హన్వాడ: గత ప్రభుత్వంలో గొర్రెల యూనిట్ల కోసం కురుమ యాదవులు చెల్లించిన డీడీలను తిరిగి చెల్లించేందుకు కృషి చేస్తున్నట్లు మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నధర్పల్లి సమీపంలోగల ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ గతంలో తాను చేపట్టిన పాలమూరు న్యాయయాత్రకు హన్వాడ మండలంలో అపూర్వ స్పందన వచ్చిందన్నారు. అదే ఊపుతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు 20వేల మెజార్టీ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఎన్నికల అనంతరం కులగణన చేపట్టడంతో పాటు ముదిరాజ్లను బీసీ–ఏలోకి మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ పదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీలేదన్నారు. ఉత్తరాదిలో ఆ పార్టీ శకం ముగిసిపోయిందని.. 170 – 180 సీట్లకే పరిమితమవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయని చెప్పారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లాకు రూ. 5వేట కోట్లు మంజూరు చేశారని.. వచ్చే ఐదేళ్లలో రూ. 50వేల కోట్ల అభివృద్ధి జరగబోతుందని తెలిపారు. జిల్లా నుంచి వంశీచంద్రెడ్డిని గెలిపించి, సీఎం రేవంత్రెడ్డికి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఓబెదుల్లా కొత్వాల్, సంజీవ్ ముదిరాజ్, ఎన్పీ వెంకటేష్, మహేందర్, సురేందర్రెడ్డి, లక్ష్మణ్, శ్రీను, రాజునాయక్, వెంకటయ్య, శ్రీశైలం, ఎల్లప్ప పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి
వంశీచంద్రెడ్డి