వైసీపీ రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా కవురు
ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని వైఎస్సార్ సీపీ నేతలకు పార్టీ పదవులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గానికి చెందిన కవురు శ్రీనివాస్ను రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా, భీమవరం నియోజకవర్గానికి చెందిన కొయ్యే మోషేన్రాజును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ మేరకు వారు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తమపై ఉన్న విశ్వాసంతో బాధ్యతలు అప్పగించారని, తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడిందని, పాదయాత్రను ప్రజలు అనూహ్య రీతిలో విజయవంతం చేశారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి తమవంతు కీలక పాత్ర పోషించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.
ఇదిలా ఉంటే ఉండి నియోజకవర్గానికి చెందిన కరిమెరక రామచంద్రరావును పార్టీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఏలూరు నియోజకవర్గానికి చెందిన వీరవల్లి లక్ష్మికుమార్ను రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.