-
గండి బాబ్జీ Vs బండారు.. టీడీపీలో మరోసారి ఆధిపత్య పోరు బహిర్గతం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మూర్తి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. బండారుకి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతున్నారు. గతంలో బండారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను ఏ కార్యక్రమానికి పిలవలేదని.. పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తనకు తగిన గౌరవం ఇవ్వాలంటూ గండి బాబ్జీ వ్యాఖ్యానించారు.ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తనకు తెలియకుండా ఏ కార్యక్రమం పెట్టడానికి వీల్లేదన్నారు. గండి బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో నాకు తెలుసు.. గత్యంతరం లేక వేరే పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవలసిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. -
సాగర తీరంలో సాయి పల్లవి
సినిమా లొకేషన్లో నటి సాయి పల్లవి కొమ్మాది(విశాఖ): భీమిలి బీచ్రోడ్డు మంగమారిపేటలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. రామాద్రి బీచ్తీరంలో ఏర్పాటు చేసిన సెట్లో శనివారం తండేల్ అనే సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్పై చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీకాకుళంలోని మత్య్సకారుల వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇక్కడ వేసిన సెట్లో చిత్రీకరిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా షూటింగ్ చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకున్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇక్కడ ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. -
ఆరిల్లోవలో రంగురాళ్ల తవ్వకాలు
గొలుగొండ: ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో ఉన్న రంగురాళ్ల క్వారీలో మళ్లీ తవ్వకాలు జరిగాయి. ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న సిబ్బంది శుక్రవారం తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో ఏడాది క్రితం రంగురాళ్ల క్వారీ బయటపడింది. ఇక్కడ అక్రమ తవ్వకాలు జరపకుండా రాత్రి సమయంలో గస్తీ నిర్వహించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. పగటి పూట బీట్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుంటారు. శుక్రవారం ఉదయం సిబ్బంది విధులు ముగించుకొని వెళ్లాక తవ్వకాలు జరిగాయో.. లేక రాత్రి సిబ్బంది ఉన్న సమయంలోనే తవ్వకాలు జరిగాయో తెలియడం లేదు. విలువైన క్యాట్ ఐ రకానికి చెందిన రంగురాళ్లు ఇక్కడ లభ్యం కావడంతో కొంతమంది తవ్వకందార్లు ఈ రంగురాళ్ల కోసం చాలా రోజుల నుంచి నిఘా ఏర్పాటు చేసుకొని తవ్వకాలు చేశారని భావిస్తున్నారు. వీరికి సిబ్బంది సహకారం అందించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్విహిస్తే సమాచారం వచ్చే అవకాశం ఉంది. -
స్టూడెంట్ బస్పాస్ల జారీకి ఏర్పాట్లు
తుమ్మపాల: విద్యాసంస్థలు పునఃప్రారంభం కావడంతో స్టూడెంట్ బస్పాస్ల జారీకి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి కె.పద్మావతి తెలిపారు. అనకాపల్లి, నర్సీపట్నం బస్ స్టేషన్లలో ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు బస్పాస్లకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. onine.apsrtcpass.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి ఫొటో, దరఖాస్తు ఫారం తీసుకురావాలన్నారు. దరఖాస్తుపై విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ధ్రువీకరణ చేయించాలన్నారు. అప్లికేషన్తోపాటు ఆధార్, విద్యార్హత పత్రాలు సమర్పించాలని ఆమె తెలిపారు. -
ప్రత్యేక డ్రైవ్తో ‘నేను బడికి పోతా’
అనకాపల్లి (కశింకోట): బయట ఉన్న బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడానికి ప్రభుత్వం చేపట్టిన ‘నేను బడికి పోతా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యా శాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎన్రోల్మెంట్ డ్రైవ్ కమిటీ సమావేశం శనివారం సాయంత్రం డీఈవో ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీలో ఉండే ఎంఈవో, హెచ్ఎంలకు పలు సూచనలు, షెడ్యూల్, రోజు వారీ కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా, మండల, హేబిటేషన్ కమిటీల ఆధ్వర్యంలో వచ్చే నెల 12 వరకు బడి ఈడు పిల్లలను చేర్పించడానికి డ్రైవ్ నిర్విహించాలన్నారు. మండలాల్లో ఎంపీడీవోలను సమన్వయం చేసుకొని ప్రభుత్వ ఉత్తర్వుల్లో నిర్దేశించిన మేరకు పది మంది సభ్యులతో కూడిన కమిటీ, సీఆర్పీలు, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లతో తప్పనిసరిగా డ్రైవ్పై సమన్వయ సమావేశం నిర్వహించాలన్నారు. డ్రైవ్ నిర్వహించిన వివరాలతో ఫోటోలను వాట్సాప్ గ్రూప్లో పెట్టాలన్నారు. గూగుల్ స్ప్రెడ్ షీట్లో రోజు వారీ చేరిన పిల్లల వివరాలను నమోదు చేయాలన్నారు. ఎంఈవోలు, హెచ్ఎంలకు ప్రత్యేక కార్యాచరణ జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ -
అనారోగ్యం ‘కొని’ తెచ్చుకునేలా...!
జిల్లాలో ఇలా.. పెద్ద హోటళ్లు తదితరమైనవి : 1000 కర్రీ పాయింట్లు తదితరాలు : 200 ఇతరత్రా చిన్న చిన్న టిఫిన్, ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు : 450 ఏటా 20 శాతం కూడా తనిఖీలు జరగడం లేదు 2023–24లో ఫుడ్సేఫ్టీ అధికారులు సేకరించిన శాంపిళ్లు : 300 కల్తీ జరిగినట్టు నిర్ధారణ జరిగితే.. రూ.5 లక్షలు జరిమానా యలమంచిలి రూరల్ : జిల్లాలోని చిన్న హోటళ్ల నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ఎక్కడా నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కంపుకొట్టే వంట గదుల్లో వండే కల్తీ వంటకాలను ఇంపు గా వడ్డిస్తూ జనం ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. రోజుల పాటు నిల్వ చేసిన పదార్థాలు, గడువు మీరిన, కల్తీ నూనెలతో చేసిన వంటకాలతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కస్టమర్లను దోచుకుంటున్నా ఫుడ్సేఫ్టీ అధికారులు, కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడ డం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ఫిర్యాదు అందితే తూతూమంత్రంగా తనిఖీలు, శాంపిళ్ల సేకరణతో హడావుడి చేయడం తప్ప ఫుడ్సేఫ్టీ అధికారులు గట్టి చర్యలు తీసుకున్న దాఖలా లు లేవు. దీంతో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. కిచెన్ వైపు చూస్తే ముద్ద దిగదు... చాలా హోటళ్లు, రెస్టారెంట్లలో కిచెన్లను శుభ్రంగా ఉంచడం లేదు. వంట పాత్రలు శుభ్రం చేయడానికి ప్రత్యేక చాంబర్లు ఉండవు. ఒకవేళ ఉన్నా అరకొర నీటితో ౖపైపెనే శుభ్రం చేసి వాటిని తిరిగి వినియోగిస్తుంటారు. టేబుళ్లను క్లీన్ చేసే సమయంలో ఉదయం నుంచి రాత్రి వరకూ ప్లేట్లు, గ్లాసులను రెండు బకెట్ల నీళ్లలో ముంచేసి పని కానిచ్చేస్తున్నారు. వంట మాస్టర్లు, సర్వర్లు ఆఫ్రాన్లు, క్యాపులు, గ్లౌస్లు ధరించడం లేదు. పాచి వంటలకు మసాలా తాళింపు... ఇక వంటకాలకు సంబంధించి కుళ్లిన ఆహార పదార్థాలను వంటల్లో వినియోగిస్తున్నారు. మసాలా దినుసులు సైతం సరైన నిల్వ పద్ధతులు పాటించకపోవడంతో అందులో పురుగులు, బొద్దింకలు, బల్లులు, ఎలుకలు సంచరిస్తున్నాయి. అలాగే నిల్వ ఉంచిన చికెన్, మటన్ను పసుపులో ఉడికించి వంటకాల్లో వాడుతున్నారు. మిగిలితే మళ్లీ వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారు. వాటిని మరుసటి రోజు వినియోగిస్తున్నారు. వంటలు ఘుమఘుమ లాడేందుకు అందులో టేస్టింగ్ పౌడర్ వేస్తున్నారు. కాగిన నూనె మళ్లీ మళ్లీ... ఒకసారి వినియోగించిన నూనెను వంటకాల్లో పదే పదే వినియోగిస్తుండడంతో ప్రజలు క్యాన్సర్, ఇతర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. పదే పదే మరిగించిన నూనెతో తయారు చేసిన పదార్థాల వల్ల గుండెలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి ఇబ్బందులు వస్తాయి. రోడ్డు పక్కన తోపుడు బళ్లు, బేకరీలు, కర్రీ పాయింట్లు, రెస్టారెంట్లలో సైతం ఇదే జరుగుతోంది. ఈ కారణంగానే ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో సైతం గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. కల్తీ ఆహారంతో జబ్బులు కాలం చెల్లిన మసాలాల వినియోగం, కల్తీ ఆహారంతో జీర్ణ కోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నాణ్యత లేని ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు అందక శరీరం బలహీనమవుతుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో డయేరియా, విరేచనాలు, కడుపునొప్పి, ఎసిడిటీ వంటివి వస్తాయి. కలరింగ్ ఏజెంట్ల వల్ల పేగు, ప్యాంక్రియాటిక్ కేన్సర్ల ముప్పు ఉంది. – డాక్టర్ ఆర్.నిహారిక, సివిల్ అసిస్టెంట్ సర్జన్, యలమంచిలి సీహెచ్సీ ఫిర్యాదు చేస్తే చర్యలు ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం అన్ని ఆహార విక్రయ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు లైసెన్సు పొందాలి. నాణ్యత పాటించాలి. లేనిపక్షంలో తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం. ప్రజలెవరైనా ఆహార భద్రతకు సంబంధించిన ఫిర్యాదులను ఫుడ్సేఫ్టీ కనెక్ట్ యాప్ ద్వారా చేయడానికి వీలుంది. ఎక్కడైనా ప్రజలు హోటళ్లు, స్వీట్స్, బేకరీలు, ఇతర తినుబండారాల దుకాణా లపై ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటాం. భారీ జరిమానాలతో పాటు లైసెన్సులు రద్దు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. – కె.సతీష్కుమార్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, అనకాపల్లి రుచి...శుచి లేని హోటల్ ఫుడ్ జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు అపరిశుభ్ర పరిసరాల్లో వంటల తయారీ నిల్వ వంటకాలు, నాసిరకం సరుకులు నాణ్యతా ప్రమాణాలు పాటించని నిర్వాహకులు అనారోగ్యం కొని తెచ్చుకుంటున్న జనం అధికారుల తనిఖీలు తూతూ మంత్రం -
విశాఖ విమల విద్యాలయంపై కొనసాగుతున్న చర్చలు
