-
మూడోసారీ మా ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మూడు వేర్వేరు సంస్థల ద్వారా లోతుగా సర్వే చేశామని.. బీఆర్ఎస్కు 72 నుంచి 82 సీట్లు వస్తాయని స్పష్టంగా తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రాష్ట్రంలో మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మాపై వ్యతిరేకత ఉన్నట్టు సోషల్ మీడియాలో హడావుడి జరగడం, అక్కడక్కడా మౌఖిక ప్రచారమే (మౌత్ టాక్) తప్ప క్షేత్రస్థాయిలో ఓటరుకు ఎలాంటి గందరగోళం లేదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మొదట్లో మేం కూడా కొంత గందరగోళపడినా క్షేత్రస్థాయి నుంచి మాకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కామారెడ్డిలో మూడో స్థానంలో, కొడంగల్లో రెండో స్థానంలో నిలిచే పరిస్థితి ఉన్నపుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కడుంది? కాంగ్రెస్ దిగ్గజాలైన కోమటిరెడ్డి సోదరులు, జానారెడ్డి కుమారుడు, జగ్గారెడ్డి వంటివారు కూడా ఓడిపోతున్నారు. బీజేపీ రెండు, మూడు సీట్లకే పరిమితం అవుతుంది. మేం ఖమ్మంలో ఆరు స్థానాల్లో, నల్లగొండలో 7 నుంచి 9 సీట్లలో కచ్చితంగా గెలుస్తాం. మిగతా నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉన్నా మా పార్టీ పరిస్థితి నిక్షేపంగా ఉంది. వాపు చూసి బలుపు అనుకుంటున్నారు రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయి ఆరంభంలో కొంత కాంగ్రెస్ వైపు మళ్లడంతో ఆ వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. అది పాలపొంగు వంటి హడావుడి మాత్రమే. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ కేడర్ కసిగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్, గోషామహల్, కరీంనగర్, కోరుట్లలోనూ గెలుస్తున్నాం. మాకు 15 నుంచి 18 చోట్ల బీజేపీ నుంచి, మిగతా చోట్ల కాంగ్రెస్ నుంచి పోటీ ఉండగా.. మేం మాత్రం అన్నిచోట్లా పోటీలో ఉన్నాం. ముదిరాజ్లకు టికెట్ల సర్దుబాటులో అవకాశం ఇవ్వలేకపోయాం. కాసాని జ్ఞానేశ్వర్, ఎర్ర శేఖర్ తదితరుల చేరికతో ఈ విషయాన్ని ఆ సామాజికవర్గం అర్థం చేసుకుంది. బీజేపీతో ఎన్నడూ అంటకాగలేదు కేసీఆర్ 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ బీజేపీతో అంటకాగలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించింది. ప్రస్తుత ఎన్నికల్లో ముస్లిం పట్ల బద్ధ వ్యతిరేకత కలిగిన బండి సంజయ్, అర్వింద్, రాజాసింగ్లపై కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీజేపీ ఏజెంట్గా పనిచేస్తూ మోదీని ఒక్కసారి కూడా విమర్శించలేదు. విపక్ష నేతల ఇళ్లపై జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులను మాకు అంటగట్టడం సరికాదు. రైతుబంధు దుబారా, ధరణి రద్దు అంటూ కాంగ్రెస్.. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద దొంగ రిపోర్టులతో బదనాం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణను అప్పుల పాలు చేశామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపణలు చేయడం విడ్డూరం. మోదీ ప్రతీ కుటుంబంపై రూ.5లక్షల అప్పు మోపారు. ఆయన ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన ప్రధాని. కేసీఆర్ అంటే భయంతోనే.. తెలంగాణకు ఉన్న ఏకైక గొంతు కేసీఆర్. ఆయన జాతీయ పార్టీలకు కొరుకుడు పడని కొయ్య. మూడోసారి అధికారంలోకి వస్తే ఏకు మేకు అవుతాడనేది కాంగ్రెస్, బీజేపీల భయం. కర్నాటక, గుజరాత్ల నుంచి రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలకు వస్తున్న డబ్బుకు అడ్డూ అదుపు లేదు. ఆ రెండు జాతీయ పార్టీలకు 