![వరంగల్లో రంజీ మ్యాచ్లు](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/21/20hmkd133-330087_mr.jpg.webp?itok=wg83GOPB)
వరంగల్ స్పోర్ట్స్ : అధునాతన హంగులతో వరంగల్లో కొత్త స్టేడియం నిర్మిస్తామని, దీనిపై త్వరలోనే అపెక్స్ కౌన్సిల్లో చర్చిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు ఎ.జగన్మోహన్రావు అన్నారు. నగరంలోని ఎల్బీ కళాశాల మైదానంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంపు సోమవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఇక నుంచి వరంగల్లో రంజీ మ్యాచ్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ప్రతిభ కలిగిన కీడాకారులు ఉన్నారని, వారిని గుర్తించి సానపెడతామని తెలిపారు. ఇందుకోసమే భారీ స్థాయిలో సమ్మర్ క్యాంపులు నిర్వహించామన్నారు. అనంతరం శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పవన్కుమార్గౌడ్, హెచ్సీఏ ఉపాధ్యక్షుడు సర్దార్ ధల్జిత్ సింగ్, కార్యదర్శి ఆర్.దేవరాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి జస్వరాజు, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ బాధ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి ఉదయభానురావు, అంతర్జాతీయ హ్యాండ్ బాల్ క్రీడాకారుడు పోగుల అశోక్, సీనియర్ క్రీడాకారులు మట్టెడ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు