● అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్
పెద్దపల్లిరూరల్: కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించి అధిక దిగుబడి సాధించేలా ప్రోత్సహిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామ్ప్రసాద్లాల్ అన్నారు. మనదేశంలో కృషి విజ్ఞాన కేంద్రాలు ప్రారంభించి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి ఖిల్లాలో స్వర్ణోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ను కలెక్టరేట్లో పలువురు శాస్త్రవేత్తలు కలుసుకుని స్వర్ణోత్సవాల టార్చ్ అందించారు. డాక్టర్ మోహన్సింగ్ మెహతా కమిటీ సిఫారసు మేరకు తొలిసారి పాండిచ్చేరిలో 1974 మార్చి 21న కృషి విజ్ఞాన కేంద్రం స్థాపించారని అదనపు కలెక్టర్ అన్నారు. ఇప్పటివరకు మనదేశంలో 731 కృషి విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పంటల దిగుబడిలోనే కాకుండా రైతుల సాంఘిక, ఆర్థికాభివృద్ధికి అవి కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. నూతన వంగడాలను సృష్టించడం, క్షేత్ర పరిశీలనలు, శిక్షణ, వివిధ మాధ్యమాల ద్వారా సలహాలు, సూచనలు అందించడంలో రైతులకు కీలకంగా మారారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం ఖిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ఎ.శ్రీనివాస్, శాస్త్రవేత్తలు వై.వెంకన్న, భాస్కరరావు, వినోద్కుమార్, కిరణ్, నవ్య, అర్చన తదితరులు పాల్గొన్నారు.