జేసీ రాజకుమారి
గుంటూరు వెస్ట్: రోజు వారి తినే ఆహారంలో చిరుధాన్యాలు జోడిస్తే చక్కని ఆరోగ్యం సమకూరుతుందని జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. బుధవారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో పోషణ పక్షోత్సవాల్లో భాగంగా చిరుధాన్యాల ప్రదర్శనను ఆమె పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ ప్రస్తుతం కల్తీ యుగం నడుస్తోందని ఈనేపథ్యంలో మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. చక్కని ఆరోగ్యం కోసం కొంత సేపు వ్యాయామం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ఐసీడీఎస్ పీడీ మనోరంజని, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
విశ్వజనీన ప్రార్ధన మందిరం ప్రారంభం
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం రామకృష్ణ మిషన్ ప్రాంగణంలో భగవాన్ శ్రీ రామకృష్ణ విశ్వజనీన ప్రార్థన మందిరం బుధవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆత్మవిదానంద్జీ మహరాజ్, బెంగళూరు రామకృష్ణమఠం మందిరాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగీత విభావరిలో త్యాగరాజ, అన్నమయ్య కీర్తలను ఆలపించారు. సంధ్యాహారతి, భజనలతో కార్యక్రమం వైభవంగా ముగిసింది. హైకోర్టు న్యాయమూర్తి మోహన్రావును ఘనంగా సత్కరించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నాగరాణి, రామకృష్ణ మిషన్ కార్యదర్శి హృదనంద్ మహరాజ్, సహాయ కార్యదర్శి స్వామి సేవ్యానందజీ, రామకృష్ణ మిషన్ పాఠశాల హెచ్ఎం సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 534.00 అడుగుల వద్ద ఉంది. ఇది 176.0590 టీఎంసీలకు సమానంగా ఉంది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకి 9,160, ఎడమకాలువకు 2,980, ఎస్ఎల్బీసీకి 2,000, వరదకాలువకి 320 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 14,460 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 14,460 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 812.00 అడుగుల వద్ద ఉంది. ఇది 35.4771 టీఎంసీలకు సమానం.
పులిచింతల నీటి నిల్వ
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 44.3840 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు ఎగువ నుంచి 1200 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఏప్రిల్లో బందరు పోర్టు పనులు ప్రారంభం
మచిలీపట్నంటౌన్: బందరు పోర్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏప్రిల్ నెలలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. బచ్చుపేట వెంకటేశ్వరస్వామి ఆలయ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. తెలుగు సంవత్సరాదిలో జిల్లా మరింత సమగ్రాభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. పోర్టు ఏర్పాటుతో జిల్లానే కాకుండా రాష్ట్రం మరింతగా పురోగమిస్తుందని చెప్పారు. పనులు ప్రారంభించి వేగంగా జరిగేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారని వివరించారు.