ఇంటి నుంచే ఓటు వేస్తారా.. దరఖాస్తు చేయండి | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచే ఓటు వేస్తారా.. దరఖాస్తు చేయండి

Published Wed, Apr 17 2024 2:40 AM

-

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ హోమ్‌ ఓటింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న విభిన్న ప్రతిభావంతులకు ఈసారి కొత్తగా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించిందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో భాగంగా కల్పించిన ఈ అవకాశాన్ని అర్హత ఉన్నవారు వినియోగించుకోవాలన్నారు. దీనికోసం వెంటనే ఫారమ్‌ 12(డి) ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్నవారితో తుది హోమ్‌ ఓటింగ్‌ జాబితా రూపొందిస్తామన్నారు.. హోమ్‌ ఓటింగ్‌ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకొనే వారికి మే 7, 8 తేదీల్లో ఉదయం 8 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు మధ్య అవకాశాన్ని కల్పించే అవకాశం ఉందన్నారు. బ్యాలెట్‌ పత్రాల ద్వారా జరిగే ఈ విధానంలో కూడా, దరఖాస్తుదారుని ఇంట్లో ప్రత్యేకంగా కంపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేసి, ఏకాంతంగా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. కుటుంబ సభ్యులను మాత్రమే వారికి సహకారం అందించేందుకు అనుమతిస్తామన్నారు.

Advertisement
Advertisement