నల్లగొండ : వరంగల్– ఖమ్మం –నల్లగొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్లో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఉండొద్దని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున బ్యాలెట్ పేపర్ ఎలా మడత పెట్టాలో తెసుకోవాలని సూచించారు. 800 పైబడి ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలకు 2 బ్యాలెట్ బాక్సులు ఇస్తామని తెలిపారు. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినందున.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎడమ చేయి మధ్య వేలికు సిరా గుర్తు పెట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం సరఫరా చేసిన వాయిలెట్ స్కెచ్ పెన్ ద్వారా మాత్రమే ఓటర్లు ఓటు వేయాలన్నారు. ఓటు వేసిన తర్వాత ఎవరైనా ఫొటో తీస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ప్రిసైడింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను వివరించారు. సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నటరాజ్, ఆర్డీవోలు, మాస్టర్ ట్రైనర్ బాలు పాల్గొన్నారు.
ఫ పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ హరిచందన