తాడికొండ: తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత నామినేషన్ ఘట్టం కొనసాగింది. గుంటూరు నవభారత్నగర్ 4వ లైను నుంచి ప్రారంభమైన ర్యాలీ తాడికొండ చేరడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. నవభారత్ నగర్, విద్యానగర్, సాయిబాబా రోడ్డు, కొరిటెపాడు మీదుగా లాడ్జి సెంటర్ వద్దకు చేరుకొని బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం రామా బిల్డింగ్, నగరాలు, గోరంట్ల, లాం సెంటర్కు చేరుకొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాం గ్రామస్తులు క్రేన్తో సుచరితకు భారీ గజమాలను వేసి సత్కరించారు. అనంతరం వాహనాల ర్యాలీ నడుమ తాడికొండ అడ్డరోడ్డుకు చేరుకోగా అక్కడ మేడికొండూరు మండలానికి చెందిన కొరివి అజయ్ ఏర్పాటు చేసిన భారీ గజమాలతో స్వాగతం పలకగా కార్యకర్తలు నాయకులు కదం తొక్కారు. అడ్డరోడ్డు కూడలి జనసంద్రంగా మారింది. డీజే బాక్సులు, పూల జల్లులతో అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం పలికారు. ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కుమారుడు మేకతోటి హర్షిత్, కుమార్తె మేకతోటి రిషికతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకొన్న మేకతోటి సుచరిత నామినేషన్ పత్రాలు ఆర్వో ఎం గంగరాజుకు అందజేశారు. నామినేషన్ ఘట్టానికి స్వచ్ఛందంగా 25 వేల మందికి పైగా హాజరయ్యారు. మండుటెండను లెక్క చేయకుండా నామినేషన్ కార్యక్రమానికి మహిళలు, యువకులు, పార్టీ నాయకులు, కార్యాకర్తలు భారీగా హాజరయ్యారు. రహదారులు జై జగన్, జై సుచరిత నినాదాలతో దద్దరిల్లిపోయింది. అనంతరం ఎంపీ కిలారి వెంకట రోశయ్యతో కలిసి తాడికొండ షిర్డిసాయి పర్తి సాయిబాబా ఆలయంలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ర్యాలీ మార్గంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్వయంగా రంగంలోకి దిగి తాడికొండ అడ్డరోడ్డులో వాహనాలను ముందుకు నడిపించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యతో కలసి ఆర్వోకు
నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న
మేకతోటి సుచరిత
గుంటూరు నుంచి జన ప్రవాహం అడుగడుగునా మంగళహారతులు, పూలతో స్వాగతం ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్యే ముస్తఫా, ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి హాజరు కుమారుడు, కుమార్తెతో కలిసి ర్యాలీలో పాల్గొన్న సుచరిత