బెంగళూరు: గత కొద్ది రోజులుగా క్రికెట్ ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు లబుషేన్. ఆస్ట్రేలియాకు చెందిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్మన్ గతేడాది టెస్టుల్లో సంచలన రికార్డులు నమోదు చేశాడు. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్తో పోటీగా పరుగులు రాబట్టాడు. అంతేకాకుండా స్మిత్ విఫలమైన చోట కూడా రాణించి ఔరా అనిపించాడు. తాజాగా టీమిండియాపై వన్డేలో అరంగేట్రం చేసిన ఈ బ్యాట్స్మన్ తొలి మ్యాచ్లోనే 46 పరుగులతో ఔరా అనిపించాడు. ఇక రెండో వన్డేలో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన లబుషేన్, స్మిత్తో కలిసి నిర్ణయాత్మకమైన ఇన్నింగ్స్ ఆడాడు.
వీరిద్దరూ మూడో వికెట్కు 127 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈక్రమంలో స్మిత్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్లోనూ లబుషేన్ కూడా వన్డేల్లో తొలి అర్థసెంచరీ సాధించడం విశేషం. ఇన్నింగ్స్ 31 ఓవర్లో షమీ బౌలింగ్లో ఫోర్ కొట్టి అర్థసెంచరీ పూర్తిచేశాడు. అయితే ఆ తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లి స్టన్నింగ్స్ క్యాచ్కు లబుషేన్(54) వెనుదిరిగాడు. అనంతరం అనూహ్యంగా క్రీజులోకి వచ్చిన మిచెల్ స్టార్క్ కూడా జడేజా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి క్యాచ్ ఔటయ్యాడు.