భూపాలపల్లి అర్బన్: జిల్లాలోని ఆరు మోడల్ స్కూళ్లలో ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అఽధికారి రాంకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని చిట్యాల, కొర్కిశాల, దొబ్బలపాడు, గంగారం, ఎడ్లపల్లి, గణపురం మోడల్ స్కూళ్లలో 6 నుంచి 10వ తరగతి వరకు సీట్ల భర్తీ కోసం పరీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
హేమాచలక్షేత్రంలో పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరులో గల శ్రీహేమాచల క్షేత్రంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్య ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో మొదటి సారిగా ఆలయానికి వచ్చిన ఆమెకు ఆలయ పూజారులు కై ంకర్యం రాఘవాచార్యులు, శేఖర్శర్మ, ఆశ్వర్చంద్ రామానుజం మర్యాద పూర్వకంగా ఆలయంలోకి స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని స్వామివారికి వారి గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు చేసి స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల శేష వస్త్రాలను బహుకరించి వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆమె వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
కొనసాగుతున్న
కామేశ్వరాలయ పనులు
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపదగా పేరొందిన రామప్ప దేవాలయం పక్కన గల కామేశ్వరాలయ పునర్నిర్మాణ పనులు పది రోజులుగా కొనసాగుతున్నాయి. ‘13 ఏళ్లుగా మూలనపడ్డ కామేశ్వరాలయ శిల్పాలు’ శీర్షికన గత నెల 27న సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ఆలయ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పది రోజులుగా పునాది రాళ్లను తొలగించేందుకు రెండు మీటర్ల వరకు తవ్వకాలు చేపట్టారు. ఆదివారం నుంచి కామేశ్వరాలయం లోపల ఉన్న ఇసుకను తొలగించడంతో పాటు రెండు లేయర్లుగా ఉన్న కామేశ్వరాలయ పునాదిరాళ్లను క్రేన్ సహాయంతో తొలగిస్తున్నారు. మూడు నెలల్లోగా కామేశ్వరాలయానికి ఫౌండేషన్ వేయనున్నట్లు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు.
ఎన్ఎస్ఎస్ విద్యార్థుల
సేవలు అభినందనీయం
ఏటూరునాగారం: ఎన్ఎస్ఎస్ సేవలు అభినందనీయమని ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, కేయూ ప్రొఫెసర్ నారాయణ అన్నారు. మండల పరిధిలోని చిన్నబోయినపల్లిలో వారం రోజులు సమ్మర్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమ్మర్ క్యాంపు వారం రోజుల పాటు సంస్కృతీ, సంప్రదాయాలైన నృత్యాలు, ఉపన్యాసాలతో ఎంతో ఉత్సాహంగా సాగిందన్నారు. ఈ గ్రామాన్ని దత్తతగా తీసుకొని అన్ని కార్యక్రమాలు చేపట్టామన్నారు. మూడేళ్ల పాటు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ టీం బృందం ప్రతీ ఏడాది ఈ గ్రామాన్ని సందర్శించి సమస్యలను తెలుసుకొని సేవా కార్యక్రమాలు చేపడుతారని వివరించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ జిల్లా అధికారిణి రాధిక మాట్లాడుతూ విద్యార్థినులు వారం రోజుల పాటు గ్రామంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల వార్డెన్ ప్రభాకర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.