అమలాపురం రూరల్: పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప పాలనాదక్షుడు, దార్శనికుడు, రాజనీతిజ్ఞుడని, స్వాతంత్య్రానంతరం తొలి ప్రధానిగా దేశ ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలకు గట్టి పునాదులు వేశారని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెహ్రూ జయంతి, బాలల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నెహ్రూ చిత్రపటానికి మంగళవారం ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్య్రం పొందిన ఆనంతరం మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకునేలా చేయడంలో, విశిష్ట రాజ్యాంగం ఏర్పాటులో నెహ్రూ చేసిన కృషి అసామాన్యమైనదని అన్నారు. ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసి, పంచవర్ష ప్రణాళికలతో రాష్ట్రాలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో భాగంగా అనేక ప్రభుత్వరంగ సంస్థలు ఏర్పాటు చేశారన్నారు. మంత్రివర్గ సహచరులు, ప్రతిపక్షాల అభిప్రాయాలకు విలువనివ్వడం ద్వారా పార్లమెంటరీ సంప్రదాయాల గౌరవప్రతిష్టలను పెంచారని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్ఓ సీహెచ్ సత్తిబాబు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
సైనిక సంక్షేమ నిధికి
రూ.3.23 లక్షల విరాళం
అమలాపురం రూరల్: జిల్లా సైనిక సంక్షేమ నిధికి పట్టణ పేదరిక నిర్ములన సంస్థ (మెప్మా) స్వయం సహాయక సంఘాల సభ్యులు రూ.3,22,927 విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్ను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి డాక్టర్ సత్యప్రసాద్లకు మెప్మా పీడీ బి.ప్రియంవద మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల నుంచీ సేకరించిన నిధిని అమరవీరుల, దివ్వాంగ సైనికుల కుటుంబాల పునరావాసం, సంక్షేమ పథకాలకు వినియోగిస్తున్నారని చెప్పారు. పీడీ ప్రియంవద మాట్లాడుతూ, మెప్మా స్వయం సహాయక సభ్యులు ఒక్కొక్కరు రూ.10 చొప్పున అమలాపురంలో రూ.82,240, ముమ్మిడివరంలో రూ51,000, మండపేటలో రూ.1,15,787, రామచంద్రపురంలో రూ.73,900 చొప్పున విరాళాలు అందించారని వివరించారు. కార్యక్రమంలో డీపీఎంయూ శ్రీనివాస్, అమలాపురం, మండపేట సిటీ మిషన్ల మేనేజర్లు రామలక్ష్మి, అనంతలక్ష్మి, రామచంద్రపురం, ముమ్మిడివరం టౌన్ మిషన్ల కో ఆర్డినేటర్లు మంగాదేవి, ఐఓ రాంజీ తదితరులు పాల్గొన్నారు.
===
14ఎఎంపీ253: