Sakshi News home page

అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మోసగిస్తారు: పవన్

Published Mon, Feb 20 2017 6:45 PM

అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మోసగిస్తారు: పవన్ - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకెన్నాళ్లు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగిస్తాయని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు చాలా సరళమైన భాషలో, అర్థమయ్యేలా మాట్లాడతారని.. కానీ పదవుల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ మాట మీద నిలబడలేకపోయారని ప్రశ్నించారు. మంగళగిరిలో చేనేతల సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పలు అంశాలపై మాట్లాడారు. ఒకవేళ హోదా ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నామో.. దాని సాధ్యాసాధ్యాలు ఏంటో వివరించి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని అన్నారు. ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని, దానికి చట్టబద్ధత కల్పిస్తామని ఒకసారి చెప్పారని.. మళ్లీ అది అవసరం లేదని అంటున్నారని, ఇలా పదే పదే అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా తాను 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని, అయితే సమస్యల మీద ఎదురు నిలబడి పోరాడగల నాయకులు కావాలని అన్నారు. యువ నాయకులు, పోరాటపటిమ ఉన్నవాళ్లు, నిస్వార్థపరుల కోసం చూస్తున్నానని తెలిపారు. ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్లే నాయకులని, దాన్ని దోపిడీచేసే వాళ్ల మీద ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
Advertisement

What’s your opinion

Advertisement