ప్రజల ఆక్రోశమే జగన్ నోట మాట: భూమన | Sakshi
Sakshi News home page

ప్రజల ఆక్రోశమే జగన్ నోట మాట: భూమన

Published Sun, Jun 5 2016 3:11 AM

ప్రజల ఆక్రోశమే జగన్ నోట మాట: భూమన - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 600 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు సీఎం చంద్రబాబునాయుడుపై ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం, ఆక్రోశమే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటల్లో ప్రతిబింబించాయని, ప్రజల తరఫున ఆయన అలా నిలదీశారని, అందులో తప్పేంటని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు దుర్మార్గ పాలనపై ప్రజల తరఫున తిరుగుబాటు చేసే సత్తా ఈ రాష్ట్రంలో ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికే ఉందన్నారు.

టీడీపీ నేతలు జగన్‌ను ఉగ్రవాది, హంతకుడు, నేరస్థుడు, సైకో, పిచ్చికుక్క... ఇలా ఎన్నో విధాలుగా తిట్టారని ఆయన గుర్తు చేశారు. తనను ఉద్దేశించి ఎన్ని బూతులు తిట్టినా జగన్ ఏనాడూ తిరిగి విమర్శించలేదని, అయితే ప్రజలకిచ్చిన వందలాది హామీలను నెరవేర్చక పోవడంతో పాటు రాష్ట్రాన్ని అవినీతి సామ్రాజ్యంగా మార్చి వేసి దోపిడీ సాగిస్తున్నందునే చంద్రబాబును చెప్పులతో కొట్టండి అని జగన్ అన్నారన్నారు. జగన్ ప్రతిభావంతుడైన పోరాటపటిమ గల ప్రజా నాయకుడని, ఉద్యమాలే ధ్యేయంగా ఉన్న వాడని, అలాంటపుడు చంద్రబాబు ప్రజలకు ఇంత మోసం చేస్తూ ఉంటే ప్రశ్నించకుండా ఉండజాలడని ఆయన అన్నారు.

Advertisement
Advertisement