ముంబై: ఐపీఎల్-8లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్కు 190 పరుగుల విజయలక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించింది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. రాజస్థాన్ ఓపెనర్ అజింక్య రహానే (91 నాటౌట్: 54 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. రహానే 35 బంతుల్లో, కరుణ్ నాయర్ 32 బంతుల్లో అర్ధ శతకాలు చేశారు. వన్డౌన్ బ్యాట్స్మన్ కరుణ్ నాయర్తో కలిసి రెండో వికెట్కు రహానే 11.3 ఓవర్లలో పది రన్రేట్ తో ఏకంగా 113 పరుగులు జోడించాడు.
ఢిల్లీ బౌలర్ గురిందర్ సందూ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో కరుణ్ నాయర్ బ్యాట్ ఝళిపించాడు. రెండు ఫోర్లు, ఒక్క సిక్సర్ కొట్టి ఆ ఓవర్లో నాయర్ ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో165 పరుగుల వద్ద కరుణ్ నాయర్ (61 : 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ) ఔటయ్యాడు. జేమ్స్ ఫాల్కనర్ (8), ఓపెనర్ అజింక్య రహానేతో కలిసి అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్నిచ్చారు. 6.5 ఓవర్లలో 53 పరుగులు జోడించిన అనంతరం షేన్ వాట్సన్ (21) ఏంజెలో మాథ్యూస్ బౌలింగ్ లో కేదార్ జాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్, నాథన్ కోల్టర్ నైల్ చెరో వికెట్ తీశారు.