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కానీ మాకు మాత్రం తెలంగాణే కేంద్రం. వాళ్లు తెలంగాణను గెలవాలనుకుంటున్నారు. మేం తెలంగాణను గెలిపించాలని అనుకుంటున్నాం. తెలంగాణ ఏకైక గొంతు కేసీఆర్ను కాపాడుకోవాలా వద్దా అని ప్రజలు తేల్చుకోవాల్సిన సందర్భం ఇది. కొత్త పింఛన్లు, రేషన్కార్డులు ఇస్తాం జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు, కొత్త ఆసరా పింఛన్లు ఇవ్వడం ప్రారంభిస్తాం. బీడీ కార్మీకులకు 2023 వరకు కటాఫ్ పెంచి కొత్తగా లక్షన్నర మందికి పింఛన్లు ఇస్తాం. భర్తను కోల్పోయిన భార్యల పేరిట పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటాం. గల్ఫ్ కార్మీకులకు ఉచిత బీమా కల్పిస్తాం. ఆటో డ్రైవర్లకు రూ.వంద కోట్ల మేర వాహన ఫిట్నెస్ చార్జీలు రద్దు చేస్తాం. జాబ్ క్యాలెండర్, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, ఉద్యోగ నియామకాలు సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై ఇప్పటికే యువతకు స్పష్టత ఇవ్వడంతోపాటు దీనిని మరింత బలంగా ప్రచారం చేస్తాం. ఈసీ అనుమతివ్వగానే రైతుబంధు సొమ్ము రూ.19,445 కోట్ల పంట రుణాల మాఫీకిగాను ఇప్పటికే రూ.14వేల కోట్ల పైచిలుకు క్లియర్ చేశాం. మిగతా రూ.5వేల కోట్ల మాఫీ ప్రక్రియ ప్రతిపక్షాల ఫిర్యాదు వల్ల ఆగింది. రుణమాఫీ చెల్లింపులకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరాం. అనుమతి వస్తే వెంటనే రుణమాఫీ చేస్తాం. రైతుబంధు 12వ దఫా సొమ్ము విడుదల కోసం కూడా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరాం. పీఎం కిసాన్ డబ్బులు వేసే వెసులుబాటు కల్పించి రైతుబంధు విషయంలో ఇబ్బంది పెట్టడం సరికాదు. మా మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గడప గడపకు వెళ్తాం..’’అని కేటీఆర్ తెలిపారు. -
అసైన్డ్ భూములకు హక్కులిస్తాం
సిరిసిల్ల: బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే దళితులు, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ఇస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తే.. వాటిని అమ్ముకోవచ్చని, పిల్లలకు ఇచ్చుకోవచ్చని, బ్యాంకుల్లో కుదువపెట్టుకోవచ్చని చెప్పారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో ఆయన రోడ్షోలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. ‘‘దరిద్రానికి నేస్తం కాంగ్రెస్ హస్తం. వారిని నమ్ముకుంటే నష్టపోయేది తెలంగాణ సమాజమే. గ్యారంటీ లేని కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇస్తుంది. రేవంత్రెడ్డి ఎప్పుడు జైలుకు పోతాడో ఆయనకే తెలియదు. 24 గంటలు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా.. మూడు గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ కావాలా తేల్చుకోవాలి. ఎన్నికలప్పుడు ఆగం కావొద్దు. ఆలోచించి ఓటేయాలి’’అని కేటీఆర్ కోరారు. ఆరున్నరేళ్ల పాలనలో ఎంతో చేశాం.. రాష్ట్రాన్ని కేసీఆర్ దేశానికే ఆదర్శవంతంగా చేశారని కేటీఆర్ చెప్పారు. తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రెండేళ్లు కరోనాతో, మరో ఏడాది సమయం లోక్సభ, ఇతర ఎన్నికల కోడ్తో వృధా అయిందన్నారు. పక్కాగా పాలన సాగినది ఆరున్నరేళ్లేనని, ఇంత తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే.. రేషన్కార్డులు ఇస్తామని, పెన్షన్లు పెంపు, 93 లక్షల కుటుంబాలకు బీమా, రేషన్కార్డులపై సన్నబియ్యం వంటివి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని, వంటగ్యాస్ సిలిండర్ను రూ.400కే అందిస్తామని ప్రకటించారు. సిరిసిల్ల ప్రాంతంలో 370 ఎకరాల్లో ఆక్వా హబ్ వస్తుందని, దీంతో ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. బాధ్యతలు పెరిగాయి ‘‘ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరిని కలవాలని నాకు ఉంటుంది. కానీ బాధ్యతలు పెరిగాయి. మంత్రిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రమంతటా తిరగాల్సి వస్తుంది. మీరే చూస్తున్నారు. నేను రోజూ ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని సభల్లో పాల్గొంటున్నానో. మిమ్మల్ని కలవలేక పోతున్నందుకు బాధగా ఉంది..’’