కడప కల్చరల్: రాష్ట్ర రోడ్డు రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి, రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్రెడ్డి శనివారం కడపలోని శ్రీవిజయదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అర్చకులు అమ్మవారి విశిష్టతలను తెలిపి విశేష పూజలు చేసి హారతులు ఇచ్చారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ కుటుంబమంతా అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించేందుకు వచ్చామన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు, భక్తులు పాల్గొన్నారు.
కడప కల్చరల్: కడప నగరంలో మరో కార్పొరేట్ నగల దుకాణం వెలిసింది. ఆర్టీసీ బస్టాండు వద్ద జోస్ ఆలుక్కాస్ షోరూంను శనివారం ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డితో కలిసి ప్రారంభించారు.సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వర్ఘీస్ ఆలుక్కా, పాల్ జె అలుక్కా, జాన్ అలుక్కాలు వారికి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. నిధి అగర్వాల్ మాట్లాడుతూ తానుకడపకు రావడం ఇదే తొలిసారి అని, సంప్రదాయ, ఆధునిక నగల కలెక్షన్స్తో షోరూం తన పేరును ఇనుమడింపజేసుకుందన్నారు. ఇది కడప నగరానికి శోభ ఇవ్వగలదని కొనియాడారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి బ్రాడెండ్ నగల షోరూంలు మరిన్ని కడప నగరానికి రావాలని ఆకాక్షించారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రారంభోత్సవ సందర్బంగా జోస్ ఆలుక్కాస్ షోరూం ప్రత్యేక ఆఫర్లను అందిస్తోందన్నారు. నేటి నుంచి జులై 21 వరకు ప్రత్యేక ఆఫర్లలో భాగంగా రూ. 60 వేలు విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాల కనీస కొనుగోలుపై కస్టమర్లకు బంగారు నాణేన్ని అందజేస్తామన్నారు. అదనంగా వజ్రాలపై 20 శాతం, ప్లాటినం ఆభరణాలపై ఏడు శాతం తగ్గింపు ఉందన్నారు. బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై 50 శాతం తగ్గింపు ఉందని, ఈ షోరూంలో ప్రతి కొనుగోలుపై ఒక ఉచిత బహుమతి ఇస్తామన్నారు. ఈ సందర్బంగా అభిమానులు సినీనటి నిధి అగర్వాల్తో మాట్లాడాలని, సెల్ఫీలు, కరచాలనం తీసుకోవాలని కోరారు. యాంకర్ మరీమరీ కోరడంతో నిధి అగర్వాల్ కొద్దిసేపు ఓ పాటకు స్టెప్పులేశారు. అభిమానులు ఉర్రూతలూగి కేకలు, ఈలలతో అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment