ఇబ్రహీంపట్నంరూరల్: జీవాల కాపరి దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి మేకల మంద వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దారి కాసిన దుండగులు మారణాయుధాలతో నరికి చంపారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం సీఐ గురువారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం... ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామానికి చెందిన కోరివి యాదయ్య గ్రామంలో మేకలను కాస్తూ జీవనం సాగిస్తంటాడు. గ్రామంలోని ఎర్రగుంట చెర్వు వద్ద పాక ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు రాత్రి మంద వద్దే కాపాలాగా నిద్రిస్తుంటాడు. ఆదివారం కోరివి బుగ్గయ్య కుమారుడి వివాహానికి యాదయ్య కుటుంబ సభ్యులందరూ వెళ్లి వచ్చారు. రాత్రి 9:30 గంటల సమయంలో యాదయ్య టీవీఎస్ ఎక్సెల్పై ఇంటి నుంచి మేకల మంద వద్దకు బయల్దేరాడు.
తులేకలాన్ ప్రధాన రహదారి దాటి ఎర్రగుంట చెర్వు వద్దకు వెళ్లేదారిలో మాటుకాసిన దుండగలు మారణాయుధాలతో యాదయ్యపై దాడి చేశారు. ద్విచక్ర వాహనం వదిలి దుండగల నుంచి తప్పించుకునే క్రమంలో యాదయ్య పడిపోవడంతో దుండగులు అతికిరాతకంగా కత్తులతో దాడి చేశారు. యాదయ్య ఫోన్ అదే గ్రామానికి చెందిన పాల వ్యాపారి అచ్చన శ్రీశైలంకు తెల్లవారుజామున దొరికింది. తెల్లవారినా యాదయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. ఫోన్ రిసీవ్ చేసిన శ్రీశైలం యాదయ్య జాడ తెలియదని చెప్పడంతో కుటుంబీకులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోన్ దొరికిన ప్రదేశం నుంచి పది మీటర్ల దూరంలో రక్తపుమడుగులో యాదయ్య మృతదేహం కనిపించింది. మృతుడి ఒంటిపై, రెండు చేతులు, తలపై కత్తిపోట్లు గుర్తించారు. మృతుడు యాదయ్యకు భార్య ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
ఘటనా స్థలం పరిశీలన..
హత్య జరిగిన విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరిరెడ్డి, సీఐ గురవారెడ్డిలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్స్క్వాడ్ను రప్పించి వివరాలు సేకరించారు. తులేకలాన్ గ్రామానికి చెందిన ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.