అని తంగళ్లపల్లి రోడ్షోలో కేటీఆర్ పేర్కొన్నారు. మీ ఆశీర్వాదంతో గెలిచాక ఎలాంటి తలవంపులు తేలేదని, సిరిసిల్ల ఎమ్మెల్యేగా గర్వపడేలా పనిచేశానని చెప్పారు. ఈ రోడ్షోలలో వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనర్సింహరావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
రేవంత్ కాదు.. రేటెంతరెడ్డి
సాక్షి, కామారెడ్డి: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి అని, ఆయన ఎన్నికల తర్వాత పది పన్నెండు మంది ఎమ్మెల్యేలతో కలసి బీజేపీలో చేరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఓటుకు కోట్లు కేసులో అరెస్టైన రేవంత్రెడ్డి.. ఇప్పుడు సీటుకు రేటు కడుతున్నాడు. అందుకే వాళ్ల పార్టీ నేతలే ఆయనను రేటెంతరెడ్డి అంటున్నారు..’’ అని విమర్శించారు. శనివారం కేటీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఇక్కడి డిగ్రీ కాలేజీ మైదానంలో జరిగిన కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్య కర్తల సమావేశంలో మాట్లాడారు. దక్షిణ భారత దేశం నుంచి వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రి ఎవరూ కాలేదని.. సీఎం కేసీఆర్ మాత్రం ఈసారితో కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. దేశమంతటా తెలంగాణ గురించే చర్చ నడుస్తోందని, ఇక్కడ బీఆర్ఎస్ విజయం కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఆ రాష్ట్రంలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, జెడ్పీ మెంబర్లు బీఆర్ఎస్తో కలసి రావడానికి సిద్ధంగా ఉన్నారని.. తెలంగాణలో గెలి చాక మహారాష్ట్రలోనూ గులాబీ జెండా ఎగుర వేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహా రాష్ట్రలో సాధించే విజయంతో కేంద్రంలో కీలక భూమిక పోషిస్తామని పేర్కొన్నారు. దేశ రాజకీయాలకు దిక్సూచిగా.. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమే నని కేటీఆర్ చెప్పారు. ‘‘మొదట సిద్దిపేటలో పోటీ చేసిన ఆయన టీఆర్ఎస్ను స్థాపించారు. కరీంనగర్లో పోటీచేసి ఢిల్లీకి తెలంగాణవాదాన్ని తీసుకువెళ్లారు. మహబూబ్నగర్లో పోటీ చేసి దేశాన్ని ఒప్పించి రాష్ట్రం సాధించారు. గజ్వేల్లో పోటీచేసి ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్దారు. పదేళ్ల స్వల్పకాలంలోనే వందేళ్ల ప్రగతి సాధించారు. కామారెడ్డిలో భారీ మెజారిటీతో విజయం ద్వారా హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సాధించి, దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తారు..’’ అని పేర్కొన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగానే కాంగ్రెస్, బీజేపీల నాయకులు వణికిపోయి పోటీచేయడంకన్నా ఇంట్లో పడుకోవడమే మంచిదనే భావనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ను దేశంలోనే అఖండ మెజారిటీతో గెలిపించడం ద్వారా సరికొత్త చరిత్ర లిఖించాలని పిలుపునిచ్చారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ వాళ్లకు అడ్డగోలుగా డబ్బులు వస్తాయని, అదానీ నుంచి బీజేపీ వాళ్లకు డబ్బులు