సాక్షి, హైదరాబాద్: ఏడు జిల్లాల రైతు సమన్వయ సమితులు ఖరారయ్యాయి. అందులో ఆరు సమితుల జాబితాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్కు చేరాయి. జిల్లా రైతు సమన్వయ సమితులను త్వరగా ఏర్పాటు చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో వాటి ప్రక్రియ ఊపందుకుంది. ఇప్పటివరకు సిరిసిల్ల, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఖమ్మం, వికారాబాద్, వనపర్తి జిల్లాల సమితుల ఏర్పాటు పూర్తయింది.
కాగా, ఇందులో వనపర్తి జిల్లా సమితి జాబితాను సంబంధిత మంత్రి పరిశీలించి కలెక్టర్కు పంపించారు. ఆ జిల్లా కలెక్టర్ జాబితాను ఆమోదించాల్సి ఉంది. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయానికి ఆ జాబితాను పంపిస్తారు. రెండు, మూడు రోజుల్లో మిగిలిన జిల్లాల జాబితా పూర్తవుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తిస్థాయిలో అందిన జాబితాలకు ఆమోద ఉత్తర్వులు జారీచేస్తామని అధికారులు చెబుతున్నారు.
త్వరలో సీఎం సమావేశం...
జిల్లా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ముగిసిన తర్వాత వాటిపై త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసే అవకాశముందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి.