ఎర్రగుంట్ల : మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె గ్రామానికి చెందిన జీవీ నారాయణరెడ్డి బుధవారం ప్రొద్దుటూరులో జరిగే మేమంతా సిద్ధం సభకు వస్తుండగా బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నారాయణరెడ్డి సిద్ధం సభకు రావడానికి గ్రామం క్రాసు రోడ్డు వద్ద నుంచి కారు ఎక్కడానికి రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన నారాయణరెడ్డిని వెంటనే స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు భాస్కర్రెడ్డి ఆసుపత్రికి తరలించారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
ఎర్రగుంట్ల : మండల కేంద్రమైన ఎర్రగుంట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ అతి సమీపంలో వెన్నపూస రామచంద్రారెడ్డి (47) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని రైల్వే పోలీసులు తెలిపారు. కదిరిపల్లె గ్రామానికి చెందిన వెన్నపూస రామచంద్రారెడ్డి ఎర్రగుంట్ల పట్టణంలోని మహాత్మనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. పట్టణంలో పాలీస్ మిషన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, పిల్లలు కలరు. సంఘటన స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
చోరీ సొమ్ము రికవరీ
– నిందితులు అరెస్టు
ముద్దనూరు : ఏడాది క్రితం జరిగిన బంగారు చోరీ కేసులో నిందితులను అరెస్టుచేసి, చోరీకి గురైన సొమ్మును స్థానిక పోలీసులు రికవరీ చేశారు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు... 2023 ఫిబ్రవరి 15వ తేదీన స్థానిక 4 రోడ్ల కూడలి సమీపంలో పులివెందుల రహదారిలో వున్న పాలగిరి విశ్వనాథ ఆచారి ఇంటిలో బంగారు నగలు చోరీకి గురయ్యాయి. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అప్పట్లో ఈ దొంగతనం జరిగింది. ఈ కేసులో శ్రీసత్యసాయిజిల్లా ధర్మవరానికి చెందిన నమ్మే రామాంజినేయులు, కదిరికి చెందిన యనమల ఆంజనేయులు అనే నిందితులను అరెస్టు చేసి, 18.5 తులాల బంగారు నగలను రికవరీ చేసినట్లు బుధవారం సీఐ తెలిపారు.
బాకీ విషయమై ఘర్షణ
కడప అర్బన్ : కడప నగరంలోని నబీకోట శివాలయం సమీపంలో బుధవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు బాకీ విషయమై ఒకరిచొక్కా, మరొకరు పట్టుకుని ఘర్షణ పడ్డారు. నబీకోట ప్రాంతానికే చెందిన ఇరువురు ఒకరినొకరు ఎదురుపడ్డారు. బాకీ విషయమై మాటామాటా పెరిగి తోపులాట జరిగింది. నడిరోడ్డుపై ఈ సంఘటన జరగడంతో వాహనాల రాకపోకలకు దాదాపు అరగంటసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో స్థానికులు కలుగచేసుకుని వారిని విడిపించి అక్కడి నుంచి పంపించారు. ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోపు ఎవరూలేరు. అంతేగాకుండా ఎవరూ ఫిర్యాదు చేయలేదని కడప తాలూకా పోలీసులు తెలియజేశారు.
బీజేపీ అభ్యర్థుల ఖరారు
కడప కోటిరెడ్డిసర్కిల్ : రానున్న ఎన్నికల్లో జిల్లా లోని బద్వేలు, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చే స్తూ బీజేపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. జ మ్మల మడుగు అభ్యర్థిగా సి.ఆదినారాయణరెడ్డి, బద్వే లు అభ్యర్థిగా బొజ్జా రోషన్నను ప్రకటించారు.
మల్లూరమ్మ హుండీ ఆదాయం లెక్కింపు
చిన్నమండెం : మండల పరిధిలోని మల్లూరు గ్రామంలో వెలసిన శ్రీ మల్లూరమ్మ తల్లి ఆలయంలో బుధవారం హుండీల ఆదాయం లెక్కించారు. ఆలయ ఉన్నతాధికారుల అధ్యక్షతన జరిగిన లెక్కింపులో రూ.2,92,741 ఆదా యం వచ్చింది. ఈ నగదును బ్యాంకులో జమ చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.