● తీరంలో నిఘా కోసం
మెకనైజ్డ్ బోటు ప్రారంభం
● తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు
వేట సాగించకుండా పటిష్ట చర్యలు
● కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి
బిట్రగుంట: కావలి నియోజకవర్గంలోని తీరప్రాంత మత్స్యకారుల ప్రయోజనాలే లక్ష్యంగా ఇతర రాష్ట్రాలకు చెందిన మెకనైజ్డ్ బోట్లు వేట సాగించకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి తెలిపారు. మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో మత్స్యకార గ్రామాల కాపులతో కలిసి మెకనైజ్డ్ నిఘా బోటును సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి మాట్లాడుతూ తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన వారు కావలి తీరం వరకు చొచ్చుకొచ్చి పెద్దతరహా మెకనైజ్డ్ బోట్లలో వేట సాగిస్తుండడంతో స్థానిక మత్స్యకారుల వలలు దెబ్బతినడమే కాకుండా మత్స్యసంపద దొరకడం లేదని తెలిపారు. ఈ విషయంలో తరచూ స్థానిక, ఇతర రాష్ట్రాలకు చెందిన మత్స్యకారుల నడుమ వివాదాలు నెలకొంటున్నాయన్నారు. ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి తీరంలో నిఘా కోసం రూ.50 లక్షలతో ప్రత్యేకంగా మెకనైజ్డ్ బోటును కేటాయించారని వివరించారు. కావలి నియోజకవర్గంలో సుమారు 47 కిలోమీటర్ల తీరప్రాంతం ఉండగా వేలాది మత్స్యకార కుటుంబాలు సముద్రంలో వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. ఈ కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు తీరంలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. వేట నిషేధ సమయంలో ప్రతికుటుంబానికి రూ.10వేల పరిహారంతో పాటు రూ.10 లక్షల ప్రమాద బీమా అందజేస్తున్నామని వివరించారు.