కట్నం కోసం కాటికి పంపాడు! | Sakshi
Sakshi News home page

కట్నం కోసం కాటికి పంపాడు!

Published Fri, Sep 30 2016 11:31 PM

doury case filed

అమరచింత (నర్వ) : అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యనే కాటికి పంపించాడు ఓ భర్త. ఏకంగా ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి చంపేశాడు. ఈ సంఘటనలో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూర్‌ మండలం మోట్లంపల్లికి చెందిన జ్యోతి (25), తల్లిదండ్రులతో కలిసి 2007లో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని కొత్వాల్‌గూడకు వలస వెళ్లారు. అప్పటి నుంచి అక్కడే ఉన్న క్రషర్‌ మిషన్‌లో పనులు చేస్తుండేవారు.
 
అందులోనే కొంకన్‌వానిపల్లికి చెందిన బోయ శేఖర్‌ క్రషర్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రై వర్‌గా పనులు చేస్తుండేవాడు. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారి అదే ఏడాది జూన్‌ 16న వివాహం చేసుకున్నారు. ఆ వెంటనే కొంకన్‌వానిపల్లికి దంపతులు తిరిగిరాగా అల్లుడికి అమ్మాయి తల్లిదండ్రులు రూ.40వేలు కట్నం చెల్లించారు. మూడు నెలల నుంచి అదనపు కట్నం తీసుకురావాలని వత్తిడి చేయడంతో మరో రూ.40వేలతో సెకండ్‌ హ్యాండ్‌ ఆటోను ఇప్పించారు. అయినప్పటికీ తరచూ వేధింపులకు గురిచేయసాగాడు. చివరకు శుక్రవారం ఉదయం ఇంట్లోనే భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి చంపేశాడు. విషయం తెలుసుకున్న మతురాలి తల్లిదండ్రులు, బంధువులు స్థలానికి చేరుకుని భర్త కుటుంబ సభ్యులపై దాడికి యత్నించారు.
 
చుట్టుపక్కలవారు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన సీఐ ప్రభాకర్‌ రెడ్డి, ఎస్‌ఐ సీహెచ్‌ రాజు వెళ్లి మృతురాలి బంధువర్గాన్ని శాంతింపజేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కాగా, మృతురాలికి కూతురు, కుమారుడు ఉన్నారు. 
 
 
 

Advertisement
Advertisement