వస్తున్నాయని.. బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. నామినేటెడ్ పదవులు ఇస్తాం. రకరకాల సమీకరణాల దృష్ట్యా టికెట్ల కేటాయింపులో ముదిరాజ్లు, మరికొన్ని కులాలకు అవకాశం దక్కలేదని.. అయితే వారికి ఎమ్మెల్సీలుగా, చైర్మన్లుగా అవకాశం ఇస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ పోటీచేసే కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రత్యేక మేనిఫెస్టోలు రూపొందించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి నియోజకవర్గానికి తనతోపాటు మంత్రి ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్లు ఇన్చార్జులుగా ఉంటారని తెలిపారు. ఏ ఊరికి ఏం కావాలో నివేదికలు రూపొందించి అప్పగించాలన్నారు. సభలో మంత్రి ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి నీళ్లతో మూసీని నింపుతాం
నాగోలు/అంబర్పేట్/మన్సూరాబాద్ (హైదరాబాద్): మహా నగరంలో ఉన్న చారిత్రక మూసీ నదిని స్వచ్ఛమైన గోదావరి నీళ్లతో నింపుతామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నార్సింగి వద్ద గోదావరి జలాలను మూసీలో కలిపి మురుగు నీరు లేకుండా చర్యలు చేపడతామని, దీనికోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్టీపీ ప్లాంట్లను నిర్మిస్తామని తెలిపారు. హైదరాబాద్కు గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మూసీని గత ప్రభుత్వాలు పట్టించుకోక మురికి కూపంగా మారిపోయిందన్నారు. సోమవారం రూ.52 కోట్ల అంచనా వ్యయంతో మూసారంబాగ్ వద్ద మూసీ నదిపై నిర్మించ తలపెట్టిన హైలెవెల్ బ్రిడ్జికి కేటీఆర్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. మూసీపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలను నిర్మిస్తున్నామని, వీటికి అద్భుతమైన డిజైన్లను రూపొందించేందుకు మన ఇంజనీర్లతో విదేశాల్లో అధ్యయనం చేయించామని తెలిపారు. సినిమాల్లో చూపిన మాదిరిగా బ్రిడ్జి డిజైన్లు ఉంటాయని, శంకుస్థాపన చేసిన వంతెనలు 18 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో దేశంలోనే హైదారాబాద్ మొదటి స్థానంలో ఉందని వివరించారు. ఇప్పుడు రోజుకు 2వేల మిలియన్ లీటర్ల సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణం చేస్తున్నామని, ఇవి పూర్తయితే మూసీలోకి పూర్తిస్థాయి శుద్ధి చేసిన నీటిని వదిలే పరిస్ధితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుదీర్రెడ్డి, కాలేరు వెంకటేశ్, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బొగ్గారపు దయానంద్ గుప్త, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. సీఎం కలను నెరవేరుస్తాం మంచిరేవుల నుంచి ఘట్కేసర్ దాకా మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని కేటీఆర్ చెప్పారు. 160 కి.మీ. ఓఆర్ఆర్ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లేలా బ్రిడ్జిలు, రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. రూ. 5వేల కోట్లతో రెండో విడత ఎస్ఎన్డీపీ పనులు త్వరలోనే చేపడతామని తెలిపారు. వారం పది రోజుల్లో 40 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లను పారదర్శకంగా పంపిణీ చేస్తామని వెల్లడించారు. జీవో 118లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ తెలిపారు. ఎల్బీ నగర్లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్కు అద్భుతంగా ఉందని కేటీఆర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్రెడ్డికి కితాబునిచ్చారు. కేటీఆర్ పార్కు మొత్తం కలియతిరిగి అక్కడ ఏర్పాటుచేసిన ఆకృతులను ఆసక్తిగా తిలకించి.. జీహెచ్ఎంసీ కార్మికులతో ఫొటోలు దిగారు. హైదరాబాద్ మతసమరస్యానికి ప్రతీక అని, పార్లమెంటులో లేని మతసమరస్యాం మన హైదరాబాద్లో ఉందని కేటీఆర్ అన్నారు. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ ర్యాలీ వాయిదా వేసుకోవడం ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారనే దానికి నిదర్శనమని తెలిపారు. -
