శ్రీకాకుళం, నరసన్నపేట: జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. నరసన్నపేట మండల పరి ధిలోని జమ్ము కూడలి సమీపంలో ఆది వారం మధ్యాహ్నం ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు చనిపోగా, ఏడుగురు గాయపడ్డారు. శ్రీకాకుళం నుంచి టెక్కలి వైపునకు వెళ్తున్న ఆటోను లారీ ఢీకొనడంతో పాలకొండకు చెందిన వ్యాపారి గెంబలి శ్రీరాములు(45) అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా.. అందులో ప్రయాణిస్తున్న జ్యోతి(ఉర్లాం), వారణాశి బాల (పాలకొండ), కోరాడ పూర్ణ (ఎఫ్సీఐ గొడౌన్), ఇప్పిలి హేమ (ఉంగరాడ మెట్ట), జి.ఉష (పాలకొండ), నారాయణశెట్టి కమల(నీలానగరం, వీరఘట్టం మండలం)లకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ఎస్. వేణుగోపాలరావుకు కూడా బలమైన దెబ్బలు తగిలాయి. క్షతగాత్రులకు నరసన్నపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అం దించి కొందరిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. క్ష తగాత్రుల్లో హేమ, కమల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ట్లు వైద్యులు తెలిపారు. హేమను విశాఖ తర లించారు.
పరామర్శకు వెళ్తూ..
ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారంతా బంధువులే. తమ బంధువు కంబకాయ గ్రామంలో మరణించడంతో ప రామర్శకు వెళ్దామని వీరంతా ఫోన్లలో సమాచారం అందించుకుని ఆటో కట్టించుకుని ఆదివారం బయల్దేరారు. అయి తే డ్రైవర్కు ఆ గ్రామం రూట్ సరిగ్గా తెలియకపోవడంతో జాతీయ రహదారిపై కిలోమీటరు ముందుకు వెళ్లిపోయారు. ప్రయాణికులు దీన్ని గమనించి ఆటోను వెనక్కు తిప్పమని కోరారు. దీంతో డ్రైవర్ వెనక వస్తున్న వాహనాలను గమనించకుండా ఎడమ నుంచి డివైడర్ వైపునకు ఆటోను ఒక్కసారిగా తిప్పారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొని పది మీటర్ల వరకు తోసుకుంటూ వెళ్లిపోయింది.
ఆటోలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులు,మృతుడు శ్రీరాములు
ఆటో ఓ వైపు భాగం నుజ్జునుజ్జు కాగా ఆ వైపు కూర్చున్న శ్రీరాములు కింద పడి మరణించారు. ఆటో వెనుక భాగంలో కూర్చున్న హేమ, కమల, ఉషలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి కాళ్లు శిథిలమైన ఆటో రాడ్ల మధ్యను ఇరుక్కున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు, హైవే పెట్రోలింగ్ పోలీసులు ఆటోలో ఇరుక్కున్న వారిని బయటకు తీసి 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
చికిత్సలో జాప్యం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను స్థానిక యాభై పడకల ప్రభుత్వాస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడ వీరికి ప్రథమ చికిత్స అందించడంలో జాప్యం జరిగింది. వైద్యుడు ఒక్కరే ఉండడంతో అందరికీ ప్రాథమిక చికిత్స అందించలేకపోయారు. దీంతో క్షతగాత్రుల బంధువులు వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించాక కొందరిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. క్షతగాత్రుల్లో హేమ, కమల పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా హేమను శ్రీకాకుళం నుంచి విశాఖకు రిఫర్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కొంతసేపు స్తంభించిపోయాయి. ప్రమాద సమాచారం అందుకున్న నరసన్నపేట ఎస్ఐ ఎన్.లక్ష్మణ వ చ్చి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేశారు. ప్రమాదం అనంతరం భయంతో లారీ దిగి పరుగులు తీస్తున్న లారీ డ్రైవర్ను స్థానికులు పోలీసులకు అప్పగించారు.
నాన్న తిరిగి వస్తానన్నారు
పాలకొండ రూరల్: అప్పటి వరకు తమతో సరదాగా గడిపిన నాన్న చనిపోయారని తెలిసి పిల్లలు తల్లడిల్లిపోతున్నారు. ‘నాన్న తిరిగి వస్తానన్నారు..’ అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. పాలకొండకు చెందిన శ్రీరాములు నరసన్నపేట రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి వస్తారని ఎదురుచూసిన పిల్లలు శృతి, ఆదిత్యతోపాటు భార్య గీత గుండెలు బాదుకుని రో దించారు. నిరుపేద వైశ్య కుటుంబానికి చెందిన శ్రీరాములు సోడాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కు టుంబం రోడ్డున పడింది. శ్రీరాములుతోపాటు ఆటోలో ఉన్న క్షతగాత్రుల బంధువులు ఏ క్షణం ఏ విషాద వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి స్పందించారు. నిరుపేద కుటుంబానికి తీరనిలోటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.