కొత్తాకు పట్టం కట్టండి
దుబ్బాకటౌన్/దౌల్తాబాద్: ‘యువతరం సీఎం కేసీఆర్ వెంటే ఉంది.. కాంగ్రెస్, బీజేపోళ్లు చెప్పే ఫాల్త్ మాటలు నమ్మవద్దు.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం’ అని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం దౌల్తాబాద్లో దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ హాజరై మాట్లాడారు. ఈ ఎన్నికలు మీ తలరాతలు మార్చేవని, ఏ మాత్రం పొరపాటు చేసినా బతుకులు ఆగమవుతాయన్నారు.
కేసీఆర్ పుట్టి, పెరిగిన గడ్డ ఇది..
దుబ్బాక అంటే సీఎం కేసీఆర్ పుట్టి, పెరిగి, విద్యాబుద్ధులు నేర్చిన గడ్డ అని ఈ ప్రాంతంమన్నా.. ప్రజలన్నా సీఎం కేసీఆర్కు ఎంతో అభిమానమని కేటీఆర్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి నేను, మంత్రి హరీశ్రావు జిమ్మేదారి అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొంటామన్నారు.
ఓటుతో బుద్ధి చెప్పాల్సిందే..
ఉప ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి గెలిచిన రఘునందన్రావు పైసా పని చేసిండా.. ఒక్క హామీ అయినా నెరవేర్చిండా అని ప్రజలు ఆలోచించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. అబద్దాలు ఆడి గద్దె నెక్కిన రఘునందన్ను ప్రజలు చిత్తుగా ఓడించాలన్నాని పిలుపునిచ్చారు. ఎంపీ ప్రభాకర్రెడ్డి చేసిన పనులకు కొబ్బరికాయలు కొట్టిన వ్యక్తి.. మళ్లీ ఇప్పడు దగాకోరు మాటలు మాట్లాడుతున్నాడని అన్నారు.
భారీగా హాజరైన జనం..
బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతుగా దౌల్తాబాద్లో నిర్వహించిన మంత్రి కేటీఆర్ రోడ్ షోకు నియోజక వర్గం నలుమూలల నుంచి భారీగా జనం హాజరయ్యారు. ముఖ్యంగా యువ సమ్మేళనం రోడ్ షో కావడంతో యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దౌల్తాబాద్లో ప్రధాన రోడ్లన్నీ గులాబీ మయమయ్యాయి.
సీఎం కేసీఆర్ వెంటే యువత
పైసా పనిచేయని రఘునందన్ను చిత్తుగా ఓడించాలి
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
దుబ్బాకలో రోడ్ షో