ఉక్కునగరం: స్థానిక విశాఖ విమల విద్యాలయం కొనసాగింపుపై చర్చలు కొనసాగుతున్నాయి. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, నాయకుల మధ్య జరిగిన చర్చల్లో వారు తమ అభిప్రాయాలు తెలిపారు. పాఠశాల యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు శనివారం ఉదయం మూడు వర్గాల వారు హాజరయ్యారు. పాఠశాల యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ తాము ఆర్థిక భారం భరించలేమని, ఉక్కు యాజమాన్యం పాత పద్ధతిలో కొనసాగించడమో లేక ఉపాధ్యాయులు తమ జీతాలు తగ్గించుకోవడమో చేయాలని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు తమ సర్వీస్ రూల్స్పై కొంతమేర తగ్గారు. వేతనాలు, పీఆర్సీ, పాత బకాయిల చెల్లింపు తదితర అంశాలపై తమఅభిప్రాయాన్ని వెల్లడించారు. నాయ కులు మాట్లాడుతూ జీతాలు తగ్గించడం అన్యాయమన్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఉక్కు యాజమాన్యానికి వివరించి, వారికి నచ్చచెబుతామని హామీ ఇచ్చారు. -
పలు రైళ్ల రద్దు, మరికొన్ని రీ షెడ్యూల్
తాటిచెట్లపాలెం(విశాఖ): ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పూండి–పలాస మెయిన్ లైన్, కోటబొమ్మాళి –తిలారు మధ్య జరుగుతున్న పనుల నిమిత్తం ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ఈ నెల 17వ తేదీన పలాస–విశాఖపట్నం (07471) పాసింజర్, విశాఖ పట్నం–పలాస(07471) పాసింజర్, విశాఖపట్నం –గుణుపూర్(08522) పాసింజర్, గుణుపూర్–విశాఖపట్నం(08521) పాసింజర్, విశాఖపట్నం–బ్రహ్మపూర్(18526) ఎక్స్ప్రెస్ రద్దయ్యాయి. ఈ నెల 18వ తేదీన బ్రహ్మపూర్–విశాఖపట్నం(18525) ఎక్స్ప్రెస్ రద్దు చేశారు. రీ షెడ్యూల్ చేసిన రైళ్లు ● సికింద్రాబాద్లో సోమవారం తెల్లవారు 4.30 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్– షాలిమర్ (07225) స్పెషల్ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా ఉదయం 6.30గంటలకు బయల్దేరుతుంది. ● సికింద్రాబాద్లో ఆదివారం రాత్రి 11.40 గంటలకు బయల్దేరాల్సిన సికింద్రాబాద్– సంత్రగచ్చి (07234) స్పెషల్ ఎక్స్ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా సోమవారం తెల్లవారు 3.40 గంటలకు బయల్దేరుతుంది. -
ఉక్కు కేవీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ కేంద్రీయ విద్యాలయంలో ఈ నెల 18,19 తేదీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ నియామకాలకు వాక్ఇన్ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ప్రిన్సి పాల్ వంశీకృష్ణ తెలిపారు. 18న పీజీటీ విభాగంలో ఇంగ్లిష్, హిందీ, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, ఎకనామిక్స్ ఉపాధ్యాయులకు, టీజీటీ విభాగంలో ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం,గణితం,సైన్స్,సోషల్ సైన్స్ సబ్జెక్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19న పీఆర్టీ, పీజీటీలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, డాన్స్ కోచ్, స్పోర్ట్స్ కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్, యోగా ఇన్స్ట్రక్టర్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, నర్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. అర్హులైన అభ్యర్థులు అన్ని ధ్రువీకరణపత్రాలతో ఆయా తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి వరకు దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. పూర్తి వివరాలకు విద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
నేడు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష
మహారాణిపేట (విశాఖ): జిల్లాలో యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. మొత్తం 9,635 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఆయా కేంద్రాల్లో వసతులు కల్పించి, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 మంది రూట్ ఆఫీసర్లు, 26 మంది లైజన్ ఆఫీసర్లు, 26 సూపర్వైజర్లను నియమించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని డీఆర్వో మోహన్ కుమార్ ఆదేశించారు. -
హోం మంత్రికి స్వాగతం
నక్కపల్లి/పాయకరావుపేట: రాష్ట్ర హోంశాఖ మంత్రిగా నియమితులై తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చిన వంగలపూడి అనితకు శనివా రం పాయకరావుపేట నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. పాయకరావుపేటలో ఆమె పాండురంగస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. టీడీపీ, జనసేన నాయకులు అనితను గజమాలతో సత్కరించా రు. అనంతరం ర్యాలీగా ఆమె నక్కపల్లి చేరు కుని ఉపమాక వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. ఆమెకు స్వాగతం పలికిన వారి లో పాయకరావుపేట, నక్కపల్లి మండలాలకు చెందిన గెడ్డం బుజ్జి, తోట నగేష్, గూటూరు శ్రీను, పెద్దిరెడ్డి చిట్టిబాబు, పెద్దిరెడ్డి శ్రీను, నక్కపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
స్టేట్ క్వాలిటీ అండ్ కంట్రోల్ అధికారుల తనిఖీ
