సాక్షి కడప : జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు నమోదైన జిల్లా కేంద్రమైన కడపలో ఇప్పటికే కోర్, బఫర్ జోన్లుగా విభజించారు. ప్రజలను బయటకు రానీయకుండా గట్టి చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు ఇతర పట్టణాల్లో కూడా జనం బయటికి రాకుండా నిత్యావసరాలను డోర్ డెలివరీ చేయించాలని సంకల్పించింది.అన్ని మున్సిపాలిటీలతోపాటు పంచాయతీల్లో కూడా గుర్తింపు కలిగిన సూపర్ మార్కెట్ల ద్వారా డోర్ డెలివరీకి నడుం బిగించింది. ఆయా యాజమాన్యాలతో చర్చించింది. అవి కూడా సంసిద్ధత వ్యక్తం చేశాయి. పేరొందిన సూపర్మార్కెట్ల ఫోన్ నెంబర్లు, వాట్సాప్ నెంబర్లను అధికారులు ప్రకటించారు. సరుకులను ఎక్కువ ధరలకు అమ్మినా, తూకం తగ్గినా ఫిర్యాదులకు కూడా టోల్ఫ్రీ నెంబర్లు ఇచ్చారు. పులివెందుల, బద్వేలు, రాజంపేట, రాయచోటి, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఇలా అన్నిచోట్ల సూపర్మార్కెట్ల సమాచారాన్ని తెలియజేస్తున్నారు. మార్కెట్కు రాకుండా ఫోన్ ద్వారా ఆర్డర్ ఇస్తే సరుకులు ఇంటికే వస్తాయి.
కడపలో ఐదు మొబైల్...మరో ఐదు తాత్కాలిక రైతు బజార్లు
కడపలో పలు సూపర్ మార్కెట్లను ఎంపిక చేసి డోర్ డెలివరీకి అవకాశం కల్పించింది. ఐదు మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ఓం శాంతినగర్, ఆర్కే నగ ర్, ఇందిరానగర్, చెన్నూరు, ఊటుకూరు పరిధుల్లో కూ రగాయలకు సంబంధించిన మొబైల్ వాహనాలు తిరు గుతున్నాయి. ఫోన్ చేసిన క్షణమే నేరుగా ఇంటి వద్దకు వచ్చి అవసరమైన నిత్యావసరాలను అందిస్తున్నాయి. మరో ఐదు తాత్కాలిక రైతు బజార్లను కూడా ఏర్పాటు చేశారు. అంగడివీధిలోని పాఠశాల వద్ద, గురుకుల్ విద్యానికేతన్ వద్ద, ఐటీఐ సర్కిల్, జెడ్పీ ఆవరణం, గాంధీనగర్ మున్సిపల్ హైస్కూలు ఆవరణంలో తాత్కాలికంగా రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా నేరుగా కూరగాయలు, నిత్యావసర సరుకులు డోర్ డెలివరీ తెప్పించుకోవడం ఉత్తమమార్గం.
డోర్ డెలివరీ ద్వారా తెప్పించుకోండి
డోర్ డెలివరీ చేసుకోండి. కమిటీ నిర్ణయించిన కంటే అధికంగా సరుకులు, కూరగాయల ధరలపై వసూలు చేస్తే టోల్ ఫ్రీ నెంబరు 1902కు ఫిర్యాదు చేయవచ్చు. డోర్ డెలివరీ చేసినందుకు కొంతమేర అదనంగా వసూలు చేస్తారు. అంతేతప్ప అధిక ధరలు ఉండవు.– గౌతమి, జాయింట్ కలెక్టర్, కడప