విజయనగరం, ప్రజా సంకల్పయాత్ర బృందం: గీత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు అన్నివిధాలుగా తమను మోసం చేశాడని ఆంధ్రప్రదేశ్ యాత, గౌడ, శ్రీశయన, శెట్టి బలిజ, ఈడిగ, గీత కార్మిక సంఘ జిల్లా కమిటీ అధ్యక్షుడు పురం ఫణీంద్రకుమార్, కార్యదర్శి చుక్క గణేశ్, తదితరులు ఆరోపించారు. గజపతినగరం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, గీత కార్మిక సొసైటీకి ఐదు ఎకరాల భూమి, తాటి, ఈత వనాలను పెంచుకునేందుకు నిధులు ఇస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు నేటికీ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు.
2014 హుద్హుద్ తుఫాన్ వల్ల నష్టపోయిన గీత కార్మిక కుటుంబాలకు పది వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. గీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి 90 శాతం రాయితీతో ష్యూరిటీ లేని బ్యాంక్ రుణాలు మంజూరు చేస్తామని చెప్పినా ఇంతవరకు ఆ మాట ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తామన్న హామీ నెరవేరలేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పది వేల మందికి నేటికీ టీసీఎస్ సభ్యత్వం ఇవ్వలేదు.. సభ్యత్వం ఉన్నవారికి గుర్తింపు కార్డులు ఇవ్వలేదని చెప్పారు. ప్రతి మండలానికి ఒక నీరా ప్రాజెక్ట్ను ఏర్పాటు చేసి గీత కార్మికులకు పూర్తి హక్కులు కట్టబెట్టాలని.. బెల్ట్షాపులు రద్దు చేయాలని కోరుతూ జననేతకు విన్నవించారు. అలాగే స్థానిక గీత కార్మికులు కూడా జగన్మోహన్రెడ్డిని కలిసి వివిధ సమస్యలను వివరించారు.