రోలుగుంట: మండలంలోని నాయుడుపాలెం పాఠశాలను శనివారం స్టేట్ క్వాలిటీ అండ్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేశారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని స్టేట్ అబ్జర్వర్ ఇస్మాయిల్ తెలిపారు. అనంతరం రోలుగుంట హైస్కూల్లో పాఠశాలలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న పాఠ్య పుస్తకాలు, స్టూడెంట్ కిట్లను తనిఖీ చేసిన ఇస్మాయిల్, సీఎంవో శకుంతల సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల ప్రారంభం రోజునే పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్న ఎంఈవోలు జాన్ ప్రసాద్, జగ్గారావును అభినందించారు. -
ఐదేళ్లలో 5 లక్షల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు
దేవరాపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశ వ్యాప్తంగా ఐదేళ్లలో ఐదు లక్షల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ మల్లేశం పూల చెప్పారు. దేవరాపల్లిలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్పామ్ తోటలను తన బృందంతో కలిసి శనివారం పరిశీలించారు. సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడులు సాధించేందుకు మెలకువలను ఆయన రైతులకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 80 శాతం, తెలంగాణలో 15 శాతం, మిగిలిన రాష్ట్రాల్లో 5 శాతం ఆయిల్పామ్ను సాగు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం పెద్దాపురం, కృష్ణాపురంలలో పామాయిల్ నూనె శుద్ధి కార్మాగారాలు ఉన్నాయన్నారు. తమ కొనుగోలు కేంద్రంలో గెలలు విక్రయించిన 14 రోజుల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర ఆధారంగా నగదు జమ చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం టన్ను ఆయిల్పాం ధర రూ.13,284 ఉందని తెలిపారు. రైతుల వినతి మేరకు అదనంగా ఆయిల్పామ్ గెలల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట సంస్థ జనరల్ మేనేజర్ టి.రమణ, అసోసియేషన్ జనరల్ మేనేజర్ పట్టాభి రామిరెడ్డి, మేనేజర్ చంద్రశేఖర్ తదితర సిబ్బంది ఉన్నారు. -
బంగారం, వెండి, నగదు చోరీ
కశింకోట: మండలంలోని కన్నూరుపాలెంలో సుమారు రూ.మూడు లక్షల విలువైన బంగారు, వెండి నగలు, నగదు చోరీకి గురయ్యాయి. సీఐ ఎం.వినోద్బాబు శని వారం అందించిన వివరాల ప్రకారం...కన్నూరుపాలెంలో నివాసముంటున్న బొడ్డు కాశీ విశ్వేశ్వరరావు తన కుమారుడిని లాంగ్ టెర్మ్ కోచింగ్లో చేర్పించడానికి ఈ నెల 12న భార్యతో కలిసి ఇంటి నుంచి విజయవాడ వెళ్లారు. వారు లేని సమయంలో దొంగలు ఇంటిలోకి ప్రవేశించి, రెండు బీరువాలు తెరచారు. వాటిలో ఉన్న రూ.90 వేల నగదు, రెండు తులాల బంగారు గొలుసు, 1200 గ్రాముల వెండి వస్తువులు తస్కరించారు. విశ్వేశ్వరరావు శుక్రవారం రాత్రి తిరిగి ఇంటికి చేరారు. ప్రవేశ ద్వారాల తాళాలు పగులగొట్టి, తెరచి ఉన్నాయి. ఇంట్లో తెరిచి ఉన్న రెండు ఇనుప బీరువాలను పరిశీలించగా రూ.90 వేల నగదు, రెండు తులాల బంగారు గొలుసు, మూడు జతల చెవి ఆభరణాలు చోరీ అయినట్టు గుర్తించారు. బాఽధితుడి ఫిర్యాదుపై మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. క్లూస్ బృందం, డాగ్ టీం ఆ ఇంటిని పరిశీలించాయి. సమీపంలోని సీసీ కెమెరాల పుటేజీలను తనిఖీ చేశారు. -
సంపత్ వినాయగర్ హుండీ ఆదాయం రూ.18.28 లక్షలు
సీతమ్మధార(విశాఖ): ఆశీలమెట్టలోని సంపత్ వినాయగర్ హుండీల ఆదాయం లెక్కింపు ప్రక్రియ శనివారం దేవదా య శాఖ సహాయ కమిషనర్, ఈవో కె.శిరీషా ఆధ్వర్యంలో జరిగింది. మొత్తం 28 రోజులకు గానూ రూ.18,28,509 వచ్చినట్లు ఈవో తెలిపారు. అలాగే 228 గ్రాముల వెండి, 27 యూఎస్ఏ డాలర్లు, 20 సింగపూర్ డాలర్లు, 20 థాయ్ బాట్లు, 6 మలేషియా రింగిట్లు వచ్చినట్లు వెల్లడించారు. దేవదాయ శాఖ తనిఖీదారులు జి.వి.రమాబాయి, ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ టి.చోళన్ పర్యవేక్షణలో శివజ్యోతి, వేంకటేశ్వర సేవా సంఘం సభ్యులు లెక్కించారు. ఆలయ సిబ్బంది జి.గోవిందరెడ్డి, డి.ఎస్.ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
18న మోదకొండమ్మ పండగ
మాడుగుల: మండల కేంద్రం మాడుగులలో ఈ నెల 18 న మోదకొండమ్మ పండగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఆలయంతో పాటు అమ్మవారి విగ్రహాన్ని రంగులతో తీర్చిదిద్దారు. ఆలయం నుంచి సతకం పట్టు వరకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. చిటికెల భజనలు, బళ్ల వేషాలు, ఖవాలీ నృత్యాలు, నేల వేషాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంబరాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ అప్పల రాజు తెలిపారు. పంచాయతీ ఈవో నాయుడు ఆధ్వర్యంలో వీధుల్లో పారిశుధ్య కార్య క్రమాలు చేపట్టారు. ఈ సారి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షమంది భక్తులు వస్తారని ఆలయ కమిటీ అంచనా వేసింది. ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. -
సారూ.. ఇదేం తీరు..!
