మద్దిరాల : పోలీస్ సిబ్బంది తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించారు. బుధవారం మద్దిరాపోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులు, పోలీస్ స్టేషన్ మ్యాప్, గ్రామాల హద్దులను పరిశీలించారు.జిల్లా బార్డర్లో కుంటపల్లి వద్ద చెక్ పోస్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల పై మరింత నిఘా ఉంచాలన్నారు. గత ఎన్నికల్లో నేరాలకు పాల్పడిన వారిని, పోలీస్ రికార్డ్స్లో రౌడీ షీటర్లుగా ఉన్న వారిని, సస్పెక్ట్ను, ట్రబుల్ మాంగర్స్ను, షీటర్లుగా ఉన్న వారినందరినీ ముందుస్తుగా బైండోవర్ చేయాలన్నారు. వారికి ఎన్నికల నియమ నిబంధనలు, చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. యువత ఆదర్శంగా ఉండి గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ఆయన వెంట సీఐ బ్రహ్మమురారి, మద్దిరాల, నూతనకల్ ఎస్ఐలు రవీందర్, నరేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
నేడు సూర్యాపేటలో క్రీడా పోటీలు
మునగాల: జిల్లా కేంద్రంలోని క్లియో స్పోర్ట్స్ అరేన స్టేడియంలో అండర్–14, 17బాలబాలికలకు షెటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్ పోటీలను ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా స్కూల్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎండి.ఆజంబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14,17 బాలబాలికలకు బాల్ బ్యాడ్మింటన్, త్రోబాల్ పోటీలను శుక్రవారం మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అందజేయాలని, ఇంటర్మీడియట్ విద్యనభ్యసించే వారైతే పదవ తరగతి మెమోతో పాటు బోనఫైడ్ సర్టిఫికెట్ అందచేయాల్సి ఉంటుందని, వివరాలకు సెల్ నంబర్ 89692 21234లో సంప్రదించవచ్చని సూచించారు.
తేమ 17శాతం ఉండేలా చూసుకోవాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చే రైతులు తేమ 17శాతం ఉండేవిధంగా చూసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి రామారావునాయక్ సూచించారు. బుధవారం ఆత్మకూర్లోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకొస్తే మద్దతు ధర వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దివ్య, వ్యవసాయ విస్తరణ అధికారి శైలజ, రైతులు పాల్గొన్నారు.
మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలి
నడిగూడెం : ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి, ఇంటర్మీయట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ హెచ్.అరుణ కుమారి కోరారు. బుధవారం ఆమె స్థానిక బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. పాఠశాల ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ సీహెచ్.ధనవిజయలక్ష్మి, వైస్ప్రిన్సిపాల్స్ ఎం. వసంత, రేణుక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.