరవేర్చారు. రథోత్సవంలో గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, రాయచూరు, మాన్వి, సింధనూరు, కొప్పళ, బళ్లారి ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాదిగలకు కాంగ్రెస్ ద్రోహం రాయచూరు రూరల్: మాదిగలకు కాంగ్రెస్ రాజకీయంగా ద్రోహం చేసిందని సీనియర్ సాహితీవేత్త దానప్ప అన్నారు. ఆయన శుక్రవారం కన్నడ భవనంలో అంబేడ్కర్, బసవేశ్వరుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడారు. సాంఘిక న్యాయం కోసం పోరాడి కుల, వర్గ, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు పాటుపడిన నేతల ఆశయాలను తుడిచి పెట్టారన్నారు. కళ్యాణ కర్ణాటకలో మాదిగలకు కాంగ్రెస్ టికెట్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. రాజ్యాంగం, సాంఘిక న్యాయాన్ని పార్టీ అగౌరవపరిచిందన్నారు. సమావేశంలో మారెప్ప, రాజు, శ్రీనివాస్ కొప్పర, నరసింహులు, శివరాయ, హనుమంతు, రాజప్ప, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్నికలకు కర్ణాటక ఆర్టీసీ బస్సులు రాయచూరు రూరల్: ఆంధ్రపదేశ్లో ఈనెల 13న జరుగనున్న మూడో విడత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాయచూరు డివిజన్ నుంచి కర్ణాటక ఆర్టీసీ బస్సులను తరలిస్తున్నట్లు రాయచూరు ఎన్ఈకేఆర్టీసీ డివిజనల్ కంట్రోలర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈనెల 12 నుంచి 14 వరకు 42 బస్సులను కర్నూలు లోక్సభ పరిధిలోని మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరులకు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం బస్సులను పంపడం వల్ల జిల్లాలో మూడు రోజుల పాటు రవాణా సౌకర్యంలో ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు. -
లారీ ఢీకొని బైకిస్టు మృతి
కోలారు: లారీ ఢీకొని బైకిస్టు మృతి చెందాడు. ఈ ఘటన బంగారుపేట తాలూకా యళేసంద్ర గ్రామం వద్ద చోటు చేసుకుంది. గుల్లహళ్లి గ్రామానికి చెందిన మధు (25) బైక్పై వెళ్తుండగా కామసముద్రం నుంచి బూదికోట వైపు వస్తున్న లారీ ఢీకొంది. మధు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ లారీతో సహా ఉడాయించాడు. బూదికోట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఓటు వేయడానికి వస్తూ మృతి సోమందేపల్లి: మండలంలోని పందిపర్తి గ్రామానికి చెందిన నరసింహమూర్తి (52) బెంగళూరు నుంచి ఓటు వేయడానికి స్వగ్రామానికి వస్తూ మరణించాడు. కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసించేవారు. శనివారం భార్య లక్ష్మీదేవమ్మ, కుమారుడు నాగేష్లతో కలిసి బస్సులో వస్తుండగా హిందూపురం సమీపంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు. గ్రామస్థులు హిందూపురం బస్టాండుకు చేరుకుని మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. ఘటనపై గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు. మహిళకు గర్భస్రావం..ఆస్పత్రి సీజ్మాలూరు : మహళ గర్భస్రావానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాలూరు పట్టణంలో ఉన్న సంజనా ఆస్పత్రిని తాలూకా ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. వివరాలు.. కొలారు జిల్లా కేజీఎఫ్ తాలూకా ఆడంపల్లి గ్రామానికి చెందిన మురుగేష్, అనిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.మూడో సారి ఆమె గర్భం ధరించింది. కడుపులో ఉన్నది ఆడబిడ్డనా, మగ బిడ్డనా అని తెలుసుకునేందుకు స్కానింగ్ కోసం అనితను సోమవారం ఆమె భర్త ఆస్పత్రికి తీసుకొచ్చాడు. స్కానింగ్లో ఆడబిడ్డ ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పినట్లు దంపతులు ఆరోపిస్తున్నారు. అనంతరం ఆడ బిడ్డను మగ బిడ్డగా పరివర్తన చేయడానికి అనితకు కొన్ని మందులు ఇచ్చారు. వాటిని వేసుకున్న తర్వాత బుధవారం ఆమెకు అబార్షన్ అయ్యింది. కడుపులో ఉన్నది ఆడ పిల్ల అని ఆబద్ధం చెప్పి తమ వద్ద ఆస్పత్రి సిబ్బంది రూ. 25వేలు డబ్బు తీసుకొని చివరకు అబార్షన్కు వైద్యుడు మోహన్ కారణమైనట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం తాలూకా వైద్యాధికారులు వచ్చి ఆస్పత్రిని సీజ్ చేశారు. ఘటనపై మాలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బ్యాగ్ చోరీహుబ్లీ: రైల్లో పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్లో ఉన్న రూ.30,300 విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగు చూసింది. బెంగళూరు కామాక్షిపాళ్యకు చెందిన మహాదేవి బెంగళూరు నుంచి విజయపురకు గోల్గుంబజ్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణిస్తోంది. వెంట తెచ్చుకున్న బ్యాగ్ను తల కింద పెట్టుకొని నిద్రిస్తుండగా బ్యాగ్ చోరీకి గురికావడంతో అందులో దాచుకున్న నగదు, 5 గ్రాముల చెవిదుద్దులు, ఇతర సామగ్రి చోరీకి గురైనట్లు ఆమె హుబ్లీ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
ఉద్దానానికి ఊపిరి
పెత్తందారులకు మళ్లీ షాకే!
పర్యాటకం కళకళ
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
తప్పక చదవండి
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- ఉద్దానానికి ఊపిరి
- పర్యాటకం కళకళ
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement