గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలన్న బీజేపీ అధ్యక్షుడు
సాక్షి, బెంగళూరు: వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలల్లో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. కార్యకర్తలు సిపాయిల్లా పోరాడి బీజేపీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావాలని నిర్దేశించారు. రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని షా స్పష్టం చేశారు.
మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకు యడ్యూరప్ప, కేంద్రమంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, పార్టీ ఇన్చార్జ్ మురళీధర్రావు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేక అక్రమాలకు పాల్పడుతోందనీ, ఈ విషయాన్ని ప్రతి గడపకూ వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఏడాది ప్రధాని మోదీ చేపట్టే విజయ రథయాత్ర కర్ణాటక ప్రాంతాల గుండా సాగనుందని అమిత్షా చెప్పారు.