పెళ్లి పీటలపై రక్తపాతం | Sakshi
Sakshi News home page

వధువుపై మాజీ ప్రియుడు కత్తితో దాడి..

Published Tue, Apr 3 2018 2:45 AM

Man Murder Attempt on His Lover in Tamilnadu - Sakshi

సాక్షి, తమిళనాడు(శివమొగ్గ) : పెళ్లి వాయిద్యాలు మోగుతున్న వేళ ప్రేమోన్మాది విరుచుకుపడి పెళ్లికూతురిని హత్యచేయబోయిన ఘటన తమిళనాడులోని శివమొగ్గలో సోమవారం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందనే పగతో నవ వధువుపై ఓ మాజీ ప్రేమికుడు కత్తితో దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలపాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కర్ణాటకలో శివమొగ్గ జిల్లా సాగర తాలూకాలోని భీమనకోణె గ్రామానికి చెందిన గీత (23) శివమొగ్గలోని ఓ హోటల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తుంది. నిందితుడు నందన్‌ (25) ఆర్‌టీఓ కార్యాలయంలో మధ్యవర్తి, ప్రైవేటు ఫొటో గ్రాఫర్‌ గానూ పనిచేస్తున్నాడు. 

ఈ క్రమంలో ఇరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొద్ది రోజుల క్రితం ఇరువురి మధ్య విభేదాలు రావడంతో ఈ ప్రేమకు యువతి స్వస్తి చెప్పింది. ఆమె తల్లిదండ్రులు మరో యువకునితో గీతకు పెళ్లి కుదర్చగా, సోమవారం శివమొగ్గలోని ఒక కళ్యాణమండపంలో వారి పెళ్లి జరగాల్సి ఉంది. ఇది తట్టుకోలేకోపోయిన నందన్‌ కళ్యాణ మండపంలోకి చొరబడి కత్తితో వధువుపై విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో ఆమె మెడపై తీవ్ర గాయమైంది. గీత బంధువు గంగాధరప్ప దాడిని అడ్డుకోబోగా నందన్‌ అతని మీద దాడి చేయగా.. ఆయనకూ తీవ్ర గాయాలయ్యాయి. బాధి తులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు నందన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివాహం ఆగిపోవడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement
Advertisement