● డీఎస్సీ–98 ఉపాధ్యాయులకు అశనిపాతం ● పాతకేళ్ల తరువాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ● గత ఉత్తర్వులకు భిన్నంగా పోస్టింగ్లు ● రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నవారూ అడవిబాట ● ఆందోళనలో ఉపాధ్యాయులు, కౌన్సెలింగ్ కోసం డిమాండ్ ‘నగరానికి చెందిన హరినారాయణకు డీఎస్సీ–98 ద్వారా టీచర్(ఎంటీఎస్) ఉద్యోగం లభించింది. గతేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనందున తప్పనిసరి పరిస్థితుల్లో విశాఖ నుంచి అల్లూరి జిల్లా ఏజెన్సీలో పోస్టింగ్ తీసుకున్నారు. జులై 31న ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. తాజాగా కొనసాగింపు ఉత్తర్వులు అందినా, నెలన్నర రోజుల కోసమని కుటుంబాన్ని వదిలి అటవీ ప్రాంతానికి వెళ్లక తప్పటం లేదు. ఈ ఏడాది కాలంలో ఇలా చాలా మంది రిటైర్ అవుతున్నారు. ఏజెన్సీకి పంపించటమే కాకుండా, రూ.110లు జ్యూడిషియల్ ఒప్పంద పత్రం సమర్పించాల్సిందనే ఉత్తర్వుల్లో పేర్కొనటంపై ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు.’ విశాఖ విద్య: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులతో ప్రెండ్లీగా ఉంటుందని చెబుతున్నా ఆచరణలో మాత్రం మరోలా నిర్ణయాలు వెలువడుతున్నాయి. డీఎస్సీ–98 ఉపాధ్యాయుల విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేస్తున్న వారు సైతం విశాఖ నగరం నుంచి ఏజెన్సీ ప్రాంతానిని వెళ్లక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వచ్చిన ఉద్యోగాలు కాబట్టి, ఎక్కడ కొలువులు ఊడిపోతాయోననే ఆందోళనతో తమ సమస్యను చెప్పుకోలేక డీఎస్సీ–98 ఉపాధ్యాయులు లోలోన మదనపడుతున్నారు. పాతికేళ్లకు దక్కిన ఉద్యోగాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పాతికేళ్ల సమస్యకు మోక్షం కలగటంతో గతేడాది జూన్ నెలలో డీఎస్సీ–98 వారికి పోస్టింగ్లు ఇచ్చారు. మినిమమ్ టైం స్కేల్(ఎంటీఎస్) కింద నెలకు రూ.32,670లు వేతనం పొందుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అర్హత సాధించిన 288 మందికి నాడు ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చారు. అయితే విశాఖ జిల్లాలో ఖాళీలు లేవనే కారణంతో 200 మంది వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా(ఏజెన్సీ ప్రాంతం)కు కేటాయించారు. సొంత ప్రాంతాల్లో పోస్టింగ్ ఇమ్మన్నా.. మినిమమ్ టైం స్కేల్ కింద పనిచేస్తున్నందున శ్రీస్థానిక నివాసాలకు సమీపంలో పోస్టింగ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని 15–06–2023న పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సైతం ఉత్తర్వులు జారీ చేసినా, విశాఖ జిల్లాలో ఖాళీలు లేవని విద్యాశాఖాధికారులు తెలుపటంతో, తప్పనిసరి పరిస్థితుల్లో డీఎస్సీ–98 ఉపాధ్యాయులు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. ఈ ఏడాది తమకు న్యాయం చేస్తారని అంతా భావించారు. కౌన్సెలింగ్ కోసం ఆరాటపడినా.. డీఎస్సీ–98 కాంట్రాక్టు టీచర్స్కు 2024–25 విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీ–2008 వారితో కలిపి అందరినీ 11 నెలల కాలానికి విధుల్లోకి తీసుకుంటూ, గత ఏడాది పనిచేసిన స్థానాల్లోనూ పోస్టింగ్లు కేటాయిస్తూ ఉమ్మడి జిల్లా స్థాయిలో సర్వీసు పరమైన వ్యవహారాలు చూసే విశాఖ డీఈవో ఎల్.చంద్రకళ ఈ నెల 13న ఆదేశాలు ఇచ్చారు. 2024–25 విద్యా సంవత్సరానికి 1998, 2008 డీఎస్సీల వారికి కలిపి కౌన్సెలింగ్ ప్రాతిపదికన పోస్టింగ్ ఇస్తారని అంతా భావించినా, ఏ ఒక్కరూ తమ గోడు పట్టించుకోకపోవటం సరైంది కాదని ఉపాధ్యాయులు అంటున్నారు. ప్రస్తుతం డీఎస్సీ కోసం ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నందున గత ఏడాది ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా సొంత గ్రామాలకు దగ్గరలో ఉన్న ఖాళీల్లో పోస్టింగ్లు ఇవ్వాలని వారు కోరుతున్నారు. -
‘స్కిల్’ఇన్స్టిట్యూట్తో ఏపీ చాంబర్స్ ఎంవోయూ
ఎంవీపీకాలనీ(విశాఖ): నగరంలోని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్తో ఏపీ చాంబర్స్ విశాఖపట్నం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరుసంస్థల ప్రతినిధులు ఎంవీపీకాలనీలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఎంవోయూలో భాగంగా విద్యార్థులు, ట్రైనీల్లో నైపుణ్యం, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఏపీ చాంబర్స్ సేవలందిస్తుంది. ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ తన సభ్య పరిశ్రమల ద్వారా ప్లేస్మెంట్ డ్రైవ్లు, పలు కోర్సుల్లో యువతకు శిక్షణ ఇవ్వనుంది. ఎస్డీఐ సీఈవో ఇంతియాజ్ అర్షద్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ విశాఖ జోన్ చైర్మన్ శ్రీనాథ్ చిట్టూరి తదితరులు పాల్గొన్నారు. -
