మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు నరేందర్రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా(క్యాబినెట్ హోదా) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2002లో తెలుగుదేశం తరఫున నల్లబెల్లి జెడ్పీటీసీగా పోటీ చేసి ఓడిపోయిన వేం నరేందర్రెడ్డి.. 2004 శాసనసభ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధితో పాటు అనేక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009 సంవత్సరం పునర్విభజనలో భాగంగా మహబూబాబాద్ స్థానం గిరిజనులకు కేటాయించడంతో నరేందర్రెడ్డికి అవకాశం లేకుండా పోయింది. అయినా రాజకీయాల్లో కొనసాగుతూ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు. నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రేవంత్రెడ్డి శాసనమండలి సభ్యుడిగా ఎంపికయ్యారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహబంధం పెరిగింది. 2015లో శాసనమండలి సభ్యుడిగా ఎమ్మెల్యేల కోటాలో పోటీ చేసిన నరేందర్రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి పార్టీ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేశారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటూ శాసనసభ ఎన్నికల ప్రచారం, నియోజకవర్గ సమావేశాల్లో కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
ప్రభుత్వ సలహాదారుగా
నరేందర్రెడ్డి నియామకం
కాంగ్రెస్ శ్రేణుల హర్షం