● హామీలు తప్ప ఆచరణ శూన్యం ● ఎన్నికల అస్త్రంగా వాడుకుంటున్న వైనం
ధర్మపురి: ప్రభుత్వాలు మారుతున్నా ధర్మపురి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మాత్రం మోక్షం కలగడం లేదు. ప్రతిసారి ఎన్నికల సమయంలో ధర్మపురిని రెవెన్యూ డివిజన్గా చేస్తామని చెబుతున్న నాయకుల మాటలు నీటి మూటలవుతున్నాయి. జిల్లాలోనే అతిపెద్ద ఆలయమైన లక్ష్మీనృసింహస్వామి ఇక్కడ కొలువై ఉన్నారు. గ్రామ పంచాయతీ నుంచి మేజర్పంచాయతీ.. తర్వాత మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. పైగా నియోజకవర్గంగా కూడా మారింది. డివిజన్ ఏర్పాటుకు కావాల్సిన సకల సదుపాయాలున్నా అధికారులు, రాజకీయ ఒత్తిళ్లతో కల నెరవేరడం లేదు. ధర్మపురిని రెవెన్యూ డివిజన్ చేస్తే వెల్గటూర్, ఎండపెల్లి, ధర్మారం, బుగ్గారం, గొల్లపల్లి, పెగడపెల్లి మండలాల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయంటున్నారు ఇక్కడి ప్రజలు.