సహనాన్ని పరీక్షిస్తే చూస్తూ ఊరుకోం
కోటవురట్ల: అధికారంలోకి వచ్చామని విర్రవీగుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడితే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు హెచ్చరించారు. గెలుపోటములు సహజమని, ప్రజల తీర్పును గౌరవిస్తూ ప్రజల తరఫున సమస్యలపై పోరాడతామని చెప్పారు. తంగేడులోని మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు నివాసంలో వైఎస్సార్ సీపీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలతో శనివారం సమావేశం నిర్వహించి ఓటమిపై సమీక్షించారు. కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా పలువురు పార్టీ నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జోగులు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని రీతిలో వచ్చాయని, ప్రజలకు ఇంత సంక్షేమాన్ని అందించినా లోపం ఎక్కడ జరిగిందో అర్థం కాలేదన్నారు. జగన్మోహన్రెడ్డి అలవికాని హామీలతో ప్రజలను మోసం చేయలేక నిజాయితీగా ఓటు అడిగారన్నారు. దాదాపు 99 శాతం హామీలు నెరవేర్చి దేశంలోనే ఉత్తమ పాలన అందించారని తెలిపారు. అయితే టీడీపీ నాయకులు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు పేరు చెప్పి వారి ఆలోచనలను విషపూరితం చేశారన్నారు. ఏది ఏమైనా ఓటమి మరింత బలాన్ని ఇస్తుందని, అధికార పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోరాటం సాగిస్తామని తెలిపారు. తనకు లాయర్గా అనుభవం ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ నాయకుల ఆగడాలకు ఎవరైనా ఇబ్బందులకు గురైతే వారికి దన్నుగా ఉండడమే కాకుండా న్యాయపరంగా కూడా అండగా ఉంటానన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడా అరాచకాలు, దోపిడీలు చేయలేదని, టీడీపీ నాయకులపై దాడులు కాని, పోలీసు కేసులు కాని పెట్టిన దాఖలాలు లేవన్నారు. కానీ ఇపుడు టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రం అంతటా దాడులు జరుగుతున్నాయని, శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని తెలిపారు. టీడీపీ ఆగడాలను అడ్డుకుంటామని కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు మాట్లాడుతూ రానున్న రోజుల్లో అధికార పార్టీ నాయకులు.. వైఎస్సార్ సీపీ సర్పంచులు, ఎంపీటీసీల అధికారాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మళ్లీ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే మండలంలో వైఎస్సార్ సీపీ సత్తా చూపిస్తామని తెలిపారు. కోటవురట్ల మండలం వైఎస్సార్ సీపీకి కంచుకోటగా నిరూపిస్తామని శపథం చేశారు. తంగేడు రాజకుటుంబీకులంతా కార్యకర్తలకు అండగా ఉంటూ పూర్వ వైభవాన్ని తీసుకొస్తామన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే వెంటనే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అక్కడా చట్టపరంగా న్యాయం జరగకపోతే ప్రైవేటు కేసులు పెట్టి న్యాయస్థానంలో పోరాడతామని తెలిపారు. అందుకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని స్పష్టం చేశారు. ఈ రెండేళ్లూ సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి అంశం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఆర్.ఎస్. సీతారామరాజు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పైల రమేష్, జిల్లా కార్యదర్శి యల్లపు కుమారరాజా, వైఎస్సార్ సీపీ నాయకుడు సిద్ధాబత్తుల సత్యనారాయణ మాట్లాడారు. పార్టీ నాయకులు సత్యనారాయణరాజు, శింగంపల్లి కిషోర్, మాజీ జెడ్పీటీసీ వెంకటలక్ష్మి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు -
● 22,300 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేసిన అధికారులు ● డి–కృషి యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ ● అందుబాటులో 11 రకాల వరి వంగడాలు ● అపరాలు, వేరుశనగ, నువ్వులు విత్తనాల్లో 40 శాతం రాయితీ ● అన్ని ఆర్బీకేల్లో నేటి నుంచిపంపిణీకి సిద్ధం
