పర్చూరు (చినగంజాం): వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అజెండాగా నాయకులు నియోజక వర్గంలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించాలని పర్చూరు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి యడం బాలాజీ పిలుపునిచ్చారు. సోమవారం చీరాలలోని పార్టీ కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకులనుద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిందని, అందరూ వైఎస్సార్ సీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. వారితో ఓటు వేయించేందుకు అవసరమైన అవకాశాలను నాయకులు కల్పించాలని సూచించారు. పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు యడం బాలాజీ సమక్షంలో వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో తమ్మలూరి అనిల్, మల్లెల పోతురాజు తదితరులున్నారు. వారికి పార్టీ కండువాలు కప్పి అభ్యర్థి బాలాజీ సాదరంగా ఆహ్వానించారు. ఇంకొల్లు మండలం పావులూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రావూరు సాల్మన్, నిదానపు కిషోర్, యెడ్డలూరి రాజేష్లు.మాజీ ఎంపీటీసీ బట్టు శంకరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
పర్చూరు వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీ టీడీపీ నుంచి పార్టీలోకి భారీగా చేరికలు