ఖాజీపేట : దోమల నివారణకు వారంలో ఒక రోజు డ్రైడేగా పాటించాలని జిల్లా వైద్యాధికారి నాగరాజు తెలిపారు. మలేరియా మాసోత్సవాల్లో భాగంగా సుంకేశుల దళితవాడలో ఫ్రైడేను డ్రైడేగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన స్థానికులను ఉద్దేశించి మాట్లాడుతూ దోమల వల్ల మలేరియాతోపాటు టైఫాయిడ్, డెంగీ, చికెన్గున్యా, మెదడువాపు, పచ్చ జ్వరం వస్తాయని అన్నారు. వాటి నివారణకు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. మురుగు కాలువల్లో కిరోసిన్ లేక వేస్ట్ ఆయిల్ వేయాలని తెలిపారు. దోమతెరలను వాడాలని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించడం వల్ల దోమల లార్వా వృద్ధి చెందకుండా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం వర్షకాలం నడుస్తోందని అన్నారు. ఈ సమయంలో దోమల వృద్ధి అధికంగా ఉంటుందని అన్నారు. దీని నివారణకే జాగ్రత్తలు పాటించాలని అన్నారు. జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ మనోరమ మాట్లాడుతూ దోమల లార్వా నివారణకు అబేట్ ద్రావణం పిచికారీ చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల అందరినీ అప్రమత్తత చేయాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి మునీబ్, సూపర్ వైజర్లు శోభన్బాబు, కృష్ణప్రియ, వైద్య సిబ్బంది శివనామణి, భాస్కర్, మోహన్, వేంకటేశ్వర్లుతోపాటు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment