సాక్షి, రామచంద్రాపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసమస్యల పోరాటం చేస్తూ వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర ఆదివారం 208వ రోజుకు చేరుకుంది. నేడు (జులై 8) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానుల కోలాహలం మధ్య పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్తో భారీ కేక్ కట్ చేయించారు. అనంతరం వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజల సమక్షంలో ఆదివారం ఉదయం మండపేట నియోజకవర్గం రాయవరం మండలం నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి పసలపూడి, చెల్లూరు మీదుగా మాచవరం వరకు పాదయాత్ర కొనసాగనుంది.