సోంపేట : ఇంట్లో జరిగిన శుభకార్యంలో అంతా తానై వ్యవహరించిన యువకుడు.. అంతలోనే విగతజీవిగా మారడాన్ని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వలస కూలీగా వేరే రాష్ట్రంలో పనిచేస్తూ.. నెల రోజుల క్రితం గ్రామానికి వచ్చి తమతో కలసిమెలసి తిరిగిన స్నేహితుడు ఇక లేడని తెలియడంతో మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మండలంలోని బెంకిలికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషాదకర సంఘటన గురువారం జరిగింది.
గ్రామానికి చెందిన సంగారు వీరాస్వామి కుమారుడు సంగారు మోహనరావు (24) ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారు వీర స్వామి, కృష్ణవేణికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. సంగారు కృష్ణవేణి 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో వీరస్వామి మరో వివాహం చేసుకున్నాడు.
పిన తల్లి వద్ద చిన్ననాటి నుంచి పెరిగిన మోహనరావు(వినోద్) నాలుగైదు ఏళ్ల నుంచి నాన్నమ్మ కుటుంబం వద్ద నివసిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి వలస కూలీగా పనిచేస్తుండేవాడు. వేసవిలో నెలరోజులు గ్రామానికి వచ్చి కొన్ని రోజులు ఉండి మళ్లీ వెళ్లి పోతుండేవాడు. కొద్ది రోజుల క్రితం గ్రామానికి చేరుకున్న మోహనరావు.. రెండు రోజుల క్రితం వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. గ్రామంలో బుధవారం బంధువుల ఇంట్లో వేడుక ఉండటంతో అందులో అంతా తానై వ్యవహరించాడు.
తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ గురువారం ఉదయం బారువ రైల్వేస్టేషన్ పరిధిలో విగతజీవిగా మారాడు. పోలీసులు కుటుంబసభ్యులకు గురువారం సాయంత్రం సమాచారమిచ్చారు.
మోహనరావు మృతి చెందాడనే వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మోహనరావు తండ్రి వీరా స్వామి వలస కూలీగా వేరే రాష్ట్రంలో పనులు చేస్తున్నారు.
మోహనరావు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అందరితో కలసిమెలసి ఉండేవాడని, ఎవరితో గొడవలు లేవని, ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదని వీరు వాపోతున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.