విజయనగరం జిల్లా :మూడు సార్లు వరుసగా విజయం సాధిస్తే హ్యాట్రిక్ వీరులు, మరి అదే వరుసగా ఓడిపోతే.. వారు హ్యాట్రిక్ పరాజితులే కదా! వరుస పరాజయాలను ఎదుర్కొంటూ పట్టు వదలని విక్రమార్కుల్లా ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వీరిలో విజయనగరం జిల్లా భోగాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి కె. అప్పలస్వామి అయితే వరుసగా నాలుగు సార్లు ఓటమి పాలయ్యారు. ఇక మూడు సార్లు ఓడిన అభ్యర్థుల్ని పరిశీలిస్తే.. పాయకరావుపేట నుంచి చెంగల వెంకటరావు, తిరువూరు నుంచి ఎన్. స్వామిదాస్, కందుకూరు నుంచి దివి శివరామ్, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కమలాపురం నుంచి పి.నరసింహారెడ్డి, జమ్మలమడుగు నుంచి పి.రామసుబ్బారెడ్డి, ఆముదాలవలస నుంచి తమ్మినేని సీతారాం, హిందూపూర్ నుంచి నవీన్ నిశ్చల్లు వరుసగా మూడుసార్లు ఓడిపోయారు. వీరంతా 2004, 2009, 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. కొందరు గెలుపు కోసం పార్టీలు మారినా ప్రయోజనంలేకపోయింది.
2004లో..166 ఓట్ల అత్యల్ప మెజార్టీ
2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట నుంచి పోటీచేసిన ఎన్.దినకర్ రావు(కాంగ్రెస్) 166 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో అదే అత్యల్ప మెజారిటీ. ఇక చార్మినార్ నుంచి ఎంఐఎం తరఫున పోటీచేసిన సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ 1,07,921 ఓట్ల అత్యధిక మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో మొత్తం 1,896 అభ్యర్థులు పోటీపడగా... 1,270 మంది డిపాజిట్ కోల్పోయారు.