Sakshi News home page

అమ్మే.. చంపేసింది

Published Mon, Dec 21 2015 5:36 PM

అమ్మే.. చంపేసింది - Sakshi

ఇద్దరు చిన్నారుల గొంతునులిమి ఊపిరి తీసిన తల్లి
  తల్లిదండ్రుల గొడవలకు బలైన పసిబిడ్డలు
  మంగళ్‌హాట్‌లో దారుణం

 
 అబిడ్స్ : అమ్మానాన్నల గొడవలకు అభం, శుభం తెలియని చిన్నారులు బలయ్యారు.. కన్నతల్లి చేతిలోనే కన్నుమూశారు. చిన్నపిల్లలనే కనికరం కూడా లేకుండా ఆ తల్లి కర్కశంగా గొంతునులిమి దారుణంగా చంపేసింది. విషయం తెలిసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శివలాల్‌నగర్‌లో ఆదివారం సాయంత్రం జరిగింది. మంగళ్‌హాట్ ఇన్‌స్పెక్టర్ ఆర్. శ్రీని వాస్ తెలిపిన మేరకు.. రోజాపాండే(21), సుమిత్‌పాండే(26)లు ఏడేళ్ల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు.  వీరికి సుమిదిపాండే(5), చింకీపాండే(2)లు కుమార్తెలు. సుమిత్‌పాండే ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ గుడుం బా ట్రాన్స్‌పోర్టర్‌గా కొనసాగుతున్నాడు. తరచూ డబ్బు విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవలకు దిగేవారు.
 
  నెలరోజులుగా సుమిత్‌పాండే ఆటో నడపడం మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో డబ్బు కోసం ఇద్దరి మధ్యా తరచూ ఘర్షణలు జరిగాయి. తినడానికి కూడా డబ్బు లేకపోవడంతో ఆమె రోజూ భర్తను నిలదీస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో కోపోద్రిక్తురాలైన రోజాపాండే తన ఇద్దరు పిల్లలు సుమిదిపాండే, చింకీపాండేలను గొంతునులిమి తీవ్రంగా గాయపరిచింది. సుమిదిపాండేను గొంతునులమగా చింకీపాండే గొం తుకు వైర్‌తో బిగించింది.
 
  ఇద్దరు పిల్లలు ఒక్కసారిగా ఏడుపు ఆపడంతో  భర్తకు ఫోన్‌చేసింది. ఇంటికి వచ్చిన భర్త సుమిత్‌పాండే మంగళ్‌హాట్ పోలీసులకు సమాచారం అందించడంతో పాటు పిల్లలను నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీంతో పోలీసులు తల్లి రోజాపాండేను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రోజాపాండే ఎనిమిది నెలల గర్భవతి అని తెలిసింది.
 

Advertisement
Advertisement