12వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు బనగానపల్లిలో ముగిసింది. సౌదరదిన్నె నుంచి బనగానపల్లి వరకు ఆదివారం 15.3 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ ఉదయం 8.30 గంటలకు సౌదరదిన్నె నుంచి 12వ రోజు యాత్రను ఆయన మొదలుపెట్టారు. జననేత వెంట నడిచేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలుకరించి వైఎస్ జగన్ ముందుకు సాగారు. మార్గమధ్యలో 108, 104 ఉద్యోగులు ఆయనను కలిశారు. తమ సమస్యలు విన్నవించుకుని పరిష్కరించాలని కోరారు. పాదయాత్రలో భాగంగా వృద్ధులు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించి వైఎస్ జగన్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఆమదాల క్రాస్ రోడ్డు, గులాంనబీ పేట-బొందల దిన్నెక్రాస్ రోడ్డు, ఎల్లురి కొత్తపేట, బనగాలపల్లి మీదుగా ఈరోజు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. సాయంత్రం బనగానపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బనగానపల్లిలో ఆదివారం రాత్రి ఆయన బస చేయనున్నారు. 12 రోజుల పాటు చేసిన పాదయాత్రలో వైఎస్ జగన్ 169.3 కిలోమీటర్లు నడిచారు.