ఇప్పటిదాకా చూసింది ట్రైలరే..
సాక్షి, హైదరాబాద్/ ముషీరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు తాము చూపినది ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే ప్రతిపక్షాలకు అసలు సినిమా చూపిస్తామని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు వ్యాఖ్యానించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్లో కులమతాల పేరిట చిచ్చు పెట్టాలనుకునే దుర్మార్గులు, చిల్లర పార్టీల ఆటకట్టించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఇందిరాపార్కు–వీఎస్టీ జంక్షన్ మధ్య దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ‘‘55 ఏళ్లు అధికారం ఇచ్చినా ఏమీ చేయని దుర్మార్గులు.. ఇప్పుడు పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏమీ చేయని అసమర్థులు.. మళ్లీ వస్తున్నారు. మతం పేరిటో, కులం పేరిటో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధిలో ముందుకు పోతున్న మనకు కాళ్లల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏడాదిలో వారం పదిరోజులపాటు కర్ఫ్యూ ఉండేది. ప్రజల మధ్య ఏదో ఓ పంచాయతీ పెట్టి కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొనేవి. ఇప్పుడు మతాలు, కులాలకు అతీతంగా అంతా కలసిమెలసి ముందుకు పోతున్నాం, చిల్లర పార్టీలు, నాయకుల మాటలకు మోసపోతే హైదరాబాద్ మళ్లీ వందేళ్లు వెనక్కుపోతుంది..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోసారి బీఆర్ఎస్ను గెలిపించి, కేసీఆర్ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రిని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం ఒకప్పుడు అందరం ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతంలో సినిమాలు చూసిన వాళ్లమేనని.. సినిమా చూసి బయటికి వచ్చాక ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందిపడిన వారమేనని కేటీఆర్ చెప్పారు. ఈ స్టీల్ ఫ్లైఓవర్తో చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ చిక్కులకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఫ్లైఓవర్కు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టినట్టు తెలిపారు. కార్మికుల తరఫున పోరాడిన నాయిని పేరు దీనితో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఇందిరాపార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని.. లోయర్ ట్యాంక్బండ్, అప్పర్ ట్యాంక్బండ్ను కలుపుతూ టూరిస్ట్ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, స్థానిక ఎమ్మెల్యే ముఠాగోపాల్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరిన కల్వకుర్తి నేత ఉప్పల వెంకటేశ్ కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఉప్పల వెంకటేశ్, మరికొందరు ఇతర పార్టీల నాయకులు శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని.. ఢిల్లీ గులాములకు, తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంలో ప్రజలు ఆగం కావొద్దని పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తమదని చెప్పారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించాలన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement