మెదక్ జోన్: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పట్టపగలు తప్పతాగి సర్కార్ దవాఖానాలో వీరంగం సృష్టించారు. సిక్ లీవ్ రాసివ్వాలంటూ వైద్యులపై చిందులేశారు. అడ్డు చెప్పిన సిబ్బందిని దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. ఈ ఘటన శనివారం మెదక్ ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
మెదక్ ఏఆర్లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు దేవేందర్, దుర్గారెడ్డి తప్పతాగి సర్కార్ దవాఖానాకు వచ్చారు. ఇక్కడ డాక్టర్ ఎవడ్రా అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. డ్యూటీ డాక్టర్ వెంకటస్వామి యాదవ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
తమకు సిక్ లీవ్ రాసివ్వాలంటూ ఆయనపై దౌర్జన్యానికి దిగారు. కానిస్టేబుళ్ల వీరంగం చూసి రోగులు భయాందోళన చెందారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది వారిని స్టాఫ్ రూంలో బంధించారు. అనంతరం డ్యూటీ డాక్టర్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వగా రక్షక్ వాహనంలో వారిని స్టేషన్కు తరలించారు. ఈ విషయంపై పట్టణ సీఐ భాస్కర్ను వివరణ కోరగా కానిస్టేబుళ్లు తప్పతాగి ఆస్పత్రికి వెళ్లిన మాట వాస్తవమేగాని, వారిపై ఫిర్యాదు అందలేదన్నారు.