● జిల్లాలో నడిచిన బస్సులు 342 ● ఫిబ్రవరి 18 నుంచి 24వరకు రాకపోకలు ● భక్తులను చేరవేయడం ద్వారా రూ.3కోట్ల పైనే రాబడి ● మహా శివరాత్రిపై ప్రత్యేక దృష్టి
మంచిర్యాలఅర్బన్: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఆర్టీసీకి కలిసొచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదిలాబాద్ రీజియన్లో అన్ని డిపోలకు చెందిన అధికార యంత్రాంగం అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. మేడారానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి బస్సులు నడిపించారు. మంచిర్యాల జిల్లా నుంచి మేడారం జాతరకు అత్యధికంగా భక్తులు వెళ్లడాన్ని గ్రహించిన ఆర్టీసీ యాజమాన్యం ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. రీజినల్ మేనేజర్ సోలోమాన్ ఆయా డిపోల మేనేజర్లతో సమన్వయం చేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఊరటనిచ్చాయి. ఫిబ్రవరి 18 నుంచి 24వరకు జాతరకు మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, మందమర్రి, శ్రీరాంపూర్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఆయా డిపోల డీఎంలు పర్యవేక్షిస్తూ బస్సులు నడిపించారు. ఆదిలాబాద్ రీజియన్ నుంచి మొత్తం 342 బస్సులు నడిపి 72,108 మంది ప్రయాణికులను చేరవేశారు. తద్వారా రూ3,41,51,898 రాబడి వచ్చింది.
ప్రత్యేక బస్సులతో..
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. 342 బస్సులను 6,13,739 కిలోమీటర్ల మేర తిప్పారు. 59శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) సాధించారు. 72,108 మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చారు. ఇందులో టికెట్ ధర చెల్లించిన ప్రయాణికులంటే మహలక్ష్మి ప్రయాణికులే ఎక్కువగా ఉన్నారు. టికెట్ ధర చెల్లించి ప్రయాణం చేసిన వారు 33,084 మంది కాగా 39,024 మంది మహలక్ష్మి ప్రయాణికులున్నారు. మంచిర్యాల డిపో నుంచి నడిపిన బస్సుల ద్వారా రూ.1,05,31,88 ఆదాయం సమకూరింది. ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సుల(చెన్నూర్ పాయింట్) ద్వారా 13,946 మంది ప్రయాణికులను, భైంసా డిపో బస్సుల(శ్రీరాంపూర్ పాయింట్) ద్వారా 16,692 మంది భక్తులను, నిర్మల్ డిపో బస్సుల(మందమర్రి పాయింట్) ద్వారా 9,471 మందిని, ఆసిఫాబాద్ డిపో బస్సుల(బెల్లంపల్లి, ఆసిపాబాద్ పాయింట్ల) ద్వారా 7,321 మంది భక్తులు, మంచిర్యాల డిపో బస్సుల ద్వారా(మంచిర్యాల బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి) 24,678 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.
ఇక్కట్లు లేకుండా బస్సులు నడిపాం
మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, అధికారులంతా సమన్వయంతో పనిచేశారు. జాతర వెళ్లే భక్తులకు ఎక్కడా ఇక్కట్లు ఎదురు కాకుండా చూశాం. మంచిర్యాల–మేడారం–మంచిర్యాలకు దాదాపు 72 వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేశాం. మహాశివరాత్రి నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి వేలాల, బుగ్గ, నిర్మల్ నుంచి వేములవాడకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు సన్నద్ధం అవుతున్నాం. రద్దీని బట్టీ ఆయా పుణ్యక్షేత్రాలకు బస్సులను నడిపించేందుకు చర్యలు చేపట్టాం. – సోలోమాన్రాజ్, రీజినల్
మేనేజర్ ఆదిలాబాద్
డిపో బస్సులు కిలోమీటర్లు ఆదాయం(రూ.లలో) ‘మహలక్ష్మి’ పెయిడ్
ప్రయాణికులు ప్రయాణికులు
ఆదిలాబాద్ 65 1,24,405 67,99,504 7391 6555
భైంసా 40 72,509 41,72,312 9014 7678
నిర్మల్ 58 86818 51,80,271 5020 4451
ఆసిఫాబాద్ 72 1,36,321 74,67,923 4027 3294
మంచిర్యాల 107 191686 1,05,31,888 13573 11105