యడ్లపాడు: అంబేడ్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని మండలంలోని ఉన్నవలో జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన అంబేడ్కర్ యువజన సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు ఉమ్మడి గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన 25 జట్లు పాల్గొన్నాయి. గ్రామంలోని ఉదయపురి కాలనీలో ఈనెల 11వ తేదీ నుంచి ఈ పోటీలు కొనసాగుతున్నాయి. పగలు ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున రాత్రివేళల్లో ఫ్లడ్లైట్ల వెలుగుల్లో ఆయా జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. దీంతో గ్రామస్తులే కాకుండా సమీప ప్రాంతాలకు చెందిన క్రీడాభిమానులు భారీగా తరలివచ్చి ఆసక్తిగా తిలకిస్తూ క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తున్నారు. పోటీల్ని ఉన్నవ గ్రామ సర్పంచ్ దంటూ సరళ, రామారావు దంపతులు పర్యవేక్షిస్తున్నారు. యువజన సమాఖ్య సభ్యులు దంటూ శ్రీకాంత్, కొర్నెపాటి ప్రభుదాసు, మద్దు విజయపవన్, మద్దు జాన్బెన్నీ, కూరాకుల వర్ధన్రావు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు.