కూతురి పెళ్లి విషయం చెప్పలేదన్న కోపంతో.. | Sakshi
Sakshi News home page

కూతురి పెళ్లి విషయం చెప్పలేదన్న కోపంతో..

Published Sat, Apr 27 2019 10:15 AM

Man Attacks Wife And Daughter Over Daughter Wedding - Sakshi

ముంబై : కూతురికి పెళ్లి నిశ్చయమైందన్న విషయం చెప్పలేదన్న కోపంతో భార్య, కూతురిపై కత్తితో దాడి చేశాడు ఓ రిక్షావాలా. ఈ సంఘటన ముంబైలోని బజార్‌పేట్‌లో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని కళ్యాణ్‌కు చెందిన మోహన్‌ మహాజన్‌(52) తన భార్య మనీషాతో గొడవల కారణంగా విడిగా ఉంటున్నాడు. మనీషా కూతురు, కొడుకుతో కలిసి థాకర్‌ పాడలో నివాసముంటోంది. కొద్దినెలల క్రితమే మనీషా కూతురు గౌరీకి వివాహం నిశ్చయమైంది. మరో వారంలో కూతురు పెళ్లి జరగబోతోందన్న సంగతి పరాయి వ్యక్తుల ద్వారా మోహన్‌కు తెలిసింది. దీంతో ఆగ్రహించిన మోహన్‌.. మనీషా ఇంటికి వెళ్లి, కన్న కూతురి పెళ్లి విషయం తనకు ఎందుకు చెప్పలేదంటూ నిలదీశాడు.

దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన మోహన్‌ కత్తితో పలుమార్లు మనీషాను దారుణంగా పొడిచాడు. అడ్డువచ్చిన కూతురి గొంతును సైతం కత్తితో కోసి, అక్కడినుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులకు సమాచారమివ్వటంతో పాటు తీవ్రంగా గాయపడ్డ తల్లీకూతుర్లను వెంటనే దగ్గరలోని హాస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే మనీషా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించగా, గౌరీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. సంబంధిత సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Advertisement