విత్తనాల రకాలు.. వాటి ధరలు వరిలో రకాలు క్వింటాళ్లు రాయితీ పోను బస్తా ధర ఆర్జీఎల్ 2537 13,500 రూ.954 బీపీటీ 3291 1,092 రూ.834 బీపీటీ 5204 2,268 రూ.795 ఎంటీయూ 1061 592 రూ.894 ఎంటీయూ 1064 1800 రూ.894 ఎంటీయూ 1121 979 రూ.894 ఎంటీయూ 1224 940 రూ.894 ఎంటీయూ 7029 340 రూ.894 ఎంటీయూ 1318 800 రూ.894 ఎన్ఎల్ఆర్–34449 17 రూ.915 ఆర్ఎన్ఆర్ 15048 48 రూ.834 సాక్షి, అనకాపల్లి: ఖరీఫ్ సాగుకు వ్యవసాయ అధికారులు విత్తనాలు సిద్ధం చేశారు. రైతులకు వరి, అపరాలు, వేరుశనగ, నువ్వుల విత్తనాలు సబ్సిడీపై అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. శనివారం నుంచి జిల్లాలో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రావు వెల్లడించారు. కావాల్సిన రైతులు డి–కృషి యాప్ ద్వారా గానీ, నేరుగా ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. విత్తనాల ధరలు కూడా ప్రకటించారు. మరోవైపు గత ఖరీఫ్ కంటే ఈసారి సాగును పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సకాలంలో పంటలు పండాయి. ఈసారి అదే తరహాలో ఖరీఫ్లో సాగును మరింత పెంచా లని వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో గతేడాది ఖరీఫ్ సీజన్లో 84 వేల హెక్టార్లలో సాగు జరిగింది. ఇందులో 60 వేల హెక్టార్లలో వరి పంట, 15 వేల హెక్టార్లలో చెరకు, మిగిలినవి వేరుశనగ, చోళ్లు, గంటెలు, చిరుధాన్య పంటలు వేశారు. అదే తరహాలో ఈ ఖరీఫ్ సీజన్లో కూడా సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుబాటులో 11 రకాల వరి వంగడాలు విత్తనాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేయనున్నారు. వ్యవసాయ అధికారులు గోదాముల్లో విత్తనాలను, ఎరువులను సిద్ధం చేసి ఉంచారు. ఖరీఫ్లో రైతులకు అధిక దిగుబడి ఇచ్చే విధంగా 4 కొత్త వరి వంగడాలను ఈ ఏడాది అందుబాటులోకి అధికారులు తీసుకొచ్చారు. వరి విత్తనాల్లో మొత్తం 11 రకాలు ఆర్బీకేల్లో సిద్ధం చేశారు. వీటిలో మార్టేరు సాంబ(ఎంటీయూ1224) రకం, మార్టేరు మసూరి (ఎంటీయూ1262) రకం, ఎంటీయూ 1318 రకం, శ్రీధృతి (ఎంటీయూ 1121) రకం వరి విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటుగా అపరాలు, వేరుశనగ, నువ్వులు విత్తనాలను 40 శాతం సబ్సిడీతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్బీకేల్లో అపరాలు 91 క్వింటాళ్లు, వేరుశనగ 143 క్వింటాళ్లు, నువ్వులు 11 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు.కొత్త వంగడాల ప్రత్యేకతలు మార్టేరు సాంబ (ఎంటీయూ 1224): ఇది సన్న బియ్యం రకం. ఈ రకం సాంబ మసూరి (బీపీటీ–5204) వంగడానికి ప్రత్యామ్నాయ రకం. ఇది ఖరీఫ్కు అనువైంది. ఇది 140 రోజుల కాలపరిమితిలో పంట పూర్తవుతుంది. చేను పడిపోదు. సుడి దోమని తట్టుకుని మంచి దిగుబడిని ఇస్తుంది. గింజ రాల్చే గుణం తక్కువగా ఉంటుంది. రెండు వారాలు నిద్రావస్థ దశలో ఉంటుంది. ఎకరానికి 2.6 టన్నుల (34 బస్తాలు) దిగుబడి ఇస్తుంది. మార్టేరు మసూరి (ఎంటీయూ 1262): ఈ రకం వంగడం శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్–2537) రకానికి ప్రత్యామ్నాయం. 155 రోజుల కాల పరిమితిలో పంట పూర్తవుతుంది. ఖరీఫ్కు అనువైన వంగడం. సుడి దోమని తట్టుకుంటుంది. ఎండు తెగులును తట్టుకుని అధిక దిగుబడి ఇస్తుంది. ఎకరానికి 2.6 నుంచి 2.8 టన్నుల(36 బస్తాలు) దిగుబడి నిస్తుంది. ఎంటీయూ 1318: ఈ రకం స్వర్ణ (ఎంటీయూ 7029)కు ప్రత్యామ్నాయం. 150 రోజుల కాలపరిమితిలో పంట పండుతోంది. ఖరీఫ్కు అనువైన వంగడం. చేను పడిపోదు. అగ్గి తెగులును తట్టుకునే స్వభావం ఉంటుంది. ఇది సన్నబియ్య రకం. ఎకరానికి 3 టన్నులు (40 బస్తాలు) దిగుబడి నిస్తుంది. శ్రీధృతి (ఎంటీయూ 1121): 125 రోజుల కాలపరిమితి. ఈ రకం నుంచి దోమ, అగ్గి తెగులు తట్టుకుంటుంది. ఎకరాకు 3 టన్నులు (40 బస్తాలు) దిగుబడినిస్తుంది. -
పోలీస్ ఉద్యోగుల గ్రీవెన్స్
తుమ్మపాల: పోలీస్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక చొరవ చూపి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ ఉద్యోగుల గ్రీవెన్స్ నిర్వహించారు. పోలీస్ ఉద్యోగుల నుంచి సమస్యలపై వినతులను ఆయన స్వీకరించారు. ఎనిమిది మంది ఉద్యోగులు వారి వ్యక్తిగత సమస్యలతోపాటు అనారోగ్యం, ఉద్యోగ అంశాలను ఆయనకు వివరించారు. గ్రీవెన్స్లను పరిశీలించి క్షేత్రస్ధాయిలో విచారణ ద్వారా పరిష్కరించనున్నట్లు ఆయన తెలిపా రు. అదనపు ఎస్పీ బి.విజయభాస్కర్ పాల్గొన్నారు. -
పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలకు..
