సాక్షి, పెద్దపల్లి: అదుపు తప్పి ఎగిరి వచ్చిన కారు మరో కారుపై బోల్తా కొట్టి, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురి ప్రాణాలను బలితీసుకున్న సంఘటన సోమవారం జిల్లా కేంద్రం పెద్దపల్లికి 4 కి.మీ దూరంలో జరిగింది. కడప నుంచి బయల్దేరిన ఓ కారు బసంత్నగర్ వైపు వెళ్తూ అందుగులపల్లి వద్ద డివైడర్ను ఢీకొని పల్టీలు కొడుతూ వెళ్లి అవతలి వైపు కరీంనగర్కు వెళ్తున్న మరో కారుపై పడి ఐదుగురు మృతి చెందగా రెండు కుటుంబాల్లో విషాదం నింపింది.
కాగజ్నగర్లో ఆదివారం జరిగిన మొహర్రం వేడుకల్లో పాల్గొని తిరిగి కరీంనగర్కు తన సొంత కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలంలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కన్నుమూశారు. మృతుల్లో భార్యాభర్తలు అజీమ్(40), అర్షియా(35)లతోపాటు కూతుళ్లు మహావిష్(4), అర్ఫా(2), అజీమ్ మరదలు ఆఫ్రిన్ (28) ఉన్నారు. రెండు వాహనాలలో ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికీ ప్రాణనష్టాన్ని నివారించలేక పోయాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ సుదర్శన్రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాద సమయంలో 120–140 కి.మీ./గంట వేగంతో.. : డ్రైవర్ సుదర్శన్రెడ్డి కడపకు కారులో వెళ్లి తన మిత్రులను దింపి, ఆదివారం రాత్రి బయల్దేరాడు. రాత్రంతా డ్రైవ్ చేస్తూ బసంత్నగర్కు చేరుకునేందుకు వేగంగా వస్తున్నాడు. కారు యజమానికి ఫోన్ చేసిన సుదర్శన్రెడ్డి మరో ఐదు నిమిషాల్లో చేరుకుంటానని చెప్పాడు. ప్రమాదం జరిగిన విధానాన్ని బట్టి చూస్తే డ్రైవర్ 120 నుంచి 140 కి.మీ./గంట వేగంతో కారు నడుపుతున్నట్లు భావిస్తున్నారు.