వైఎస్ఆర్ జిల్లా, కడప సెవెన్రోడ్స్: రానున్న ఐదు రోజుల్లో జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని కలెక్టర్ హరికిరణ్ పేర్కొన్నారు. 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఎండ తాపం ఎక్కువగా ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ నుంచి ఈ మేరకు సమాచారం అందిందన్నారు. తగిన రక్షణ చర్యలు లేకుండా ఎండల్లో తిరగరాదని చెప్పారు. వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు ద్రవ పదార్థాలు ఎక్కువగా సేవించాలన్నారు.
గొడుగు, నెత్తిన టోపీ, వస్త్రం వంటివి తలౖపై ఉంచుకుని బయటకు వెళ్లాలన్నారు. తెల్లని పలుచాటి కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు. గ్లూకోజ్, ఉప్పుకలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ను సేవించడం వల్ల వడదెబ్బను నివారించుకోగలమన్నారు.తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే స్థానిక వైద్యులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగిని తరలించాలన్నారు. జిల్లా ప్రజలను అప్రమత్తం చేయాలని ఇప్పటికే సంబందింత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ నెల 11వ తేదీ 43 నుంచి 45 డిగ్రీలు, 12న 42 నుంచి 44 డిగ్రీలు, 13 నుంచి 15వ తేదీ 41 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయని వివరించారు.