మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య,
సుంకె రవిశంకర్
వేలేరు/ధర్మసాగర్ : వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం వేలేరు, ధర్మసాగర్లలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సన్నాహక సమావేశాలకు వారు హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓ బ్లాక్ మెయిలర్ అని, అతన్ని నమ్మే స్థితిలో పట్టభద్రులు లేరన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తీన్మార్ మల్లన్న కంటే పెద్ద నయవంచకుడు, మోసగాడని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఉన్నత విద్యావంతుడని, ఇప్పుడు తెలంగాణకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకని తెలిపారు. ధర్మసాగర్ మండలంలో 3 బూత్లు ఉన్నాయని,1,704 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఒక బూత్కు 10 మంది ఇన్చార్జ్ల చొప్పున మూడు బూత్లకు 30 మందిని నియమించాలని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని, తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పి పట్టభద్రుల వద్ద ఓటు అడగాలని డిమాండ్ చేశారు. ఆయా సమావేశాల్లో జెడ్పీటీసీ చాడ సరిత, వైస్ ఎంపీపీ సంపత్, ఎంపీటీసీ సంధ్య, కోఆష్షన్ సభ్యుడు జానీ, పార్టీ మండల అధ్యక్షుడు మరిజె నర్సింగరావు, మునిగెల రాజు, నాయకులు బొడ్డు ప్రభుదాస్, కర్ర సోమిరెడ్డి, లాల్ మహ్మద్, గుర్రపు ప్రవీణ్, కాయిత మాధవరెడ్డి, గోవింద సురేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.