రక్షణ కవచంలా నిలుస్తా : బండి సంజయ్ | Sakshi
Sakshi News home page

రక్షణ కవచంలా నిలుస్తా : బండి సంజయ్

Published Wed, Apr 23 2014 2:10 AM

Bandi Sanjay will be support to people

 కరీంనగర్/కరీంనగర్‌అర్బన్, న్యూస్‌లైన్ : కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపు స్టేడియం హోరెత్తిపోయింది. తన మాటల తూటాలతో ఆయన సభికులను ఉత్తేజపరిచారు. కరీంనగర్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులపై సంధించిన ఉపన్యాసం సభికులను విశేషంగా ఆకట్టుకుంది.
 
 పదిరోజులు పనిచేసి బీజేపీని గెలిపిస్తే ఐదేళ్లు కరీంనగర్‌కు రక్షణ కవచంలా నిలుస్తానని అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ హామీ ఇచ్చారు. మతం పేరుతో మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సంఘ విద్రోహశక్తుల గుండెల్లో సభికులు చేసే నినాదాలు బుల్లెట్‌లా దిగాలన్నారు. చీకటిపొత్తులకు దిగుతున్న పార్టీల బాగోతాన్ని ప్రజలు ఎండగట్టాలన్నారు. ఎంపీ ఓటు ఓ పార్టీకి, ఎమ్మెల్యే ఓటు మరో పార్టీకి వేయాలన్న ఎంఐఎం విధానాన్ని గమనించాలన్నారు. తనను గెలిపిస్తే నగరంతోపాటు మండలానికి నిత్యం నీటి సరఫరా చేయిస్తానన్నారు. రోడ్లను విధ్వంసం చేసిన యూజీడీ కాంట్రాక్టర్ ఆస్తులు జప్తు చేసైనా రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు.
 
 దక్కని అవకాశం
 సమయానుభావం వల్ల కొంతమంది అభ్యర్థు లు మాట్లాడకుండానే పరిచయ కార్యక్రమంతో సరిపెట్టుకున్నారు. రామగుండం, చొప్పదండి, హుజూరాబాద్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల అభ్యర్థులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, మేడపల్లి సత్యం, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, మల్లారెడ్డి, శ్రీరాంవేణుకు ప్రసంగించలేకపోయారు.

Advertisement
Advertisement