● డీఈవో వెంకటలక్ష్మమ్మ తుమ్మపాల: ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు ను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉన్నత స్ధానాలకు చేరేందుకు పట్టుదలతో చదవాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మ మ్మ అన్నారు. పట్టణంలో జీవీఎంసీ ఉన్నత పాఠశాల గాంధీనగర్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభ వేడుకల్లో ఆమె పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు స్కూళ్ల విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరుస్తున్నారని, ఈ విద్యా సంవత్సరంలో కూడా మంచి ఫలితాలు సాధించాలన్నారు. మంచి రుచికరమైన మధ్యాహ్న భోజనంతో పాటు పిల్లలకు దుస్తులు, బ్యాగ్, షూస్, పుస్తకాలు ప్రభుత్వమే అందిస్తుందన్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించి శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
హోం మంత్రిగా అనిత.. టీడీపీ శ్రేణుల్లో ఆనందం
నక్కపల్లి: పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైన హోంమంత్రిగా అవకాశం లభించడంతో నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లా నుంచి మంత్రులైన నేతలెవరినీ హోంశాఖ వరించలేదు. నియోజకవర్గం ఏర్పడిన ఆరు దశాబ్దాల తర్వాత ‘పాయకరావుపేట’కు మంత్రి పదవి దక్కడంతోపాటు ముఖ్యమైన శాఖ రావడం పట్ల సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానన్నారు. మహిళా చట్టాలు మరింత పటిష్టంగా అమలు జరిగేందుకు తన వంతు పాటుపడతానన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కురందాసు నూకరాజు, కొప్పిశెట్టి కొండబాబు, మాజీ ఎంపీపీ దేవర సత్యనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో తొలిసారిగా శనివారం నియోజకవర్గానికి వస్తున్న అనితకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. -
No Headline
తుమ్మపాల: సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి శాంతిప్రభ అన్నారు. మండలంలో తగరంపూడి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న రోగుల ఓపీ వివరాల ప్రకారం వారికి అందిస్తున్న వైద్యసేవలు, మందుల పంపిణీపై ఆరా తీశారు. ఫార్మసీ, స్టోర్స్, కోల్డ్ చైన్రూమ్, ఓటీ రూమ్, వార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు, అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో బి.తిరుపతిరావు, హెల్త్ సూపర్ వైజర్ ఉదయ్కుమార్ పాల్గొన్నారు. -
No Headline
తుమ్మపాల: చక్కని రహదారులు.. ఎటు చూసినా పచ్చదనం.. అధునాతన భవనాల నిర్మాణం.. పర్యాటక కేంద్రంగా ఎదిగిన బొజ్జన్నకొండ ఇప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తోంది. బౌద్ధ స్ధూపాలు, చైచ్యాలు, గుహలు, బౌద్ధ వేదశాల, చరిత్రను ప్రతిబింబించే పురాతన శిలలు ఇక్కడి ప్రత్యేకత. దీంతోపాటు లింగాలకొండ బొజ్జన్నకొండను ఆనుకుని ఉండటం మరో విశేషం. గౌతమబుద్ధుడు ఇక్కడ నడయాడినట్లు చరిత్ర చెబుతుంది. ఒకప్పుడు మచ్చుకై నా గుర్తింపులేని బొజ్జన్నకొండ.. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి ఎంపీ ల్యాడ్స్ నిధులు వెచ్చించి, రూ.7.5 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరయ్యేలా కృషి చేయడంతో కొత్త రూపు సంతరించుకుంటోంది. బొజ్జన్నకొండకు అత్యంత నాణ్యమైన రహదారి నిర్మించారు. అధునాతన సోలార్ లైట్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి అధునాతన భవనాలను నిర్మించేందుకు కృషి చేసింది. ఇప్పుడు శరవేగంగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పురాతన కట్టడాలు శిథిలమవ్వకుండా మరమ్మతులు చేపడుతున్నారు. పెరిగిన పర్యాటకులు గత ప్రభుత్వాలు ఈ బౌద్ధ క్షేత్రాన్ని నిర్లక్ష్యం చేశాయి. హైవే నుంచి ఇక్కడకు రావాలంటే పెద్ద గోతులతో ఉన్న రహదారిని దాటుకొని రావాలి. అందుకే పర్యాటకులు బెంబేలెత్తిపోయేవారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. నూతన జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న బొజ్జన్నకొండను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అత్యధిక నిధులు వెచ్చించారు. దీంతో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సాయంత్రం అయ్యేసరికి వంద ల సంఖ్యలో కొండ వద్దకు తరలివస్తున్నారు. తీవ్ర ఉష్ణోగ్రతల నుంచి విముక్తి పొందుతూ సేద తీరుతున్నారు. వేసవి సెలవుల్లో చిన్నారులు బొజ్జన్నకొండ వద్దనే ఆటపాటలతో సందడి చేశారు. దీంతో ఇక్కడ చిరు వ్యాపారాలు కూడా జోరందుకున్నాయి. జిల్లా టూరిజం శాఖ మంచినీరు, వాష్రూమ్ సౌకర్యం కల్పించింది. అనకాపల్లి–చోడవరం రహదారిలో తుమ్మపాల ఏలేరు కాలువ మీదుగా, అనకాపల్లి–సబ్బవరం రహదారి శంకరం ఏలేరు కాలువ మీదుగా కూడా సందర్శకులు రాకపోకలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో పరిసర ప్రాంత ప్రజలు వాకింగ్, జాగింగ్, వ్యాయామం కోసం ఇక్కడకు వస్తున్నారు.ప్రవేశం ఉచితం అనేక సౌకర్యాలు, చక్కని గ్రీనరీతో తీర్చిదిద్దిన బొజ్జన్నకొండ సందర్శనకు ప్రవేశం ఉచితం. కేవలం ఆధార్ కార్డు చూపించి బొజ్జన్నకొండపైకి ప్రవేశించవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశం కల్పిస్తున్నారు. వందల సంఖ్యలో పెద్దలు, చిన్నారులు వచ్చి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. బొజ్జన్నకొండకు సందర్శకుల తాకిడి చిన్నారుల సందడితో కళకళ టూరిస్టు స్పాట్గా తీర్చిదిద్దడంతో పెరిగిన ఆదరణ
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
హైదరాబాద్లో తగ్గిపోయిన ఇళ్ల అమ్మకాలు
నాకన్నీ నువ్వే అమ్మా.. హ్యాపీ ఫాదర్స్ డే
సిలబస్ కాషాయీకరణ..‘ఎన్సీఈఆర్టీ’ డైరెక్టర్ క్లారిటీ
ఖాళీ కుర్చి.. అమెజాన్ బెజోస్ టెక్నిక్ ఇది..!
ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇది ఒకెత్తు!
రుషి కొండ భవనాలపై టీడీపీ విష ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
వైభవంగా జరిగిన ఐశ్వర్య అర్జున్, ఉమాపతి రిసెప్షన్ (ఫొటోలు)
కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురి పెళ్లి.. గ్రాండ్గా రిసెప్షన్
ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
Advertisement