జగిత్యాలజోన్: అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. శుక్రవారం జిల్లా కోర్టులో న్యాయ సే వా అధికార సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జ యంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంత రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడారు. అన్ని వర్గాలకు సమన్యాయం అందించేందుకు పాటు పడ్డ గొప్ప మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రచనలో కీలకపాత్ర వహించారని వివరించారు. నేటి యువ త ఆయన ఆశయాల కొనసాగింపుకు ప్రయత్నించాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ జడ్జి ప్రసాద్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీజ, రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వినీల్కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డబ్బు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి భూమి రమణకుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.
మరో రెండురోజుల పాటు ఎస్సారెస్పీ నీరు
సారంగాపూర్(జగిత్యాల): మరో రెండురోజుల పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి డీ–53 ప్రధాన కాలువ ద్వారా పంటలకు సాగు నీరందించనున్నట్లు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సారంగాపూర్ విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. భూగర్భజలాలు అడుగంటి పోవడం, ఎస్సారెస్పీలో నీటి నిల్వలు పడిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడానని, ఎస్సారెస్పీ కింద వివిధ ప్రాంతాల్లోని పంటలకు సాగునీరు అందించడానికి సీఎం అంగీకరించారని తెలిపారు. ఇందులో భాగంగా డీ–53 ప్రధాన కాలువ ద్వారా ఈ నెల 14,15వ తేదిల్లో సాగునీరు విడుదల చేస్తారని రైతులు నీటిని వినియోగించుకోవాలని సూచించారు. కాగా సారంగాపూర్, బట్టపల్లి, పోతారం గ్రామాల్లో పంటలు ఎండిపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తానని జీవన్రెడ్డి పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి
జగిత్యాలరూరల్: వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లై అధికారి వరప్రసాద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్రావు అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం, తాటిపల్లి, అర్బన్ మండలం అంబారిపేట గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రాల్లో రైతులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని, తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. రైతులకు అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన తేమ నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యం తూకం వేయాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతులు తప్పనిసరిగా ఆధార్కార్డు, పట్టాపాస్బుక్, బ్యాంక్ ఖాతా వివరాలను నిర్వాహకులకు అందజేయాలన్నారు. ఏపీఎం గంగాధర్, సీసీలు గంగారాం, విద్యాసాగర్, వీవోఏలు విజయ, పావని, శేఖర్, హారిక పాల్గొన్నారు.