Sakshi News home page

మైపాడుబీచ్‌లో మునిగి యువకుడి మృతి

Published Wed, Nov 15 2023 12:28 AM

జావీద్‌ మృతదేహం  
 - Sakshi

ఇందుకూరుపేట: స్నేహితులతో సరదాగా సముద్రంలో మునిగేందుకు వచ్చిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతై మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మండలంలోని మైపాడు బీచ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు...అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన సయ్యద్‌ జావీద్‌(26) కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి తొమ్మిది మంది కారులో సేదతీరేందుకు మైపాడు బీచ్‌కు వచ్చారు. సముద్రంలో స్నానాలు చేసే సమయంలో అలల ఉద్ధృతికి జావీద్‌ నీటమునిగి గల్లంతయ్యాడు. సహచరులు తీవ్ర ఆవేదనతో తీరం వెంబడి వెతుకుతూ ఉండిపోయారు. సుమారు గంట సేపటికి జావీద్‌ విగతజీవిగా మారి ఒడ్డుకు చేరుకున్నాడు. దీంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న కోవూరు సీఐ డీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అల్పపీడన కారణంగా సముద్రం కసురుగా ఉందని, తీరానికి వచ్చే వారు అప్రమత్తంగా ఉండాలని సీఐ హెచ్చరించారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నందున కార్తీక మాసం సందర్భంగా సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించేవారు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement